23, అక్టోబర్ 2013, బుధవారం

విజయనగరం అల్లర్లు... పరిశీలన

ఎవ్వరూ కలలో కూడా ఊహించని ఘటనలకు విజయనగరం వేదికయ్యింది. మండించే భాష్పవాయు గోళాల ప్రయోగాలనూ లెక్కచేయకుండా ఆందోళనాకారులు పోలీసులపైకి రాళ్ళవర్షం కురిపించారు. పిసిసి చీఫ్ సత్తిబాబు, కుటుంబం, అనుచరుల ఆస్తులే టార్గెట్ గా సమైక్య ఆందోళనకారులు విధ్వంసా లకు దిగారు. ఈ ఆకస్మిక విధ్వంసపూర్వక ఆందోళనకు కారణం కేవలం బొత్సపై వ్యతిరేకతేనా? కనిపించని జెండాలేమైనా తమ అజెండాల కోసం పనిచేస్తున్నాయా? పోలీసులు అనుమానిస్తున్నట్లు సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అసాంఘిక శక్తులేమైనా చెలరేగాయా? బొత్సపై ఓట్లేసే జనాభిప్రా యమేమిటి?

బొత్స సత్యన్నారాయణ గడచిన పది సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా విజయనగరం జిల్లాను ఏలు తున్న కుటుంబ పెద్ద. కాంగ్రెస్ కార్యకర్తగా వున్న ఓ సాధారణ వ్యక్తిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షునిగా చేసిన రాజకీయ గురువు పెనుమత్సనూ వంచిస్తూ అనతి కాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి చీఫ్ గా ఎదిగిన ఘన చరిత్ర బొత్సది అంటూ ఆందోళనకారులు ఒకింత వ్యంగంగానే ఆయన గురించి మాటలు మొదలుపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడే దుస్థితి నుంచి ఆబగా అందినకాడికి ఆక్రమించుకున్న పెద్దాయన మా పక్కింటి సత్తిబాబు అంటూ కొంత కారంగానే సమాధానమిచ్చే గళాలన్నీ ఇప్పుడు విజయనగరంలో ఓ చోట కూడుతున్నాయి. బొత్సకు తిరుగులేని కోట విజయనగరం అని నిన్నటి వరకూ అనుకున్న వారి అంచనాలను తల కిందులు చేస్తూ వరుసగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమం ప్రారంభమైన తరువాత గడ చిన రెండునెలలకు పైగా కాలంలో ఒక్కసారి కూడా సత్తిబాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ గడ్డ పైకాలు మోపలేకపోయారన్న ప్రచారం అతిశయోక్తి కాదు. ఇసుక మాఫియా డాన్, లిక్కర్ కింగ్ సత్తి బాబు అంతుచూస్తామనే వారి సంఖ్య గణనీయంగానే వుంది. ఇలా అరిచేవారిలో అత్యథికులు కాంగ్రెస్ శ్రేణికి చెందిన వారే అన్నదే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశక్తికరమైన విషయమని రాజకీయ పండితులే ముక్కుమీద వేలేసుకుంటున్నారు. 

సమైక్య ఉద్యమం ప్రారంభమైన 65రోజుల తరువాత విజయనగరంలో ఉద్యమం ఓ మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఈ మలుపు హఠాత్తుగా తిరిగిందేమీ కాదని, ముందుగా కనిపించిన సైన్ బోర్డులను చూడటంలో పోలీస్ ఇంటెలిజెన్స్ విఫలమైందన్న వాదనా వుంది. బొత్సకు వ్యతిరేకంగా వస్తున్న నినాదాలు, బొత్సనే టార్గెట్ చేస్తూ సాగిన  విద్యార్థుల ఆందోళనలు, తమను కొట్టిన బొత్సా వర్గానికి వ్యతిరేకంగా బలంగా సమీకృతమైన విద్యార్థి - యువజనులు ఒక ఎత్తైతే... ఎపిఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయ జెఎసీ, న్యాయవాద జెఎసీలు బొత్స సత్యన్నారాయణ ఇంటికి వెళ్ళే మార్గంలో మహాత్మాగాంధీ రోడ్డులోని అమ్మవారి గుడికి సమీపంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు... అదే సమయంలో బలహీన పోలీస్ బారికేడింగ్ వ్యవస్థను తోసుకుంటూ బొత్సా ఇంటి ముందు బైఠాయింపు... కలగలసి, గడ్డిపోచల కలనేత ఏకులై, పోలీస్ వ్యవస్థకు మేకులైన తీరే పోలీస్, నిఘా వర్గాల వైఫల్యానికి సజీవసాక్ష్యాలు. ఉద్యమానికి పిలుపునిచ్చి, ఉద్యమవీరులుగా మీడియాలో వినుతి కెక్కిన అధికారులు, ఆర్టీసీ కార్మికులు... తక్కువ జీతగాళ్ళు, పై ఆర్జనలు లేని చిరుద్యోగులు ఆర్థికం గా పడుతున్న బాధలు ప్రజలకు చేరుతున్న దశలో అనూహ్యంగా పరిస్థితి మారింది. 

రాజకీయ పార్టీలకు తావులేదు. వేదికలపై స్థానంలేదు... అన్న బలమైన గొంతుక బలహీనపడింది. వై ఎస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తూనే వినిపించిన సమైక్య మోహనరాగానికి పునఃసమీకృతమైన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బలంగానే ముందుకు దూకాయి. విశాఖ నుంచి విజయనగరం వెళ్ళే దారిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సుమారు 10కిపైగా అడ్డంకులలో జెండా పట్టని శ్రేణులే అధిక సంఖ్యలో కనిపించాయి. మూడవ తేదీ ఎపిఎన్జీవోలు పోలీస్ బారికేడ్లను, పోలీస్ దండును నెట్టుకుని బొత్సా ఇంటికి చేరుకున్నారు. సాయంత్రానికి విజయనగరం యథావిథిగా చల్లబడింది. గడచినదిన అనుభవాలతో మరుసటి రోజు పోలీసులు బొత్సా ఇంటికి మూడు వైపులా మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం పదిగంటలకు ఎంజీ రోడ్డులోని బొత్స ఇంటికి దారితీసే వీథి ఎదురుగా వివిధ జెఎసీలు చేపట్టిన ఆటపాట, వంటావార్పు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకూ ఊపుగా సాగిన ఆ కార్యక్రమాలను విద్యార్థి, యువజనలు కొనసాగించారు. సాయంత్రం సుమారు ఆరుగంటల ప్రాంతంలో ఊరేగింపుగా వచ్చిన ఎన్జీవోలను, ఆర్టీసీ కార్మికులను కలుపుకోవటానికి వాళ్ళు తృణీకరించారు. పోలీసులపైకి ఆకతాయితనపు తోపులాటలు, నిర్భీతిగా బల గాల ముందే టైర్లు, తాటాకులను తగలబెట్టటాలు, జన సంస్కృతంలో బొత్సాను, కుటుంబ సభ్యులను తిట్టిన తిట్లు చూస్తున్న మీడియాకు ఏదో జరగబోతోందన్న అనుమానాలు బలపడసాగాయి. లంకా పట్నం, కొత్తపేట నీళ్ళట్యాంకు, దాసన్నపేట, పద్మావతీ నగర్, జొన్నగుడ్డి, పల్లె వీథి తదితర ప్రాంతా లకు చెందిన యువత బలంగా సమీకృతమవటం ప్రారంభమయ్యింది. అక్టోబర్ ఐదవ తేదీ అనుమా నాలను నిజంచేస్తూ ఉదయం సుమారు 10.30గంటల ప్రాంతంలో రాళ్ల యుద్ధం ప్రారంభమైంది. కోట, మూడు లాంతర్ల జంక్షన్ లకు మధ్య వున్న అర కిలోమీటరు నిడివి వున్న బజారు పోరాట ఆరం భవేదికయ్యింది. దానిని పోలీసులు మెల్లమెల్లగా కోట జంక్షన్ వరకూ నెట్టుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ గోళాలను ప్రయోగించారు. అయినా వెనక్కు తగ్గలేదు. సరికదా... మూడు లాంతర్ల జంక్షన్ కు పోలీసులను పరిమితం చేస్తూ ఇటు కోట జంక్షన్ నుంచి అటు అంబటి సత్రం నుంచి ఆందోళనకారులు రాళ్ళ దాడులుకు దిగారు. 

ఈ క్రమంలో ఆందోళనకారుల ఆగ్రహం మీడియాపైకి కూడా మళ్ళింది. పుకార్లు ఎలా షికారు చేస్తాయ న్న విషయం అందరికీ బోధపడిన సందర్భం. జెఎసీ ఛైర్మన్ అశోక్ బాబు విజయనగరం వస్తున్నారన్న వార్త క్షణాలలో పాకిపోయింది. దాని వెంబడే సుమారు పది నిమిషాల తేడాతో తిరిగి ఆయన రావటం లేదన్న వార్త... వెనువెంటనే ఆగ్రహంతో ఊగిపోతున్న ఆందోళనకారులు కోట జంక్షన్లో వున్న వివిధ జెఎసీల టెంట్లను పీకి పాకాన పెట్టారు. అక్కడితో వారి ఆగ్రహం చల్లారినట్లు లేదు. కొద్దిమంది గురజాడ వీథిలోని సత్యా కాలేజీపైకి రాళ్ళు రువ్వారు. ఆఫీస్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలను దగ్ధం చేశారు. కార్యాలయంలో పెట్రోలు పోసి అగ్గిరాజేశారు. మరికొంతమంది గంట స్థంభంకు సమీపంలోని సత్యావిజన్ ను ముట్టడించారు. దీనికి ముందుగానే ఆ ప్రాంతాన్ని చీకటి చేశారు. కదం తొక్కారు. వస్తువలను చితక్కొట్టారు. పెట్రోలుతో దొరికిన వస్తువలనన్నింటినీ తగలపెట్టారు. అదే తెగువతో కార్యాలయానికీ నిప్పు పెట్టారు. మంటలను ఆర్పటానికి వచ్చిన ఫైర్ సిబ్బందిపై చేయి చేసుకుని గెంటివేశారు. దృశ్యీకరిస్తున్న మీడియాను లైట్లు వేయకుండా షూట్ చేయాలంటూ పరుషపదజాలంతో హెచ్చరించారు. ఈ రెండు ఘటనలు చల్లబడకముందే తోటపాలెంలో నివాసముంటున్న బొత్సమేనల్లుడు చిన్న శ్రీను ఇంటిపైకి విద్యార్థుల, యువజనుల దండు కదిలింది. అక్కడ అప్పటికే సిద్ధంగా వున్న చిన్న శ్రీను అనుచరులు ఎదురుతిరిగారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీలు ఝుళిపించారు. ఆ క్రమంలో చినశ్రీను నియమించిన ప్రైవేటు గూండాలు... సిక్కులు నలుగు రిపై కారంతో దాడి చేసి కొట్టారని వార్తలు వచ్చాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని, ఒకరు చనిపోయారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుసటి రోజుకు అంటే ఆరవ తేదీకి ఆ వార్త రాష్ట్రమంతా పాకిపోయింది. అయితే చనిపోయింది ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయం ఆ ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఎవ్వరికీ తెలియకపోవటమే అసలు సిత్రం. ఆ తరువాత చంపేయబడ్డారన్న సంఖ్య రెండుకు చేరుకుంది. అది ఫేస్ బుక్ లకు, ఈ మెయిళ్ళకు పాకింది. దీనితో ఉత్తర కోస్తా ఐజీ ద్వారకాతిరుమలరావు, మరో ఐజీ గోవింద్ సింగ్, డిఐజి ఉమాపతిలతో కలసి మీడియా సమావేశం నిర్వహించి అవన్నీ ఉఠ్ఠి పుకార్లే నంటూ ఖండించారు. ఏలూరు రేంజ్ డిఐజీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా రోజంతా కోట జంక్షన్ వద్ద నిలబడ్డారు. పరిస్థితిని అంచనా వేస్తూ కనిపించారు. ప్రణాళికాబద్ధంగా చేస్తున్న దాడిలో భావోద్రేకాలతో, ఉద్వేగాలతో ఆందోళన చేస్తున్న ఉద్యమకారుల ముందు కొన్ని ప్రేరేపిత శక్తులు చేరాయన్న అంచనాకు ఆయన వచ్చారు. అప్పటికే విజయనగరానికి అడిషనల్ డిజి పూర్ణచంద్రరావుతో పాటు మరో ఇద్దరు ఐజీలు, పలువురు డిఐజీలు, ఎస్పీలు చేరుకున్నారు. డిఎస్పీలు, సిఐల సంఖ్య భారీగానే వుంది. ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగిన రాళ్ళ దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు సాయంత్రాంనికి మరింత ఉధృతమయ్యాయి. బొత్సాకు రాజకీయ పునాది రాయి అయిన కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం ఆందోళనకారుల దాడిలో దగ్ధమయ్యింది. దానికి సమీపంలోని వైన్ షాపు లూఠీ అయ్యింది. బొత్సాకు సన్నిహితులుగా భావించే మరో రెండు మూసివున్న షాపులపై రాళ్ళదాడి చేశారు. నైపుణ్యంతో వీథి లైట్లను కొట్టుకుంటూ పోలీస్ బారికేడ్లను పెద్ద శబ్ధంతో రహదారిపై తోసుకుంటూ సాగిన ఆందోళనకారులు పోలీసు బలగాలను సమర్ధవంతంగా ఎంజీరోడ్డులోకి నెట్టవేశారు. పోలీసులు నిస్సహా యంగాచూస్తుండగానే వారి జీపును తగలపెట్టారు. ఆర్ అండ్ బి కార్యాలయంలో మూడు జీపులకు నిప్పుపెట్టారు. కలెక్టర్ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. చినశ్రీను ఇంటి వద్ద విద్యార్థులపైదాడి చేసిన పాత నేరగాళ్ళైన సిక్కులను పట్టుకోవటానికి కె ఎల్ పురంలోని వారి నివాసాలపైకి దాడి చేశారు. గురు ద్వారపైకి రాళ్ళు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పోలీస్ అధికారులు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

కర్ఫ్యూ మొదటి రోజు... అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం ఆందోళనలు కొనగాయి భాష్పవాయుగోళాల ప్రయోగం కొనసాగింది. రబ్బరు బుల్లెట్లూ ప్రయోగించాల్సి వచ్చింది. గాజులరేగలోని సీతమ్ ఇంజనీ రింగ్ కళాశాలపైనా పెద్ద ఎత్తున దాడి, విధ్వంసకాండ సాగింది. అన్నీ బొత్సా, ఆయన బంధువుల, అనుచరుల ఆస్తులు ఇళ్ళే లక్ష్యంగా సాగిన దాడులు. దాడులు చేసిన వారు నిర్ధిష్టసంఖ్యలోనే వుండ వచ్చుగాక. అయితే వాటిని చూసి ఆనందించిన వారు మాత్రం వేలల్లోనే కనిపించారు. ఎవరిని కదిలిం చినా మరో భావనకు తావులేని మాటే. వాళ్ళ ఆగడాలు భరించిన వారికే  అర్థమవుతాయి. ఆస్థులు పోగేసుకోవటానికి విజయనగరం ప్రజలను నిర్ధాక్షిణ్యంగా తొక్కేసారంటూ పట్టరాని ఆగ్రహం. ఆస్థులను పెంచుకోవటంలో వున్న శ్రద్ధలోని ఆవగింజంతైనా ఇక్కడి ప్రజలపైనా, పట్టణంపైనా లేదన్న ఆవేదన. పోలీసులు కూడా దీనికి మినహాయింపు కాకపోవటం ఈ సందర్భంగా ప్రస్థావనార్హం. బొత్సా కుటుంబం ఆస్థుల విధ్వంసకాండను చూస్తూ ఆనందించని వర్గాలు బహు అరుదుగా కనిపించాయి. అందుకే నేమో కర్ఫ్యూ పెట్టించింది, ఆ సందర్భంగా కరెంటు తీయించింది బొత్సానే అని అంటూ వచ్చిన వదం తులూ నిజమేనన్నంతగా నమ్మకాన్ని పెంచాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశార ని, బొత్సా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాకిన పుకార్లతో మీడియాకు ఊపిరా డలేదు. 

విజయనగరం... ఎక్కడ వుంది అంటూ వెతుక్కునే ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియాకు స్పష్టంగా దాని రూపురేఖలు అర్ధమయ్యాయి. అయితే వారికి కానీ, రాష్ట్రంలోని పోలీస్ పెద్దలకు కానీ, తలలు బద్దలు కొట్టుకునే అనేక మందికి కానీ అర్ధంకాని దల్లా ఒక్కటే. ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం, ఒక చెంప కొడితే మరోచెంప చూపించే ప్రజలు ఒక్కసారిగా ఇంతటి ప్రణాళికాబద్ధ హింసాత్మక తిరుగుబాటుకు ఎలా దిగారు? భరింపశక్యం కానంత విద్వేషపూరిత వ్యతిరేకత వున్న మాట నిజమేకాని అది ఈ స్థాయి విధ్వంసాలకు దారితీయటం మా సర్వీసులే చూడలేదే? దీని వెనుక ఎవరో వున్నారు? అన్న బలమైన అనుమానంతో పోలీసులు తమ విచారణను సాగించారు. పదుల సంఖ్యలో యువకులను, వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వయంగా ఐజీ స్థాయి అధికారి వారిని విచారిస్తూ సాగారు. ఈ సంఖ్యను అధికారికంగా ప్రకటించటానికి అధికారులు నిరాకరించారు. రెండు రోజులపాటు సడలింపే లేని కర్ఫ్యూతో ప్రజలకు ఉక్కపోతకు గురయ్యారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థప్రయోజనాల కోసం వున్నాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాలనూ దర్యాప్తు అధికారలు పరిగణలోకి తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఎంతో మంది మహానుభావులకు ఆలవాలమైన విజయనగరం మసిబారింది. వికటించిన ఉద్యమ స్ఫూర్తి సరికొత్త ముద్రను విడిచిపెట్టింది. సమైక్య ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని లూటీలు తప్ప ఏ ప్రయోజనమూ ఆశించని అల్లరి మూకలు చెలరేగాయా? లేక రాజకీయపరిశీలకులు భావిస్తున్నట్లు రాజకీయ పార్టీలు అధిపత్య పోరులో భాగంగా అల్లరిమూకలను ఉద్యమంపేర విధ్వంసానికి ఉసిగొల్పాయా? తేల్చాల్సిన దర్యాప్తు బృందాలు పనిలోనిమగ్నమయ్యాయి. బహుశా శ్రీకృష్ణ కమిటీ నివేదికలా అది ఎప్పటికీ వెలుగుచూడకపోవచ్చు. వైఫల్య ఫలితానికి జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు. ఎపి ఎన్జీవోలు, ఇతర జెఎసీలు ఉద్యమ విధ్వంసంతో మాకు సంబంధం లేదని శ్రీకాకుళంలో ప్రకటించనూవచ్చు. బొత్స సత్తిబాబు వర్గం తమ స్వీయతప్పిదమేమైనా వుందా? అంటూ ఆత్మ విమర్శకు పాల్పడకపోవచ్చు. కానీ, విజయనగర చరిత్రపుటలకు అంటిన ఎర్రటి మసి మరక తొలిగే అవకాశాలు లేశమాత్రమే.

పండు వెన్నెల నలుపెక్కింది

నీవడిగే ఏ ప్రశ్నకూ సమాధానం రాదు
లేకకాదు...  మరో ప్రశ్నకు తావివ్వరాదని
ప్రకోపించిన ప్రేమ పైత్యానికి సహజ వైద్యమేది?!
కష్టసుఖాలు జీవితంలో వెన్నంటే...
కర్మానుసారమే... పాలేదెక్కువన్నది...
మనఃకాంత చెంతకు చేరలేని ఏకాంతం
దూరంగా నెట్టబడే ప్రతీ అడుగూ
ముప్పేటసాగే సుమధుర కలియికకేనన్న
నిన్నటి ఆశకు నిరాశ రెక్కలొచ్చిన వేళ...
సూరీడు మసకేశాడు 
పండువెన్నెల నలుపెక్కింది
మోహప్రేమబంధం వీడుతోంది...
ఒడ్డెక్కిన అల కడలికౌగిలి చేరేతీరు...