23, ఫిబ్రవరి 2016, మంగళవారం

చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది?

మత్తు వదలలేదు. పక్క గదిలో లైటు వేసిన అనుభూతి. రెప్పలేవకుండానే మెలుకువ వచ్చిన ఫీలింగ్. అమ్మ ఎప్పుడూ ఇంతే. బంగారం లాంట నిద్ర చెడగొట్టాలా? మస్తిష్కంలో అన్నీ నమోదవుతూనే వున్నాయి. లేవాలన్న ప్రయత్నం విఫలమవుతున్న విషయమూ అర్థమవుతోంది. ఈ లోగా అలవాటు చొప్పున సొల్లు యంత్రం తన పని తాను చేసుకుపోయింది. పండుకుంది చాలు... లే అంటూ మోగటం మొదలుపెట్టింది. తప్పనిసరై ఒకింత విసుగుతోనే లేచిన గుర్తు. చప్పుళ్ళు వినిపిస్తున్న వంటగదిలోకి అడుగులేశాను. ఏంటమ్మా ఇది అంటూ విసుగ్గా రాబోయిన మాటలు పెదాల మాటునే ఆగిపోయాయి. నాన్న... బ్రెష్షు నోట్లో పెట్టుకుని కాఫీ కలుపుతున్నాడు. 
ఏంటండీ నిద్ర పట్టలేదా? అంటూ పదాలు అప్రయత్నంగానే దొర్లాయి. 
ఇప్పుడే లేచారా, అంటూ సమాధానం. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా... నా ప్రశ్నలో ధ్వనించిన చికాకును నాన్న గ్రహించలేదన్న తేలికపాటి భావన. 
చకచకా తయారై తోలూడిన బూటేసుకుని వాకింగ్ కి బయలుదేరాను. నేను నడకకు పోకపోతే పొద్దు పొడవ దేమోనన్న ఫీలింగ్ బలంగా వుంటుంది. వెధవది, ఆ మాత్రం లేకపోతే ఠంఛనుగా మెలుకువ రాదని నా గట్టి నమ్మకం. ఇదే చాదస్తం అంటే, అని అప్పుడప్పుడూ మా ఆవిడ విసుక్కోవటమూ గుర్తుకు వచ్చింది. 
రోడ్డు దాటుతూంటే, ఎర్రటి చంద్రుడు పడమటకి జారిపోతున్నాడు. గుండ్రంగా ఎర్రగా కనిపించిన చంద్రుడుని చూడగానే ఎందుకంత కోపం అనిపించింది. నిజమే చంద్రుడికి ఎందుకో కోపం వచ్చింది. ఎర్రబడ్డాడు. మెల్లగా చెరువుగట్టుపై నడుస్తూన్నా... కోపబింబం వెంటాడుతూనే వుంది. లాభం లేదనుకుంటూ దానిని సెల్ ఫోన్ లో బంధించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. 
సందేహం తీరకుండా నడక సాగదనిపించింది. వెంటనే శ్రీమతికి ఫోన్ చేశా. మరో ఐదు నిమిషాలలో ఎటూ తను నిద్ర లేస్తుంది. ఫర్వాలేదులే అన్న ధీమా. 
హలో... నిద్ర మత్తులో శ్రీమతి గొంతు. 
బాగుంది, హస్కీగా. నాకు చాలా ఇష్టం ఆ ధ్వని. 
మురిపాన్ని పక్కనపెట్టి, చంద్రుడికి కోపం వచ్చిందోయ్. ఎందుకో అర్థం కావటం లేదు. బాగా ఎర్రబడ్డాడు. ఎందుకంట? అంటూ ఉగ్గపట్టుకున్న ప్రశ్నను అడిగేశాను. 
అవునా...? మత్తు వీడని మూడ్. 
అవును, ఎంత ఎర్రగా వున్నాడో అంటూ నా గొంతులో అదో రకమైన ఉద్వేగం. 
చాలా కూల్ గా... అడగలేకపోయావా... పెదాల చివర్న చిన్న నవ్వు వచ్చినట్లు కనిపించే సరికి, చిన్న సంతృప్తి. అంతలోనే అసంతృప్తి కమ్మేసింది. అర్థం కాలేదు. ఏం ఆశించాను? 
అసంకల్పితంగానే మరో ఫోన్.
హలో యంగ్ మాన్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరింపు. 
గుడ్ మార్నింగ్, చంద్రుడికి కోపం వచ్చింది. ఎంత ఎర్రగా వున్నాడో, చూశావా? అంటూ గబగబా అడిగాను. 
అవునా, చూస్తాను ఆగు అనేలోగా చంద్రుడు జారుకున్నాడు. 
కనిపించడులే నీకు అంటూ ముక్తాయించాను. ఏదో మాటలు సాగుతూనే వున్నాయి. అన్యమనస్కంగానే వున్నా. ఇంతకీ చంద్రుడుకి ఎందుకు కోపం వచ్చింది? సమాధానం దొరకనేలేదు. వచ్చిన సమాధానం ఈ చెవి నుంచి ఆ చెవిగుండా జారిపోయింది. చిన్న వెలితి... రోజంతా కొనసాగుతూనే వుంది. అసలు ఏం కావాలి?...

22, ఫిబ్రవరి 2016, సోమవారం

లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...

ఆర్భాట ప్రకటనలు... హంగు, పొంగులతో స్థలాల పరిశీలనా పర్యటనలు... మూడు నెలలుగా మన మంత్రులు, 
ఎమ్మెల్యేల తీరిది. అత్యుత్తమ ప్రకటన అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 
నుంచి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు వరకూ ప్రకటించని వారే లేరు. సందట్లో సడేమియా... తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా బిజెపి ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశం కావటం, ఆయన ఆధ్వర్యంలో ఐటి కంపెనీలను తనిఖీ చేసి మీ చేతకాని తనాన్ని చూస్తూవూరుకోం అంటూ రంకెలేయటం..ఇప్పుడు జిల్లాలో ఇవి హాట్ టాపిక్స్. అసలు వీటి వెనుక మర్మమేమిటో? జనాలను వేధిస్తోన్న సందిగ్ధ సందేహం. తరచి, తొలిచి చూస్తే వచ్చే ఆసక్తికరమైన అంశాలే నేటి ఎబిఎన్ కథనం...
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జనాలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఏ పని అయ్యింది? అంటే, ఠకామని చెప్పటం ఒకింత కష్టమే. కానీ, విశాఖపట్టణం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను తీసుకురావటానికి, 24గంటలూ 
లోహపురెక్కల జడిసప్పుడు నగరం నెత్తిన రొదపెట్టటానికి అవసరమైన అనుమతుల సాధనకు నాటి ప్రజాప్రతినిథులు పాపం ఎంతగానో కష్టపడ్డారన్న విషయాన్ని విస్మరించటం ఎంతమాత్రమూ సముచితం కాదని విజ్ఞులైన పెద్దల అభిప్రాయం. ఇప్పుడు ప్రశ్న అల్లా ఆ విజ్ఞులైన పెద్దల్లో నేటి పాలకులున్నారా? అన్నదే. చమటోడ్చి సాధించిన అంతర్జాతీయ హోదాను ఏమీ కాదన్నట్లు తీసేస్తారేమిటి? సరికొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తానంటారేమిటి? కాంగ్రెస్సోళ్ళను వేధిస్తోన్న ప్రశ్న. విశాఖలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మిస్తాం అంటూ చంద్రబాబు... ఆ కట్టే పచ్చటి విమానాశ్రయాన్ని అచ్యుతాపురంలో కడతామని ఒక సారి, కేంద్ర బృందం స్థలపరిశీలన తరువాత నిర్ణయిస్తామని మరో సారి జిల్లాలో జూనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుమార్లు ప్రకటించారు. దీనికితోడు పక్కజిల్లాల మంత్రులూ అబ్బే ఆ జిల్లాలో కాదంటూ ఇచ్చిన ప్రకటనలను విశాఖ జనం అస్సలు ఖాతరు చేయటం లేదులేండి. అందరూ అయిపోయారు, నేను మాట్లాడకపోతో బాగోదనుకున్నారో, లేక నిజంగా మాట్లాడాలనిపించే మాట్లాడారో తెలియదు కానీ... ''అబ్బే అక్కడా ఇక్కడా దేనికీ... దేశంలోనే రెండో మునిసిపాలిటీగా, డచ్ వారి పోర్టుగా వెలుగొంది చారిత్రిక ప్రాధాన్యం కలిగిన భీమునిపట్నం ఆనవాలును చెరిపేస్తూ 
మహావిశాఖలో ముంచేస్తున్నాం కాబట్టి... అక్కడే విమానాశ్రయాన్ని కట్టేస్తాం'' అంటూ జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలంగాణ రాజధాని హైదరాబాదులో మీడియా ముందు ప్రకటించేశారు. అంతే సముద్రంలో విమానాలు దిగుతాయంటూ నమ్మినబంటుల్లాంటి మీడియా గట్టిగా ఊదేసింది. అద్సరే... అసలు ఇంతకీ ఎయిర్ పోర్టు ఎక్కడొస్తుందహే? ఎందుకండీ అంత అసహనం... ఓపికపట్టండి సెపుతాంగా..!
సామాన్యులకు తెలిసిన ఓ నిజం చెప్పేస్తున్నా.అజాగ్రత్తగా సెవులురెండూ ఒగ్గేయకండే... ఇప్పుడున్న విమానాశ్రయంలో అన్ని హంగులూ వున్నాయి. దేశవిదేశాల నుంచి పారొచ్చేసి రాత్రిళ్లు దిగేయటానికి ఎంచగ్గా మిణుగురు దీపాలూ వున్నాయి. ఇమానం దిగేప్పుడు, ఎగిరేప్పుడూ పెట్టే పరుగుకు మరింత పెద్ద సిమెంటు రోడ్డు కావాలన్నా వేసుకోవటానికి తగినంత స్థలమూ వుంది. సామాన్యుడు పనికోసం పరుగెత్తిపోయే దుబాయికి, మననాయుడోరు నిత్యం పలవరించే సింగపూర్ కి ఎప్పటి నుంచో ఈ పెద్దపెద్ద ఇమానాలు ఎల్లొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కావలసిందాల్లా మరిన్ని ఇమానాలు ఎడాపెడా వచ్చేయటం. ఎక్కేవోడు లేక పల్లెవెలుగు ఎత్తేస్తున్నారు. ఎందుకంటారు..! ఆల్లంతా మరి ఇమానాలెక్కేసి దిగిపోయొచ్చేస్తారు మరి. అందుకే ఇమానాలూ ఇమానాలూ మా ఊరికి రండోచ్ అంటూ బొట్టూ, చీరెట్టి పిలుపులిచ్చేయటం మానేసి కొత్తవిమానాశ్రయం ఎందుకండీ? అంటూ ఉత్తరాంధ్ర అమాయకులు పాపం జవాబు రాదని తెలిసినా అడిగేస్తూనే వుంటారు. ఆ మద్దెన నావికాదళంలో పెద్దాయన మీడియాపెద్దోళ్ళతో పిచ్చాపాటీ మాట్లాడారు. విశాఖవిమానాశ్రయాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మేం 
అడ్డంకికానేకాదు. అయితే దీనిని విడిచిపెట్టి మేం వెళ్ళటం వ్యూహాత్మకంగా కుదరదు. అంతేనా, అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాలలో విమానాశ్రయం ఏర్పాటును అంగీకరించబోమంటూ చాలా తెలివిగా గొట్టాలకేమీ సాక్ష్యమివ్వకుండా చెప్పారు. ఇకపోతే విజయనగరం జిల్లాలో వున్న బాడంగి ఎయిర్ స్ట్రిప్. అక్కడ వున్న 2500 ఎకరాల సుమారు వెయ్యి ఎకరాలకుపైగా రైతుల ఆక్రమణలలో వుండగా, మిగిలినది నావికాదళం అధీనంలోనే వుంది. దేశ రక్షణ అవసరాల రీత్యా దానిని ఒదులుకోవటానికి సిద్ధంగా లేమని సూచనాప్రాయంగా ఇప్పటికే భారతనావికాదళం చెప్పినట్లు సమాచారం. చివరిగా భీమిలిలో విమానాశ్రయం పెట్టేంత స్థలం లేదు, ప్రతిపాదన అంతకంటే లేదు అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ ఓ కాలు కారులోనూ, ఓ కాలు రోడ్డుమీదా పెట్టి ఆమాటా ఈ మాటా మధ్యలో విలేఖరులతో అనేశారు. ఆనోటా ఈనోటా వచ్చిన ప్రతీఊరిలో రియల్టర్లు కార్లేసుకుని వాలిపోయారు. పండొలిచి నోట్లో ఎట్టినంత వివరంగా సెప్పానా... ఇంకా అంటే ఎట్టబ్బా..?!
విమానాలు వాటి ఆశ్రయాల సంగతి అటుంచితే... ఇప్పుడు జిల్లాలో తెలుగుతమ్ముళ్ళకు ఓ కొత్త బెంగపట్టుకుంది. కాలం గడిచేకొద్దీ అసలు పార్టీ వుంటుందా? లేక అంతా జాతీయ పార్టీనే మేలంటూ అటే వెళ్ళిపోతారా? ఇంతకీ తమ్ముళ్ళకు అంతసందేహం ఎందుకు వచ్చిందనేగా? ఇది విన్నతరువాత కూడా మీకు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ మధ్య జిల్లాలో ఎన్నికైన తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా కలిసి ఓ హోటల్ లో గూణుపుఠానీ చేశారు. అంత వరకూ పెద్ద తప్పేమీ లేదు కానీ... దానికి నేతృత్వం వహించింది మాత్రం మొన్నటి కాంట్రాక్టర్లు కమ్ క్రికెట్ ప్రేమి, నిన్నటి ఐటీ కంపెనీ ఓనరు, ఇప్పటి బిజెపి ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార రాజు కావటమే అసలు తంటా. దానికి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు, రెండో సారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వెలగపూడి, రాజు తదితరులతోపాటు పలువురు హాజరు అయ్యారు. అక్కడితో ఆగకుండా మరోసారి నగరం నడిబొడ్డున వున్న ఐటీ కంపెనీలు విప్రో, టెక్ మహేంద్రలలో తనిఖీల పేరిట హడావిడి చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, విప్రో అధినేత ప్రేమ్ జీకి రాచమర్యాదలు చేసి ఇంకా స్థలం ఇస్తామంటూ హామీతో పాటు, ఇస్తున్నట్లు ప్రతాన్ని కూడా చేతిలో పెడితే... ఎమ్మెల్యేలు విప్రోకు  వెళ్ళి ఇవ్వాల్సిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నీ స్థలం లాక్కుంటామంటూ మీడియాముందు హూంకరించటం... ఎట్టెట్టా అంటూ ఉత్తరాంధ్ర జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ సీనియర్ రాజకీయనాయకుడు మాట్లాడుతూ, మాజీ మంత్రులు కూడా ఆలోచనారాహిత్యంతో, ఆవివేకంగా ప్రవరిస్తుంటే ఖర్మ అనిసరిపెట్టుకోవటం తప్ప ఏం చేస్తామండీ అంటూ నిట్టూర్చారు. ఇది ఇలాగే సాగితే రానున్నకాలంలో బిజెపి మరింత స్వతంత్రంగా వ్యవహరించటానికి చూస్తుందంటూ ఆయన జోస్యం కూడా చెప్పారు. ఇదే భయం ఇప్పుడు తమ్ముళ్ళనందరినీ వేధిస్తోంది మరి. వాయిస్ ఓవర్: గడచిన మూడు నెలల కాలంలో అది చేస్తాం, ఇది చేస్తాం... అక్కడ కడతాం, ఇక్కడ కడతాం... అంటూ చెప్పిన ఇంకా చెపుతున్న మాటలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితులను ప్రజలు జాగ్రత్తగానే కనిపెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఉత్తగొడ్డుకు అరుపులెక్కువ అనుకునే ప్రమాదం వుంది. అసలు రాష్ట్రంలో... ఉత్తరాంధ్రలో... మరీ ముఖ్యంగా ఇసాకపట్నంలో ఏం జరుగుతోంది? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక....

People decide leader’s fallows

సమైఖ్య రాష్ట్ర నినాదం అనూహ్యంగా వాడవాడలా ఎగబాకుతోంది. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ భావోద్వేగ ప్రదర్శనలపై పట్టుకోసం వివిధ రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 12రోజులు గడుస్తున్నా ముగింపుపై స్పష్టత లేకుండా ఏకనినాదంతో సాగుతున్న ఆందోళనలు నాయకులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. బేధం లేకుండా నాయకులునందరినీ అనుమానపు చూపులతో, అవమానకరమైన మాటలతో ప్రజలు చూస్తుండటంతో నాయకులు ఖిన్నులవుతున్నారు. తమతమ నియోజకవర్గాలకు దూరంగా మసలుతున్నారు. 
విశాఖ జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక రాజ్య సభ సభ్యుడితో పాటు మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వున్నారు. వీరికితోడు నాలుగురు టిడిపి ఎమ్మెల్యేలు, ఒక వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమైఖ్య నినాదంతో చాలా కాలంగా ఉద్యమకారులతో మమేకమవుతూ తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అడపాదడపా అని ప్రజలు అంటున్నా... ఆయన మాత్రం, నేను వీలున్నప్పుడల్లా జిల్లాలో సమైఖ్య ప్రదర్శనలలో పాల్గొంటున్నాను అనే చెపుతూ వస్తున్నారు. వివిధ జెఏసీల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటిస్తూ రావటం, రాజకీయేతర జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పలువురిని తన ఏలుబడిలో ఓ వేదికపైకి తీసుకువచ్చిన గంటా, ప్రతిపక్షాల నుంచి ఘాటైన విమర్శలనే ఎదుర్కొన్నారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమబాటను పునాది చేసుకోవాలని చూస్తున్నారంటూ గంటాపై విమర్శలు వెల్లువెత్తాయి. సమావేశం తరువాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్జీవో హోంనే తన స్వంత కార్యాలయంగా ప్రకటించటం తప్ప మరే కార్యక్రమంలోనూ ఈ జెఎసీ చురుకుగా పాల్గొనకపోవటం, కార్యాచరణ కోసం మంత్రివైపు చూస్తోందన్న మాట... నేపథ్యంలో నాన్ పొలిటికల్ జెఎసీ నామమాత్రంమైంది. ఢిల్లీ, హైదరాబాదు, విశాఖల మధ్య ఎప్పుడు ఎక్కడ వుంటారో తెలియకుండా ఎగురుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యమాన్ని ఉధృతం చేయటానికి పావులు ఎలా కదుపుతారన్న ప్రశ్న ఉద్యమాభిమానులను వేధిస్తూనే వుంది. మరో మంత్రి పసుపులేటి బాలరాజు సమైఖ్యతకే కట్టుబడి వున్నానని చెపుతూనే... రాజీనామా చేయననీ, అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తరువాత పెద్ద చేయగలిగేది ఏమీ లేదని బహిరంగంగానే చెపుతూ వస్తున్నారు. ఆ మాట అన్నందుకు నర్సీపట్నంలో ఆయన సమైఖ్యవాదుల నిరసనను ఎదుర్కొన్నారు. నిరసనకారుల పట్ల సాహానుభూతిని ప్రదర్శించాల్సిన మంత్రి సంయమనం కోల్పోయి వారిని పోలీసులకు అప్పచెప్పటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. నిన్నటి వరకూ విశాఖలోనో కాకుంటే ఏజెన్సీలో ప్రజలకు అందుబాటులో వుండే మంత్రి బాలరాజు చాలా కాలంగా హైదరాబాదుకే పరిమితమై పోయారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ముచేసుకునే రాజకీయ నాయకుల వరుసలో వుండటానికి ఇష్టపడకే దూరంగా వుంటున్నానని సన్నిహితులకు చెపుతున్నట్లు సమాచారం.  ఈ వ్యవహారశైలితో బాలరాజు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులలో పడిందన్న సన్నిహితుల ఆందోళనను ఆయన పరిగణలోకి తీసుకున్నట్లు లేరు. 
 ఉద్యమంలో కనిపించకపోతే రాజకీయంగా వెనుకబడిపోతామనుకున్న టిడిపి నేతలు కొద్దిగా ఆలస్యంగానైనా రాజీనామాల బాటపట్టారు. ఆ తరువాత అడపాదడపా ఉద్యమం పేరుతో చిన్నచిన్న ప్రదర్శనలకు పరిమితమయ్యారే తప్ప ఉద్యమకారులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటానికి మేం వ్యతిరేకంగా కాదు... ఇచ్చిన పద్ధతికే అన్న తమ పార్టీ వివరణతో ప్రజలలోకి సమర్ధవంతంగా వెళ్ళలేని పరిస్థితులలో నాయకులు పడ్డారు. దీనితో వీరిపని కుడితిలోపడ్డ ఎలుకల్లా తయారయ్యింది. పూర్తిగా సమైఖ్య ఉద్యమంలోకి వెళ్ళలేక, వెళ్ళకుండా వుండలేక అన్యమనస్కంగా టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రదర్శనలను ప్రజలు గమనిస్తూనే వున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతకు భిన్నంగా ఏమీలేదు. రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన వారు, ప్రకటించని వారూ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మంత్రి గంటా విమానం దిగగానే ఆయనను నీడలా వెంబడించి సాగే అవంతి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్యలు... మంత్రి విమానం ఎక్కగానే మాయమవుతున్న తీరును ఆయా నియోజకవర్గాలలో ప్రజలు నిగ్గదీస్తూనే వున్నారు. మరో ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడితే... మళ్ళ విజయప్రసాద్ అటు కప్పకీ, ఇటు పాముకీ కోపం రాకుండా అన్నచందాన వ్యవహరిస్తున్నారు. అందరికంటే ముందుగా రాజీనామా ప్రకటన చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేస్తున్న ఉద్యమాలు ఏమిటా అని ఆ నియోజకవర్గ ప్రజలు తేరిపారా చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఉద్యమబాటపడుతున్న ప్రజలకు, ఉద్యమాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలుకుతున్న ప్రజలకు ఇప్పుడు ఎమ్మెల్యేలు  ఎక్కడున్నారో చూసే తీరికే లేదు. అవసరం అంతకన్నా లేదు. అందుకే ఉద్యమాలు ఇప్పుడు ఏదో ఒక కేంద్రానికే పరిమితం కాలేదు. ఒక సమయానికి లోబడి సాగటంలేదు. పదిమంది ఎప్పుడు కలిస్తే అప్పుడు, ఎక్కడ కలిస్తే అక్కడ జై సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నినాదం మారుమ్రోగుతోంది. అదిగో ఆ తీరే ఇప్పుడు నాయకులను గంగవెర్రిలెత్తిస్తోంది. 
అధిష్ఠానానికి సన్నిహితంగా వుంటారని అనుయాయీలు ఘనంగా చెప్పుకునే కేంద్ర మంత్రి పురంధేశ్వరి జూలై మాసాంతం నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా నియోజకవర్గంకు వచ్చిన దాఖలా లేదు. సమైఖ్యరాష్ట్రం కోసం పాటుపడుతున్నానంటూ ఢిల్లీ మీడియాకే పరిమితమవుతున్న కేంద్ర మంత్రి అంతకు నెలరోజుల ముందే తమ అధినేత్రికి ఓ లేఖ ఇచ్చారని ఆయా వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన అంటూ జరిగితే ఏం చేయాలో సూచిస్తూ, సమైఖ్య భావనను తేలిక చేస్తూ ఇచ్చినట్లు చెపుతున్న ఆ లేఖ విషయాంశాల ప్రచారంతో ఆమె సరిపడినంత అపకీర్తినే మూటగట్టుకున్నారు. తమ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి విలువనివ్వాలో, తన నియోజకవర్గ ప్రజల మనోభీష్ఠాన్ని గౌరవించి మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి ఎడమకాలితో తన్ని ఉద్యమంలోకి కుడికాలు పెట్టాలో తేల్చుకోలేని సంక్లిష్టావస్థలో పురంధేశ్వరి కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి వరకూ అవిశ్రాంతంగా విశాఖ పార్లమెంటు నాకేనంటూ ఎలుగెత్తి చాటిన మరో ఎంపీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీలేదు. వారానికో సంఘాన్ని ఫ్లోట్ చేసి ఆ సంఘాల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గరై విశాఖ ఎంపీసీటును సాధించుకోవాలనుకున్న తిక్కవరపు ఆశలను సమైఖ్య ఉద్యమం ఉప్పెనై ముంచేసింది. సోనియమ్మను కాదని ఆయన ఉద్యమంలోకి రాగలిగిన పరిస్థితిలేదు. అలాగని జై సమైఖ్యాంధ్ర అని అనకుండానూ వుండలేరు. అందుకే ఆయన ఇతరులను నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న చిన్ననాటి నీతి పద్యాన్ని గట్టిగానే గుర్తుచేసుకుంటున్నారు. 
నిన్నటి వరకూ తెలంగాణ ఇచ్చేస్తే ఏమిలే అనుకున్న వారంతా ఇప్పుడు హైదరాబాదు ఇచ్చేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదు తెలంగాణ వారిదే అంటే ఊరుకోం అంటూ మొదలైన మాట ఇప్పుడు అసలు రాష్ట్ర విభజనే కుదరదు అంటూ హోరెత్తుతోంది. ఈ ఉద్యమహోరులో పోరుబాట పట్టని నాయకులను ఓటరు చరిత్రహీనులను చేస్తారంటూ ఉద్యమకారులు చేస్తున్న హెచ్చరికలు నాయకులకు నిద్రను దూరం చేస్తున్నాయి. అందుకే తడబడుతూనైనా నాయకుల అడుగులు ప్రజాఉద్యమ బాటపడుతున్నాయి. రాజకీయనిరుద్యోగిగా మిగలకుండా వుండటానికి ఉద్యమం ముసుగు తొడుక్కుని ఫోజులు కొడుతున్నారు. ఏళ్ళ తరబడి సాగుతున్న వివాదానికి శాశ్వత పరిష్కారం విభజనే అన్నదానిలో నాయకులకూ, మెజారిటీ ప్రజలకు పెద్దగా బేధాభిప్రాయం లేకపోవచ్చు. పీకపట్టుకుంటుంది మాత్రం హైదరాబాదే. హైదరాబాదుని కేంద్రానికి ఇచ్చి ఇద్దరూ చెరో రాజధాని వెతుక్కుంటే సమస్య పరిష్కారమైనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి కావల్సిందీ అదే. అందుకేనేమో నాయకులూ నలుగురితో నారాయణ అంటున్నారు. Leaders decide people fallows అన్న నినాదాన్ని మార్చి People decide leader’s fallows అంటూ సరికొత్త పల్లవిని అందిపుచ్చుకున్నారు. సర్వకాల సర్వావస్తలందూ నాయకులారా... వర్ధిల్లండి.

సమైక్యం కొత్తపోకడలు ఏ దారికి?


 భావోద్వేగాల సందిట రాగద్వేషాలు రెచ్చగొట్టబడుతున్న సందర్భంలో రాష్ర్టంలోని దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు చిక్కువడివున్నారు. దీనికి ఉత్తరాంధ్ర ప్రజలు మినహాయింపేమీ కాదు. అందుకేనేమో కొద్దిపాటి వివేచన వున్నట్లు కనిపించే నేతలు, మేథావులు ఛీత్కారాలకు గురవుతున్నారు. నోరువిప్పటానికి భయపడుతున్నారు. ఏ రోటికాడ ఆ పాట పడగలిగే సామర్థ్యం వున్న నేతలు మాత్రం దర్జాగా సాగిపోతున్నారు. ఇంతటి భావోద్వేగాలు నడుమా కులాధిపత్య ధోరణులు పచ్చగాసాగుతూ వుండటాన్ని అర్ధం చేసుకోవటం సాధ్యంకాని సామాన్యుడు తనరోజు కూలీలో అధికభాగం రవాణాకే ఖర్చు చేయాల్సి వస్తున్న విషాద సందర్భం మరింకెంత కాలమోనంటూ నిట్టూరుస్తున్నాడు.  


నేటి కాలపు రాజకీయాలకు బొత్తిగా పనికిరాని పెద్దింటి మేథావి దగ్గుపాటి పురంధేశ్వరి. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఏదోటి మాట్లాడి అటు సమైక్యవాదులకో, ఇటు పార్టీ అధిష్ఠానానికో దగ్గరవాళ్ళమనిపించుకుంటున్నామన్న సంతృప్తి తో చాలామంది నేతలు బతికేస్తూంటే ఆవిడ మాత్రం వాటి న్నింటికీ తాను దూరమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సున్నితమైన విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించటమంటే అగ్నికి ఆజ్యాన్ని తోడివ్వటమేనన్నది చిన్నమ్మ భావిస్తున్నారని ఆమె వర్గీయులు అడిగిన వారికి, అడగని వారికి సర్దిచెప్పుకుంటున్నా... లోపల మాత్రం వెనుకబడిపోతున్నామన్న దిగులు వారిని వేధిస్తోంది. విశాఖ రానంతసేపూ ఏదోలా సర్దిచెప్పేశాం. విదేశీ పర్యటనలలోనో, అధిష్టానాన్ని ఒప్పించే యత్నాలలోనో మేడం బిజీ అంటూ బిల్డప్పులిచ్చాం. విశాఖ నుంచి మరెక్కడికో ఎగిరిపోవటానికి అవసరమైన విమానం గురించి చర్చించటానికి స్టార్ హోటల్ మీటింగ్ కు హఠాత్తుగా నగరానికి రావటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి చెప్మా అంటూ వీరవిథేయులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఒచ్చారేపో... ఒక్క మాట కూడా సమైక్యవాదులకు మద్దతుగా మాట్లాడకుండా పోవటమేమిటా అంటూ చేతులు పిసుక్కుంటున్నారు. స్టార్ హోటల్ సమావేశానికి మీడియాకు ఆహ్వానం పంపిన నిర్వాహకులు ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో కాని, అనుమతి లేదంటూ మీడియాను బయటకు గెంటేశారు. పాత్రికేయుల నుంచి వచ్చే ప్రశ్నలను తప్పించుకోవటానికి కేంద్రమంత్రే మీడియాను బయటకు నెట్టించారని సహజంగానే వాళ్ళూ వీళ్ళూ చెవులుకొరుకుతున్నారు. ఈ వ్యవహారంతో పురంధేశ్వరి వర్గం మరింత డిఫెన్స్ లో పడిపోయింది. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో చాలా చేస్తున్నానని చెపుతున్న చిన్నమ్మ ఇక్కడ ఏదో ఒక శిబిరం వద్దకు వెళ్ళి మద్దతు పలికితే బాగుండేది కదా అంటూ నిత్యం ఆమె కోసం కారుల్లో బారులు తీరే వారే బాధపడుతూంటే, ప్రతిపక్షాలు తమ సహజ దుమ్మెత్తిపోత తత్వాన్ని వీడి మౌనముద్ర వహించారు.
రాజ్య సభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సమైక్యాంధ్రకు జై అన్నా రాజీనామా చేయనందుకు గో బ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. తానొవ్వక, ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యం మాకూ తెలుసు, మీ పప్పులేమీ ఉడకవంటూ ఉద్యమకారులు ఎదురుతిరిగారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపునిచ్చారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు లేఖనిచ్చానని చెప్పి ఉద్యమాకారుల వెంట జెండా పట్టుకుని సాగిపోవటం ఆయనకు మాత్రమే చెల్లుబాటయ్యింది. రాజీనామా చేసి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టటం లేదంటూ చెపుతున్న సదరు మంత్రిగారి వెంట ప్రభుత్వం కేటాయించిన పిఏ యథావిథిగా సాగుతూనే వున్నారు. అధికారులు వచ్చి దండాలు పెడుతూనే వుంటారు. ఏది ఎప్పుడు ప్రారంభించాలో ఆయనే నిర్ణయిస్తారు. ఉద్యమాభిమానిగా వెలుగొందటానికి అధికారాన్ని ఆయన ఉపయోగపెట్టుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తిమీలేదు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా జాతీయ రహదారిపక్కనే రాత్రికి రాత్రే ప్లై ఉడ్ బేస్ మెంట్ తో తెలుగుతల్లి విగ్రహాన్ని కార్పొరేషన్ అధికారుల చేత పెట్టించి ప్రారంభించిన ఘనత ఆయనకే చెల్లింది. నాన్ పొలిటికల్ జెఎసీ పేరుతో తన తురుఫు ముక్కలను రంగం మీదకు ప్రవేశపెట్టి పార్టీలకతీతంగా ఉద్యమాకాంక్ష వున్న నేతగా మీడియాకెక్కారు. గవర్నర్ ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకుని ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని విశాఖలో ప్రకటించిన కొద్దిగంటలకే,  హైదరాబాదులో... సీఎం కిరణ్ రాజీనామా వద్దని బుజ్జగిస్తారు. అంతే మాట తిరగబడుతుంది. సీఎం ప్రేమ ముందు పార్టీకన్నా ప్రజలే మిన్న అన్న మాట వెనకబడుతుంది. గంటా గారి మేనేజ్ మెంట్ టెక్నిక్ తెలియక పాపం తిక్కవరపు గోబ్యాక్ నినాదాల మధ్య చిక్కుబడిపోయారు. 
ఆత్మస్తుతి, పరపార్టీ దూషణ, నిన్నటి వరకూ కనిపించిన రాజకీయ చిత్రం. కొంత ఆత్మనింద, మరింత పరనింద నేటి రాజకీయ సిత్రం. నాయకుల తీరేమేకాని... గతంలో ఎన్నడూ లేనంతాగా ఫ్లెక్సీలు వికృతరూపం దాల్చుతున్నాయి. చూ పులు కలిసిన శుభవేళ అంటూ షర్మిల, చంద్రబాబుల ఫోటోలు... సోనియా - కెసిఆర్ లకు పెళ్ళంటూ బ్యానర్లు... రాజకీయ అసమర్థత తెచ్చిన ఉద్యమక్రీడ మరిన్ని కొత్తపోకడలు పోతోంది. కలిసి వుండాలన్న డిమాండ్ కు, విడిపోవాల్సిందే అన్న పోరుకేకకు మధ్య సంధి ఎప్పుడు కుదురుతుందో తెలియని సామాన్యుడు నిత్యజీవన పోరాటం లో సాగిపోతూనే వున్నాడు. 

ఆణిముత్యాలు దొరికేనా!?

రాజకీయ ఆకాంక్షలు, సమైక్యాంధ్ర ఉద్యమాభిలాషల జమిలి నాయకత్వం విశాఖలో ప్రజలను ఉద్యమబాట పట్టిస్తోంది. సీమాంధ్రలలోని మిగిలిన 12 జిల్లాలతో పోలిస్తే విశాఖ ఉద్యమవేడి ప్రదర్శనలో ఒకింత వెనుకబడే వుందన్న భావన నలుగురిలోనూ వుంది. ఆయా జిల్లాలలో మరెక్కడా లేని ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం భౌతికవాస్తవమైతే... ఏకతాటిపై నడిపించగలిగే నాయకత్వలేమి లోపంతో జిల్లాలో ఉద్యమం కొట్టిమిట్టాడుతోంది. ఉన్నంతలో ఉద్యమాన్ని ఓ ఊపు ఊపాలని భావిస్తున్న నాయకులు పలువురు సరికొత్తగా ఉద్యమనేపథ్యంలో తెరమీదకు వచ్చారు. జిల్లాలో పలు రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకత్వ శూన్యతను పూరించే సమర్థలు ఎవ్వరైనా ఆయాకొత్తముఖాలలో కనిపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 
ప్రశాంతతకు నిలయంగా ఘనంగా ప్రకటించుకుంటున్న విశాఖ నగరానికి ఉద్యమ చరిత్రలు కూడా వున్నాయండోయ్. నగరవీథులలో ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూంటే ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చింది. నగరవీథులలో ఆర్టీసీ రథచక్రాలకు మార్గం వేసిన ఆందోళన అది. ఎర్ర జెండాను ఎదకు హత్తుకుని ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపటానికంటూ సాగిన నక్సల్స్ ఉద్యమానికి నీడనిచ్చింది విశాఖ ఏజెన్సీనే. అనేకానేక చారిత్రాత్మక కార్మిక పోరాటాల చారిత్రిక నేపథ్యం విశాఖ స్వంతం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో దద్ధరిల్లిన ఈ గడపకు ఉద్యమస్ఫూర్తిని నేర్పాల్సిన అవసరం వుందా?!. నిరంతరాయంగా ఉపాథి కోసమో, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసమో సాగే చిన్నాచితకా పోరాటాలు వుండనే వున్నాయి. తోడుగా సరికొత్తగా ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమాలు. సకలజనులను ఉద్యమబాటలోకి ఇముడ్చుకుంటూ సాగుతున్న పోరుహోరు. విద్యార్థులు, ఉద్యోగులు, భిన్న సామాజిక వర్గాల ప్రజలు... ఒక్కొక్కరూ ఒక్కోనాయకత్వపు నీడన... నగరంలో, జిల్లాలోనూ నిత్యం ఏదో ఒక మూల... మీడియాల రాకతో సంబంధమే లేదన్నట్లుగా  ఉద్యమ ప్రవాహ ఉధృతి సాగిపోతూనే వుంది. రాష్ట్ర విభజనపై  అప్పుడు ఇప్పుడు  మొదటిగా  స్పందించింది విశాఖ నగరమే.  ఉద్యమానికి ఆజ్యం పోసేది ఆంధ్రయూనివర్శిటీయే.. 2009 నుంచి ఇప్పటి వరకూ సమైక్యరాగం ఆలపించిన నగరం విశాఖే అంటే అతిశయోక్తేమీ కాదు.
సమైక్యాంధ్ర ఉద్యమంతో 2009 నుంచి నిరంతరాయంగా కనిపిస్తూ వచ్చిన వారిలో ఆడారి కిషోర్ కుమార్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసీ నేతగా మొన్నటి వరకూ రాష్ట్రాన్ని చుట్టిన కిషోర్ అనకాపల్లి వాస్తవ్యుడు. సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా, తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన చరిత్ర వుంది. విశ్రాంత విద్యార్థివంటూ పలువురు గుర్తు చేయటంతో యువజన జెఎసీ పేరుతో సమైక్య ఉద్యమరంగంలో కొనసాగుతున్నాడు. గడచిన ఎమ్మెల్సీ ఎన్నికలలో  'దేశం' రెబల్ గా పోటిచేసే ప్రయత్నం చేశాడు. అందరితో సత్ సంబంధాలను కొనసాగిస్తూ, ఆయా సంఘాల బలాన్ని తన బలంగా ఊహించుకుంటూ వుంటాడు. పిలవని పేరాంటాలకు సైతం వెళ్లీ పోటోలకు ఫోజులిస్తుంటాడని గిట్టనివాళ్లంటారు.   కుసింత పిక్కలు వెనకేసుకున్న ఆడారి అనకాపల్లి భోగీ ఎక్కి పసుపుకండువాతో అసెంబ్లీ గడపతొక్కాలని ఆశపడుతున్నాడు. తానుపుట్టిన గవరకులం తనకు వెన్నంటి వుంటుందన్న కొండంత నమ్మకంకు సమైక్య ఉద్యమపాపులారిటీ, నాలుగుమాటలు ఉద్దేశ్యపూర్వక ఆవేశంతో మాట్లాడగలిగే లాఘవం అక్కరకొస్తాయన్నది మావాడి ఆలోచనంటూ అయినవారు చెపుతూంటారు.
కిషోర్ కు పోటీగా విద్యార్థి జెఎసీ పెట్టి ఇప్పటికీ విద్యార్థులమే కాబట్టి మేమే అసలు సమైక్య విద్యార్థి ఉద్యమకారులమంటూ ముందుకు వచ్చిన ముగ్గురిలో ఆరేటి మహేష్ ఒకరు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ గా ప్రకటించుకున్న ఈయన మాట్లాడినప్పుడల్లా 14 యూనివర్శిటీల విద్యార్థులమంటూ చెపుతూంటే సహచరులే నోరు తెరిచి మనోడు భలే మాటకారే అంటూ ఎటకారమాడుతూంటారు. 2009 డిసెంబర్ లో రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఏయూలో విద్యార్థులను కదిలించింది మావోడు కాదేటి అంటూ మరికొందరు వెనకేసుకొస్తూంటారు. అప్పటి నుంచి ఇప్పటికి కాలందేకేటప్పటికి మనోడు ఒంటరయ్యాడు. నమ్మకం స్థానాన్ని అపనమ్మకం మింగేసింది. రాజకీయాలపట్ల ఆసక్తి వున్నా ముందుకు వెళ్ళే శక్తిలేక ఇలా తీర్చుకుంటున్నాడని వారువీరూ అనేమాట. మరో విద్యార్థి జేఏసీ నేత లగుడు గోవింద్. గతంలో పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా పోటీచేసి చేతులుకాల్చుకున్నాడు. రాజకీయాలంటే ఉత్సుకత వున్నా అందుకు అవసరమైన ప్రణాళికాబద్ధ కృషి, నిబద్ధతా పూర్తిగా లేవని వెనకనుంచే నిజాలను రాళ్ళలా విసిరేస్తున్నారు. మరో విద్యార్థి నేత కాంతరావు. వైసిపి విద్యార్థి విభాగంలో వుంటున్నానని చెప్పుకుంటాడు. జగనిజాన్ని తలకెక్కించుకున్న కాంతారావు భవిష్యత్తుపట్ల కుసింత బెంగగానే వున్నట్లు కనిపిస్తాడు. వీరు ముగ్గురూ కలిశారంటే ఓ ప్రెస్ మీట్, కాకుంటే పోస్టర్ రిలీజ్. తప్పనిసరిగా కనీసం 10మందినైనా వుంచుకోండయ్యా అంటూ మీడియావాళ్ళు చేసే గొడవ భరించలేక నానాతిప్పలూ పడుతున్నారు. 
ఏపిఎన్జీవోల జెఎసీ, ఆర్టీసీ కార్మికుల జెఎసీ, విద్యుత్ ఉద్యోగుల జెఎసీ, జీవియంసీ కార్మికుల ఉద్యోగుల జెఎసీ, రెవెన్యూ ఉద్యోగుల జెఎసీ, వాణిజ్యపన్నులశాఖ ఇలా పోతే శాఖకొక జెఎసీ ఏర్పాటయ్యింది. ఎవరికివారే శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే వున్నారు. ఏపిఏన్జీవోల జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈశ్వరరావు  కెజిహెచ్ లో సినియర్ ఆస్టెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో రాజకీయపార్టీలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన పిలుపునందుకుని ఎపిఎన్జీవోల వరకూ కదిలే పరిస్థితి.  రెవెన్యూ అసోసియేషన్ నాయకుడైన నాగేశ్వరరెడ్డి నాయకత్వపటిమ కలవారే. ఎపీ ఎన్జీవోల సంఘంలో వున్నప్పుడు పలు పదవులను అలంకరించిన ఈయన ప్రస్తుతానికి జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షునిగా, రాష్ట్ర కమిటీలో కీలకబాధ్యతలలోనూ వున్నారు. కలెక్టరాఫీసులో పాలనాధికారిగా పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా వెళ్ళే మా రెడ్డికి రాజకీయాలు నప్పవు, అసలాయనకు అలాంటి ఆలోచనకూడా లేదంటూ సహచరులే కొట్టిపారేస్తూంటారు. సమైక్యాంధ్ర సాగర లక్షగళ గర్జనలో ఆవేశంగా ఉరిమిన  ఆర్డీవో  వెంకటేశ్వరరావు  స్టేట్  డిప్యూటి కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా  పనిచేస్తున్నారు. రాజకీయాలంటే తనకు బొత్తిగా పడదనీ, మనిషిగా పుట్టిన తరువాత పరోపకారార్థం వెధవ శరీరం అన్ననానుడిని నమ్మాలి కదా అంటూంటారు. 
విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాస రావు తరుచూ ఉద్యమవార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి. ఈపిడిసియల్ విశాఖవాణిజ్యవిభాగంలో ఎడిఇగా పనిచేస్తున్నారు. విద్యుత్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధిగా, విద్యుత్ ఉద్యోగులు బీసి సంఘం  అధ్యక్షునిగా ఇలా పలు పదవులను నిర్వహించిన వాడు. రాజకీయాలపట్ల ఆసక్తి. ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లో చేరిపోదామనుకుని గుమ్మందాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు మా పోలాకి అంటూ అనుచరులు పరాచకాలాడతూంటారు. ఉద్యమ నేపథ్యాన్ని ఉపయోగించుకుని రాజకీయాలలోకి వెళితే అన్న ఆలోచన లేశమాత్రంగా వున్నా లక్కు కలిసిరావాల్లే అంటూ వేదాంతం చెప్పే హితులూ వున్నారు. జీవీఎంసీ కార్మికుల సంఘం నేత ఆనందరావును ముందుకు నెట్టి ఘనంగా సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలవీరుడు శ్రీనివాస్ అవకాశం కోసం చూస్తున్నాడు. కులం, ధనం కలిసి తనను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతాయని ఆయన నమ్మకం. అందరితో కలిసిపోయి తలలో నాలుకలా మెలిగే శ్రీనుకేం తక్కువ అంటూ సమర్థించే వారూ ఎక్కువే. మొదటి నుంచి సమైక్య ఉద్యమ నినాదంతో బస్సు యాత్రలనీ, విలేఖరుల సమావేశాలనీ హడావిడి చేసిన నగర స్థాయి కాంగ్రెస్ నాయకుడు జీ.ఏ.నారాయణరావు. గ్రాండ్ గా గంటా ప్రవేశాన్ని ప్రకటించి ఉద్యమం నుంచి హఠాత్తుగా మాయమైపోయాడు. ఇక నాన్ పొలిటికల్ జెఎసీ ఛైర్మన్ బాలమోహన్ దాసు. మంత్రి గంటా వేసిన రూట్ మాప్ ని అనుసరించటం తప్ప పెద్దగా నాయకత్వపు లక్షణాలేలేని వివాదరహిత వ్యక్తి అన్నది జనాభిప్రాయం. నా రూటే సెపరేటు అన్న స్టైల్ లో  ఎవరున్న లేకున్నా.  ఎవరు వచ్చినా రాకున్నా .. ఏక్ నిరంజన్  ఉద్యమాలకు ఫ్యామస్.. సమైఖ్యాంధ్ర పోలిటికల్ జేఏసీ నేత జెటి రామారావు. ఢీఫరెంట్ ప్రెజెంటేషన్స్ చేస్తూ మీడియా ఏటెంక్షన్ ను తెప్పించుకొగలుగుతున్నాడే గానీ, నాయకుడు అనడానికి కూడా ఛాన్సే లేదంటారు సాగరతీరవాసులు.
పైన కరిమబ్బు కరుగుతూంటే నేలపై వాగులూ వంకలూ బుసబుసా పొంగిపొరులుతూంటాయి. ఆకాశం తేటబారిన మరుక్షణం ఆనవాళ్ళు మాత్రమే మిగిల్చి కనిపించకుండా పోతాయి. ఎవరు కర్త? ఎవరు కర్మ? ఇదో భావావేశం. భావోద్వేగం. అందుకనే పదండిముందుకు పదండి తోసుకు అంటూ వడివడిగా సాగుతున్నారు. కదిలివస్తున్నోళ్ళను అక్కడికక్కడ కూడేసే మెరుపులు తాత్కాలికమే. శాశ్వతమైన ఆణిముత్యాలు దొరుకుతాయా లేదా అన్నది కాలమే తేల్చాలి.