22, నవంబర్ 2018, గురువారం

ఇనుప గోడలకు ఆవల..

భావోద్వేగాలు, భావావేశాలు ఒకింత చల్లబడ్డాయి. రెండు ప్రాణాలను కోపావేశంలో మావోయిస్టులు బలి తీసుకుని వారం దాటుతోంది. పోలీసులు, రాజకీయ నేతలు పరామర్శకో, పరిశీలనాత్మక శోధనకో వచ్చిపోవటం తగ్గుముఖం పట్టింది. కారు బారుల సడి తగ్గింది. ఆలోచనలు నాలుగు కోణాలలోనూ పరకాయిస్తున్నాయి. అనేకానేక ప్రశ్నలు సామాన్యులను సైతం వేధిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్ఫుటంగా దళిత గొంతుక ‘గిరిజన నేతలను చంపటానికి కారణమేమిటో చెప్పండి’ అంటూ నిలదీసింది. అందుకు కాకపోయినా అందరూ వేసుకోవలసిన ప్రశ్నే ఇది. ఎందుకు ఎర్ర తూటాలు పేలాయి? కేవలం ప్రతీకారేచ్ఛేనా? పోలీసులు చెబుతున్నట్లు మావోయిస్టులు ఒకరి పక్షం తీసుకున్నారా? తీసుకుంటే వారి రాజకీయ, సామాజిక లక్ష్యం ఏమిటి? అసలు ఎవరినైనా చంపటం, చావటం... ఉద్యమం జనోద్యమంగా, ప్రజా యుద్ధంగా వాస్తవ రూపంలో కనిపించకుండా పోయినప్పుడు జరగటం ఎవరికి ప్రయోజనకరం? పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఏదో ఒక స్థాయిలో ఇనుప గోడల చట్రాల వెలుపల వెతకాల్సిందే. సివేరి సోమ మాజీ ఎమ్మెల్యే. కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి దూకిన ప్రస్తుత ప్రజా ప్రతినిధి. వీరిద్దరూ ఎంతో కొంత మైనింగ్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నవారే. రంగురాళ్ల తవ్వకంలోనూ, అమ్మకాలతోనూ వీరికి సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలనూ కొట్టిపారేయలేము. గంజాయి అక్రమ రవాణాదారులతో వీరికి స్నేహ సంబంధాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్నీ తప్పుపట్టలేం. ఇన్ని తప్పులు చేశారని అనుకుంటున్న వీరిద్దరూ ప్రజా కంటకులని స్థానికులు వాపోయిన సందర్భాలు లేవనే చెప్పాలి. సోమ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చైనా క్లే తవ్వకాల విషయంలో తలెత్తిన వివాదంలో స్థానికులు తిరగబడి తరిమికొట్టారు. దీని వెనుకా రాజకీయాలున్నాయన్న వాదనను కూడా ప్రస్తుతానికి పక్కన పెడదాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా... ఒక విధంగా చెప్పాలంటే అన్ని విధాలా వెనుకబడిన గిరిజన జాతికి చెందిన వారు వీరు. ఒకరు కొండదొర అయితే, మరొకరు వాల్మీకి తెగకు చెందిన వారు. అట్టడుగున ఉన్న జాతిలో ఈ వ్యవస్థలో ఎదుగుతున్న నేతలు. సంపాదించారంటున్న ఆస్థి మొత్తం కుప్పేసినా... నేడున్న అనేక మంది నేతలతో పోల్చటమంటే హస్తిమశకన్యాయమే. అలాంటి వారిని మావోయిస్టులు ఎందుకు దారుణంగా చంపేశారు? చనిపోయిన వారి నుంచి మనకు ఎలాంటి సమాచారం అందదు. చంపిన వారి నుంచి ఎలాంటి సమాధానం ఉండకపోవచ్చు. కాబట్టి పై ప్రశ్నకు సమాధానాన్ని గత అనుభవాల నుంచి, పరిణామ క్రమం నుంచి ఊహించవలసిందే. విశాఖ ఏజెన్సీ సరిహద్దుల్లో ముంచంగిపుట్టు మండలం కేంద్రం నుంచి సుమారు 50కి.మీ దూరంలో ఉన్న రామగుడ అటవీప్రాంతంలో మావోయిస్టులను చుట్టుముట్టి పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 32 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఎనిమిది మంది నిరాయుధులు. దీనిని ఘన విజయంగా పోలీసులు, రాజ్యం ప్రకటించుకున్నాయి. మరిన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామంటూ ప్రకటించారు. ఈ ఏకపక్ష కాల్పులను ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పులుగా పోలీసులు అధికారికంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి మావోయిస్టులు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చలేం. సమస్యలు ఉన్నంత వరకూ ఏదో రూపంలో మావోయిజం బతికే ఉంటుందని అంతర్గత సమావేశాలలో అంగీకరించే పోలీస్ ఉన్నతాధికారులు బహిరంగ ప్రకటనలో మాత్రం ఏరివేస్తామంటూ హూంకరిస్తూనే ఉంటారు. అరకు వ్యాలీ ప్రాంతం పర్యాటక స్వర్గధామంగా అభివృద్ధి చెందుతున్న తరుణం. ఈ ప్రాంతంలో మావోయిస్టులు అన్న పదం వినపడి సుమారుగా 10 ఏళ్లకు పైబడే అయ్యింది. పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో నిర్వహించి చాలా కాలమయ్యింది. మైదాన ప్రాంతాలలో పోలీసులకు ఉన్న అన్ని అవలక్షణాలూ ఇక్కడ బహిరంగంగానే వారిలో కనిపిస్తాయి. మిగిలిన ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో కొంత ఉన్నప్పటికీ విచ్చలవిడితనం లేకపోవటానికి మావోయిస్టులే కారణమన్న సత్యాన్ని ఎవ్వరూ తోసిపుచ్చలేరు. గంజాయి, రంగురాళ్లు, అక్రమమైనింగ్, ఆటోలు, జీపు డ్రైవర్ల దగ్గర మామూళ్లు ఇలా చెప్పుకుంటూ పోతీ ఎన్నో మనకు నిత్యం అరకు ప్రాంతంలో కనిపిస్తాయి. మరో వైపు రాజకీయ నాయకులు, మావోయిస్టులకు మధ్య లోపాయికార సంబంధాలను కూడా ఇక్కడ ప్రస్థావించాల్సిందే. మావోయిస్టులకు ఎంతో కొంత సహకరించకుండా ఇక్కడ ప్రజాప్రతినిధుల మనుగడ కష్టం. ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి వచ్చి చంపుతారో ఊహించటం కూడా అసాధ్యమే. అలాగని 24 గంటలూ పోలీసుల మధ్యనే ఉండటం ప్రజాప్రతినిధికి అసాధ్యమైన విషయం. ఒక ఎమ్మెల్య వెళ్లే ప్రతీ గ్రామానికి గ్రేహౌండ్స్ బలగాలు రోడ్ ఒపెనింగ్ పార్టీగా వెళ్లటమూ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎదో ఒక స్థాయిలో మావోయిస్టులతో సంబంధాలను కలిగి ఉంటారన్న సత్యం ఇటు పోలీసులకు కూడా తెలియనది కాదు. కిడారి ఎన్నికయైన తరువాత మావోయిస్టులతో సమావేశమయ్యాడని, వారికి సహకరిస్తూ వచ్చడంటూ వినిపించిన వార్తలను లోపాయికారిగా అయినా అంగీకరిస్తున్నారు. మరి ఎందుకు చంపారు? ఏజెన్సీలో రాజకీయ వైరి వర్గాల హస్తం ఉందంటూ ఘటన జరిగిన రెండో రోజే చిన్న పీలర్ హల్ చల్ చేసింది. అది ఎమ్మెల్యే వాసుపల్లి నోటి నుంచి వైసీపీగా బయటకు వచ్చి ఆ తరువాత రోజుల్లో తెలుగుదేశం నేతతో సహా అంటూ దాదాపుగా నిర్ధారించే స్థాయికి చేరుకుంది.(ఈ వార్తా కథనం రాసే సమయానికి) వారు చెపుతున్న వ్యక్తులు నిజంగా ఆ స్థాయి కలిగిన వారేనా? ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు చనిపోతే వారికి కలిగే లబ్ధి ఎంత? అన్న ప్రాథమిక ప్రశ్నలను వేసుకోవటానికి పెద్దగా ఎవ్వరూ ఇష్టపడని సందర్భ సన్నివేశంలో మనం ఉన్నాం. అయతే మావోయిస్టుల యాక్షన్ కు పోలీసులు చెపుతున్న చోటా మోటా నేతల సహకారం ఉందా? అంటే పూర్తిగా తోసిపుచ్చలేము. తుపాకిని పాయింట్ బ్లాంక్ లో పెట్టి అడిగితే నిరాకరించే స్థాయి సామాన్యుడికి ఎవరికి ఉంటుంది? అలా బెదిరించి చెప్పింది చేయమని మావోయిస్టులు ఆజ్ఞాపించినపుడు ‘సహకరించారు’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మావోయిస్టుల చర్యను ఊహించే అవకాశం ఉంటుందని అనుకోవటం శుద్ధ దండుగ. కాదని నిరాకరించి అడవిలో ఉండలేరు, మైదానానికి వచ్చి బతుకీడ్చనూ లేరు. వారికి ప్రత్యామ్నాయం లేదన్న విషయం పోలీసులకు తెలియందీ కాదు. మావోయిస్టుల తూటాలు రక్తం తాగాయి అంటూ వార్త వెలువడిన కొద్ది సేపటికే విశాఖరూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన మావోయిస్టు మిలటరీ వ్యూహాలలో ప్రసిద్ధుడైన చలపతి రాకపోకలు విశాఖ ఏజెన్సీలో ఉన్నాయన్న సమాచారం మాకు ఉందని ప్రకటించారు. గునుకురాయిలో చలపతి సమావేశం నిర్వహించిన విషయమూ తెలుసునంటూ వాకృచ్చారు. ఇన్ని తెలిసిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాలకు వెళుతున్నారన్న సమాచారం తెలిసినపుడు వారిని నిలువరించటమో లేక పోలీసు బలగాలను పంపించటమో ఎందుకు చేయలేదు? జాగ్రత్తగా ఉండండి అంటూ నోటీసు ఇచ్చిన విషయం బూటకమని ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో పై ప్రశ్నకు ప్రాధాన్యం పెరిగింది. మావోయిస్టుల యాక్షన్ కు ముందు రోజు అరకు, పరిసర కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఘటన జరిగిన రోజు మంత్రం వేసినట్లు ఎందుకు మాయమయ్యారు? లోతట్టు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన అత్యుత్తమ నెట్ వర్కింగ్ వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పుకొనే వీరికి మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టుల కదలికలపై కనీస సమాచారం లేకుండా పోయిందా? ఒకరు కాదు ఇద్దరు కాదు... సుమారు 100 మంది వరకూ ఘటన జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నారు. అంత మంది వచ్చినా పోలీసులు పసిగట్ట లేదంటే ఎవరి వైఫల్యం? తాము రక్షించాల్సిన నేతల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా హమ్మయ్య ప్రాణాలు దక్కాయంటూ నిమ్మకుండి పోయిన గన్ మెన్ వ్యవస్థ ఎందుకు? మంచినీళ్ల బాటిళ్లు, చేతి రుమాళ్లు మోయటానికే పరిమితం చేయటంలో ఎవరి తప్పు ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బహిరంగంగా కాకపోయినా, అతర్గతంగా అయినా పోలీస్ వ్యవస్థ వెతికే తీరాలి. లేదంటూ ఈ సంఘటన చవరిది కాబోదు. మావోయిస్టులు తాము నమ్మిన సిద్ధాంతానికి, తాము సాధించాలనుకున్న లక్ష్యానికి ఏ మాత్రం ఉపయోగపడని ఈ యాక్షన్ తో వాళ్లకు అవసరమైనంత ప్రాచుర్యాన్ని మాత్రం సంపాదించుకోగలిగారు. జాతీయ స్థాయిలో మరోసారి పతాక శీర్షికలలోకి ఎక్కారు. ఏపీలో కనీసం రెండు రోజులు పతాక శీర్షికలలోనూ, ఇప్పటికీ ప్రధాన పత్రికలో ఏదో ఒక స్థాయి వార్తగానూ చోటు సంపాదించుకోగలిగారు. ఇది మాత్రమే చాలనుకునే ఎత్తుకి వారు ఎదిగి ఉంటే మాట్లాడుకోవలసింది ఏమీ లేదు. అయితే అది నిర్ధారణ కావాల్సి ఉంది. చివరిగా ఓ రెండు మాటలను ఇక్కడ మాట్లాడుకోవలి. ఓ రాజకీయ నాయకుడు మాట్లాడుతూ, ‘‘అడవిలో తుపాకీ లేని ప్రతి ఒక్కరూ గిరిజనుడే. తుపాకీ ఉన్న ప్రతి ఒక్కరూ మావోయిస్టే’’ అన్న మాటలు ఎంత సత్యమో ఓ పోలీస్ అధికారి అన్నట్లు ‘‘ఇలాంటి సంఘటలు జరుగుతూండాలనే వ్యవస్థ కోరుకుంటుంది. లేదంటే తన మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని వ్యవస్థలు భావిస్తుంటాయి’’ అంటూ నర్మగర్భంగా చెప్పిన మాటలూ అంతే సత్యం.