8, జూన్ 2016, బుధవారం

అంతా మనీ మహిమే

నదులు ఎండిపోతున్నాయి. కుంటలు పూడిపోతున్నాయి. పాపాలను కడిగేసుకోవటానికి దేవుడి దగ్గర పెట్టిన హుం డీలు నిండిపోతున్నాయి. కుబేర సంపదలా ఎంత తీసినా తరగనంటున్నాయి. డబ్బు కోసం ప్రమాదం హత్య అవు తుంది. అదే నోటు ఓ శవానికి తండ్రిని పుట్టిస్తుంది. తెలిసి కొంత, తెలియక మరికొంత, వృత్తి అనైతిక పోటీ ఇంకొంత కలగలసి రాతగాళ్ళనీ, మాట గాళ్ళనీ బ్రోకర్లను చేసేస్తుంది. అర్థం కాలేదు కదూ. కొంచెం లోపలకి వెళ్ళండి.

అన్నీ నిజాల్లానే కనిపిస్తాయి. అంతలోనే మాయ కమ్మేస్తుంది... నీడకు, నిజానికీ తేడా లేకుండా. తేల్చుకోవటానికి చేసే ప్రతీ ప్రయత్నం ఆ క్షణానికి వృథా. నిజం మాట్లాడుకుందాం. నిర్దేశించుకున్న గీటు రాళ్ళకు తూగితే చాలు. అబద్ధాన్ని వెతికిపట్టుకోవాలన్న కోరిక, పట్టుకునేటంత ఓపిక ఎవ్వరికి వున్నాయి బ్రదర్. ఓ ప్రమాదం జరిగింది. కారుతో గుద్ది చంపేసిన వాడు మానవత్వాన్నే మరిచిపోయాడో లేక చావు భయంతో పారిపోయాడో తెలియదు కానీ చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవాలనుకుంటూనే తప్పుమీద తప్పు చేసుకుంటూ చీకట్లోకి జారుకున్నాడు. తల్లిని కోల్పోయామన్న దిగులుతో కన్నీరు మున్నీరుగా ఏడ్వాలని కూడా తెలియని చిన్నారులను సాకుగా చూపిస్తూ సన్నకారు ప్రజాప్రతినిథులు చెలరేగిపోయారు. ప్రమాదం కాదది... ఓ పోకిరీ, మదమెక్కిన మనీషి వెంటాడి, వేధించి చంపిన ఘటన అంటూ గెంతెత్తి చాటారు. బాధిత బంధువులూ జతకలిశారు. భలే మేత దొరికిందంటూ మీడియా చెలరేగిపోయింది. మీడియాలో కథనాలను చూసి మరింతగా భయపడినట్లు నటించిన ముద్దాయి అడ్డగోలుగా కలి సొచ్చిన సొమ్మును ఎరవేశాడు. తాగిన మత్తులో చంపేసి ఘనంగా చలామణి అవుతున్న బడాబాబులను ఆదర్శం గా తీసుకున్నట్లున్నాడు. ప్రజాప్రతినిథులను ఆశ్రయించాడు. రాజీ చేయమని అర్థించాడు. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు. పంచాయతీ జరిగింది. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. హత్య చేశారంటూ అరిచిన గొంతులన్నీ మూగవోయాయి. మాట్లాడటం కూడా కష్టమేనంటూ మొరాయించాయి. అరిచిన గొంతులకు వత్తాసు పలికిన వారిలో కొందరి చేతులు బరువెక్కాయి. సామాజిక మాధ్యమాలలో మృతురాలికి మద్దతుగా మాటలు కత్తులై యుద్ధం చేశాయి. 

రాజకీయం హంతకులకు వత్తాసు పలుకుతోందంటూ లోకం కోడై కూసింది. పోలీసులు అమ్ముడుబోయారంటూ వా ట్స్ యాప్ లో సందేశాలు హోరెత్తాయి. ఘటన జరిగిన వారం తరువాత పోలీస్ బాస్ మీడియా ముందకు వచ్చారు. హత్య కాదనీ, ప్రమాదంలోనే వివాహిత మహిళ చనిపోయిందనీ సవివరంగా వివరించారు. సందేహాలకు సమా ధానాలిచ్చారు. వెంటాడి వేధించి చంపారంటూ బాధితులు ఎందుకు ఆరోపించారన్న ప్రశ్నకు సమాధానం వారినే అడగాలంటూ తేల్చేశారు. సమాజాన్ని తప్పుదారి పట్టించిన వారికి శిక్ష వేస్తారో వెయ్యరో తేల్చకుండానే సమావేశాన్ని ముగించారు. ఓ ఘటనను తప్పు దారి పట్టించిన ప్రజాప్రతినిథులను, డబ్బు పంచాయతీ చేసిన ప్రజాప్రతినిథులను కూడా వదిలేది లేదంటూ గంభీరంగానే ప్రకటించారు. అప్పటికే ఆమెది హత్యేనంటూ ఫిక్స్ అయిన మెదళ్ళకు పోలీస్ నిజం రుచించలేదు. నిజం మరేదో వుందని గాఢంగా నమ్మిన వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోగువడ్డారు. ఏదో ఒకటి చేయాలంటూ తపన పడ్డారు. బాధితులే అమ్ముడు పోతే ఏం చేయగలమంటూ దిగులుపడ్డారు. సముద్ర ఘోష. కెరటాల సవ్వడి. ఉదయం నుంచే ప్రారంభమయ్యే స్పందనలు, అర్థారాత్రి దాటే వరకూ కొనసాగుతూనే వున్నాయి. సందేహాలకు తావే లేని నిజాల ప్రకటన ఇప్పుడు కావాలి. ప్రమాదాన్ని హత్యగా మలిచినవాళ్ళనో, కాకుం టే హత్యను ప్రమాదంగా చాటిన వాళ్ళనో ఉతికి ఆరేయాలి. చాకలి బండపై వేసి చితక్కొట్టాలి. నోటు కన్నా జీవితం పెద్దదని నమ్మేవాళ్ళకు ఊపిరిపోయాలి. 

మరిచిపోక ముందే మరో దెబ్బ పడింది. తాగిన మైకంలో కారు ఊగింది. రోడ్డుపై ఇష్టానుసారం డాన్సాడింది. ఫుట్ పాత్ పై వున్న ఓ ప్రాణిని నీ అవసరం లేదంటూ గాలిలోకి విసిరేసింది. చివరికి అలసిపోయి నడిరోడ్డుపై ఆగిపోయింది. పోయిన ప్రాణానికి నేనే తండ్రినంటూ వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని మోసుకెళ్ళాడు. అనాథ శవాలను ఖననం చేసే ప్రే మ సమాజానికి అప్పగించి పారిపోయాడు. రెండు గొయ్యల్లో ఐదు శవాలను పాతేసి తమ సామాజిక బాధ్యతను ఘనంగా నిర్వర్తించిన సమాజం చేతులు దులుపుకుంది. పోలీసులు ఎపి05బిఎన్266 కారుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన రెండో రోజులకే శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ పల్లె... విశాఖకు వచ్చింది. పోయినోడు మా కొడు కేనంటూ నెత్తీనోరు బాదుకుంటూ ఏడ్చింది. మృతదేహాన్ని ఇప్పించాలంటూ దీనంగా వేడుకుంది. రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ ఎదుటే కాపురం చేసింది. తహశిల్దార్ లేడంటూ కాసేపు, వైద్యులు రాలేదని మరికాసేపు చెప్పిన ఖాకీలు ''అంత గుడ్డిగా ఎవరికో మృతదేహాన్ని ఎట్లా అప్పగించామబ్బా?'' అన్న ప్రశ్నకు తావే ఇవ్వలేదు. మూడో రోజు మధ్యాహ్నానికి కొడుకు శవాన్ని చూసిన ఆ తల్లిపేగు నెమ్మదించింది. అలిగి ఇల్లు వదిలి వెళ్ళిన ప్రతీసారీ ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తాడన్న నిన్నటి ఆశ అడుగంటింది. నీరెండిన గాజుకళ్ళతో ఆ తల్లి దండ్రులు పల్లెవెలుగు బస్సెక్కారు. ఇక్కడా పచ్చనోట్ల పెరపెరలు వాస్తవాలకు నల్లగుడ్డ కట్టాయని విస్తృతంగా ప్రచా రం సాగుతోంది. 

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఇప్పుడు ఈ హరులు నోటునే సర్వరోగ నివారణిగా చీటీలు రాస్తున్నారు. మింగిన రోగులు నోటుకు అలవాటుపడ్డారు. తప్పే జరిగిందో లేక తలరాతే తిరగబడిందో... మొత్తం మీద రోగి చనిపో తాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగుతారు. ఎక్కడ మేత దొరుకుతుందా? అని గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తుండే గొట్టాలకు సమాచారం అందిస్తారు. కాకులు వాలతాయి. ఈ లోగా సకల మర్యా దలతో ఆందోళనకారులకు పిలుపు అందుతుంది. లోపల అంగీకారాలు కుదురుతాయి. బరువు చేతులు మారతుం ది. బయటకు వచ్చిన మృతరోగి బంధువర్గం... గొట్టాలెవ్వరో తెలియనట్లే తల తిప్పుకుంటూ సాగిపోతుంది. ఎర్రోళ్ళారా అంటూ ఆసుపత్రి ఓ వంకరనవ్వు నవ్వుతుంది. 

కలికాలం. ధర్మం ఒంటి కాలిపై కుంటుతుంది. డబ్బు సర్వాంతర్యామి అవుతుంది. సర్వం తానే ఐ నర్తిస్తుంది. మంచి కి చోటుండదు. మనసుకు, మమతకు తావుండదు. అంతా బ్రహ్మంగారు చెప్పినట్లే నడుస్తోంది. అబద్ధం నిజమైన వేళ భిన్నంగా వుంటానంటూ వచ్చిన పోలీసు బాసు ఏం చేస్తారో? రక్తమోడుతున్న నిజాన్ని ఐసియుకి తరలించి బతికిస్తా రా? కరాళనృత్యం చేస్తున్న అబద్ధాన్ని కట్టడి చేస్తారా? నా పరిథి కాదని నిమ్మకుంటారా? సవాలక్ష సందేహాలకు సమాధానాలను విశాఖ వెండితెరపై చూడాల్సిందే.