23, ఆగస్టు 2020, ఆదివారం

అంత ఎగతాళి ఎందుకో?

 

వారం ముందు నుంచే... ఆమాటకొస్తే... సుమారు 15 రోజుల ముందు నుంచే నా ప్రిపరేషన్ మొదలయింది. ఎందుకు, ఏమిటి వంటి సవాలక్ష ప్రశ్నలు వస్తాయని తెలుసుకానీ మరీ ఇంతగా నవ్వుకుంటారని తెలియలేదు. దాదాపు రెండేళ్ల తరువాత అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తున్నాను. అడపాదడపా ఓ గంట ఉండడానికి కాదు. కనీసం వారం రోజులు ఉండాలని గట్టిగానే అనుకున్నా. అదీ అమ్మ కోసం. ఎప్పుడు వెళ్లినా అమ్మ అస్సలు రావడం లేదంటూ బెంగగా మాట్లాడుతోంది. ఎందుకో అలా అలవాటు పడిపోయింది. విశాఖలో ఉన్న పదేళ్లపాటు నన్ను భరించీ, భరించీ... మరీ దూరంగా ఉంటే అసలేమీ తోయదన్నంతగా అలవాటయిపోయినట్లుంది. అలాగని నాన్నేమి తక్కువ కాదు. కాకుంటే 76 ఏళ్ల వయస్సులోనూ ఆయనకున్న వ్యాపకాలు అస్సలు తీరకలేనట్లున్నాయి. అందుకే అడపాదడపా నేను గుర్తుకొచ్చినా ఫోనులో మాటలతో సరిపెట్టేసుకుంటాడాయన.

ఈరోజే వెళ్లాలి. నిన్ననే చెప్పాను ఇంట్లో. నేను రేపు మా పుట్టింటికి వెళ్తున్నాను. ఓ వారం రోజులు ఉంటాను అని. అప్పుడేమీ ప్రశ్నలు లేవు. హమ్మయ్య అనుకున్నా. ఒక్కోటీ సర్దుకోవడం మొదలుపెట్టా. కరోనా పుణ్యమా అని ఇంటి నుంచే కదా పనిమొత్తం. అందుకనే ముందుగానే నా డెస్క్ టాప్ సర్దుకున్నాను. ఇంటిలో నుంచి పెద్దగా బయటకు వెళ్లేదేమీ లేదుకదా అని ఓ జత దుస్తులు... పల్లెలో పచ్చటి పొలాలు చూస్తూ నడవచ్చునుకుంటూ అందుకు తగ్గట్లుగా జాగింగ్ ట్రాక్ లు రెండు సర్దుకున్నాను. యాభై ఏళ్లంటే మరీ చిన్నవయస్సేమీ కాదు. బీపీ బిళ్లలు, కరోనా పేరుతో రోజూ చప్పరిస్తున్న సీ విటమిన్ బిళ్లలు జాగ్రత్తగా సర్దుకున్నాను. అన్నీ సర్దుకున్నానో లేదో మరో సారి చెక్ చేసుకొని... మర్చిపోయిన దువ్వెనను కూడా సంచీలో వేసుకున్నా. అప్పటి వరకూ రాదనుకున్న ప్రశ్న రానే వచ్చింది. ‘‘ఎందుకు ఇప్పుడీ ప్రయాణం? నీకు ఇక్కడ  బాలేదా?’’ అంటూ. దాచుకోడానికేం ఉంది కనుక... అందుకే ఠక్కున చెప్పా.. ‘‘అబ్బే అదేం లేదు. అమ్మ మరీ బెంగగా ఉన్నట్లుంది. అందుకే వెళ్తున్నా’’ అని. పిల్లలూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఏంటి, మరి ఎప్పుడు రాక? నీవు లేకపోతే మాకు పెద్దగా తోయదు. వారం రోజులా?  నీజంగానేనా? ఎలా ఉంటావు?... అన్ని ప్రశ్నలకూ మౌనమే సమాధానం. మధ్య మధ్యలో చిన్న నవ్వుతో... ‘ఏం నేను లేకుంటే మీకు తోచదా? ఆడుకోవడానికి మీకు ఎవ్వరూ దొరకరా నేను లేకుంటే?’ అన్న ప్రశ్నకు పిల్లల నుంచి సమాధానం ఏమీ లేదు. కారులో పిల్లలిద్దరూ నన్ను మా ఇంటి దగ్గర దించారు. కొద్దిసేపు తాతమ్మ, తాతయ్యలతో గడిపి వెళ్లిపోయారు. 

నాన్న నా గది నాకు ఇచ్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ అది. నాకు చాలా ఇష్టమైన ఇల్లు. దానిని కట్టేటప్పుడు ఎంత కష్టపడ్డానో. నా చేతులు మీదుగానే నిర్మాణం మొత్తం సాగింది. ఆ ఇంటితో నాకు ఎన్నో చేదు తీపి జ్ఞాపకాలు. వర్షాలు పడుతున్నాయేమో ఓ రాత్రి వణుకొచ్చింది. మొదటి రోజు కప్పుకోడానికి దుప్పటి లేదు. ఓ వైపు చలి, మరోవైపు దోమలు. పెద్దగా నిద్రపట్టలేదు. అదీ కాకుండా చాలా రోజులయింది కదూ. ఏదో మైమరుపుతో కూడిన కొత్తదనమూ నన్ను ఇబ్బంది పెట్టింది. ఎంతైనా నా ఇల్లు కదా. ఒక్కరోజులోనే సర్దుకున్నా. వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఈలోగా ఫోనులు చేసిన మిత్రులందరికీ పుట్టింట్లో ఉన్నానని చెపితే ఎంత పగలబడి నవ్వారో. ఎందుకు నవ్వుతున్నారో అర్థమయ్యేది కాదు. నేను పుట్టింటికి వెళ్లానంటే అంత నవ్వు ఎందుకు వచ్చిందో. శనివారం రానే వచ్చింది. పిల్లలకు ఫోన్ చేశా. అరే ఏమైనా వచ్చి తీసుకువెళ్తారా? అని. పెద్దోడి సందేహం... ఏంటీ అప్పుడే వచ్చేస్తావా? అని. అక్కడితో ఆగితే బానే ఉండేది. వెంటనే వాడు... ‘మరో వారం రోజులు ఉండాలనుకుంటే ఉండు’ అన్నాడు. ఏంటి వీళ్లు నన్ను తేలిగ్గానే మరిపోయినట్లున్నారే అన్న చిన్న బెంగ, సందేహం ఒక్కసారిగా దాడి చేశాయి. వెంటనే... అరే వచ్చి తీసుకెళ్లండిరా అని గట్టిగా చెప్పేశాను. ఇంట్లో అమ్మ, నాన్నకు కూడా చెప్పాను. ఈరోజు నేను మా ఇంటికి వెళ్తున్నాను అని. బెంగ తీరిపోయినట్లుంది, అమ్మ సరేనంది. నాన్న సరేనంటూ ఆయన బిజీలో ఆయన పడిపోయారు. వస్తూ వస్తూ నాన్నకి చిన్నపాటి పని, ఇంటిలో కొద్దో గొప్పో పట్టించుకోవాల్సిన విషయాలను గబగబా చేసేశా. ఏదో గుబులు. చిన్న అలజడి. పిల్లలు వచ్చారు. ఓ గంటసేపు కూర్చున్నారు. పిల్లలకు ఇష్టమని అమ్మ చేసిన పులిహోర కనీసం వాసన కూడాచూపించకుండా ఇద్దరూ నాకేశారు. వెనక్కి తిరిగి చూడకుండా కారెక్కాశాను. ఓ 20 నిమిషాల్లో ఇంటికి వచ్చేశాం. ఇంటిలోకి రాగానే ఓ మిత్రుడు ఫోను చేస్తే... ‘ఇప్పుడే పుట్టింటి నుంచి వచ్చా. వారమయింది వెళ్లి’ అని చాలా కాజువల్ గా అన్నా. అంతే వెంటనే  పకపకా నవ్వులు. ఎందుకండీ అంత నవ్వు అంటూ అనగానే... పక్కనే వాళ్ల ఆవిడ ‘సారె’ పట్టుకొచ్చావా? అంటూ నవ్వుతోంది. మా ఆవిడ మాత్రం పెద్దగా మాట్లాడలేదు. వారం రోజులు లేను కదా. మళ్లీ కథ మొదలయింది. ఇంతకీ నేను పుట్టింటికి వెళ్లడంలో తప్పేంటో మీకైనా అర్థమయిందా? తెలిస్తే చెప్పరూ... ప్లీజ్....

19, ఆగస్టు 2020, బుధవారం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

          

 ఒక్కటే చిత్రం... అయితేనేం కంట నీరు తెప్పిస్తుంది... భావోద్వేగాలను రగిలిస్తుంది... గుండెల్లో కోపాగ్నిని మండిస్తుంది... మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలను రేపుతుంది... వేల ప్రశ్నలకు కారణమవుతుంది... సంచలనాలకు వేదికవుతుంది... మార్పుకు నాంది పలుకుతుంది... 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టు మిత్రులకు మనఃపూర్వక శుభాకాంక్షలు. అత్యంత సంక్లిష్ట సమయంలో మీ వృత్తి ప్రయాణం సాఫీగా సాగాలని... మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ కష్ట సమయాన్ని అధిగమించాలని ఆకాంక్షిస్తూ...

(చిత్ర సహకారం మిత్రుడు రామకృష్ణ)


23, జులై 2020, గురువారం

ధైర్యం కన్నీరైన వేళ...

జీవితం బుడగలా మారిన క్షణంలోనే తెలుసు.. చిన్నపాటి సూది గుచ్చుకున్నా పగిలిపోతుందని. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా పన్నెండేళ్ళు... తనంటే ఇష్టపడి, అయిన వారందరినీ వదిలిపెట్టి చేయిపట్టుకున్నందుకు... ఆమెకు, ఆయన ప్రాణవాయువయ్యాడు. ఎన్నడూ కన్నీరెట్టని ధీరునిగా అభిమానులెందరి గుండెల్లోనో కొలువుదీరిన నేత... ఆప్తుల ముందు మున్నీరయ్యాడు. నిగ్గపట్టుకున్న ధైర్యం ఒక్కసారిగా ఇక నావల్ల కాదు ఈ నటనంటూ జారిపోయింది. నిన్నటి వరకూ నీవున్నావన్న భరోసా... ఇప్పుడు మరి లేదంటే ఎలా? అంటూ మౌనంగా రోదిస్తున్న మనస్సుకు... వేయాలనుకున్న ముసుగు మరి ఉండనంది. 

‘‘ఇష్టం, అయిష్టం, ప్రేమ, మోహం, అభిమానం, కోపం, పట్టుదల... అన్నీ... నా  ఇష్టాయిష్టాలన్నీ తనకే తెలుసు, నాకేం కావాలో నాకు తెలియదని తెలుసుకోవటానికి ఇంత కాలం పట్టింది...’’ ఈ మాట చెప్పేటప్పుడు వణికే ఆ కంఠం వెనుక తరగని ప్రేమ గురించి ఏమి చెప్పినా తక్కువే. 

నగరంలో విలక్షణ నేత. పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్న నేత. తాను నమ్మినదానిని ముక్కుసూటిగా ప్రకటించగలిగిన మనిషి. తాను చేయదలచుకున్న దానిని కుండబద్దలు కొట్టగలిగే రాజకీయుడు సబ్బం హరి. ఏడేళ్ళ ప్రేమ గాఢమై వైవాహిక బంధంతో పెనవేసుకున్న తన సహచరి లక్ష్మిని కోల్పోయిన ఆయన, తన ఆప్తులతో మాట్లాడుతూ... ‘‘నిన్నటి వరకూ తను మంచపైనే వున్నా... ఓ పలకరింపుంది. ఇంటిలో మనిషి వుంది. తాళం అవసరమే లేదన్న ధీమా వుంది. ఇప్పుడు అది లేదు’’ అంటూ జారటానికి సిద్ధంగా వున్న కన్నీటిని చే రుమాలు చాటున దాచేశారు. 

సబ్బం హరి కాంగ్రెస్ తో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీకి ఎదురుగాలి వీస్తున్నప్పుడు మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్లలో గెలుపొందిన నేత హరి. ఆ తరువాత అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫాం ఇస్తే... డబ్బులు జల్లకుండా అభిమానుల అండతో పార్లమెంటు మెట్లు ఎక్కిన నేత ఆయన. సమైఖ్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ కుత్సితత్వాన్ని నిర్ద్వందంగా ఖండించిన నేత. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచి నియమాలకు వ్యతిరేకంగా వుండలేనటూ విలువలకు కట్టుబడిన మనిషి. వైఎస్ కుమారుడిగా జగన్ ను అభిమానించిన హరి.. ఆ తరువాత ఆయనతో వచ్చిన విభేదాల నేపథ్యంలో అంతే దూకుడుగా బయటకు వచ్చేశారు. ఇవన్నీ ఎలాంటి ఆలోచనా లేకుండా చేసుకుంటూ పోవటానికి ఆయనకున్న బలం సహచరి లక్ష్మి. 

జీవనరేఖ లక్ష్మి 12 ఏళ్ళ క్రితం అనారోగ్యం పాలైనప్పుడు... ఇక మంచానికే పరిమితవ్వాలని తెలిసినప్పుడు... తొలిసారిగా ఆయనకు అర్థమయ్యింది. ఏ దిగులూ లేకుండా నిరంతరం ప్రజలతో వుండే అవకాశం కేవలం తన జీవిత సహచరి వల్లే కలిగిందనీ... ఆమె సహచర్యం, సహకారం లేకపోతే ఇంతటి ఉజ్వల ప్రజాజీవితం, వెలకట్టలేని ప్రజాభిమానం సంపాదించటం సాధ్యమయ్యేదేకాదని. గర్తించిన విషయాన్ని అయినవాళ్ళని భావించిన వారితో పంచుకోవటానికి ఆయన ఏనాడూ ఇబ్బందిపడలేదు. 

తన ఇంటి లక్ష్మిని, దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోవటానికి ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూసి అబ్బురపడిన కలమో, కెమేరానో ఆయన్ని చిన్నగా అడుగుతాయి. మీదైన ప్రేమైక జీవితాన్ని పదిమందికీ పంచటానికి అనుమతి ఇవ్వండంటూ. సున్నితంగా తిరస్కరించిన సందర్భాలెన్నో. ‘‘మా ఇద్దిరికే సంబంధించిన ప్రేమైక జీవితం. చూసి నేర్చుకుంటే అభ్యతరం లేదుకానీ, చాటుకోవటం ఇష్టం లేదు’’ అంటూ కొంచెం కష్టపడినా మెత్తటికరుకుదనంతో చెప్పేస్తారు. ‘మనిషి సంతోషంగా వున్నప్పుడు చాలా మంది వస్తారు. కష్టాల్లో వున్నవారి వెంటే మనం వుండాలి’ అన్న మాటను నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించిన హరి ఇప్పుడు నీరవుతున్న గుండెను చిక్కబట్టుకుంటున్నారు. గడచిన మూడేళ్ళుగా తన భార్య లక్ష్మిని చూసుకోవటంలో చేదోడు వాదోడుగా నిలిచిన తన కొడుకును అంత దుఃఖంలోనూ అబ్బురంగా చూసుకుంటూ ఈ కాలంలోనూ పిల్లలు ఇలా విలువలతో పెరిగారంటే లక్ష్మి వల్లేనంటూ మౌనంగానే చెప్పకనే చెప్తారు.

ఆ ఇంటిలో తలుపులున్న ఏ గదికీ తాళం వుండదు. తాళమున్న ఏ ఆరకైనా చెవి తలుపుకే తగిలించి వుంటుంది. స్వేచ్ఛతో వచ్చిన నమ్మకం. ఆ నమ్మకమనే ఇంటికి ప్రేమే పునాది. బీటలే వారని ఆ ప్రేమ బంధం చెక్కు చెదరదు. భౌతికంగా మనుషులు అశాశ్వతమైనా... ఆ మనస్సుల్లోని మమతలు మాత్రం శాశ్వతం.

రాత: 23 మే 2017

9, జూన్ 2020, మంగళవారం

వాడు భయపెడుతూనే ఉన్నాడు


వాడు ఊహించని హఠాత్ పరిణామం
నా ప్రేమోన్మత్త కాంక్షాభరిత ప్రపంచానికి
వాడో సుతిమెత్తని అడ్డమన్న భయం
వాడు.. వాడే, నువ్వు.. నువ్వే 
అభయాన్నీ స్వీకరించనివ్వని వైకల్యం
ఎంత చెప్పినా... పట్టు సడలిందన్న భావన
కాదు కాదు... వాడు ఆక్రమించేశాడు మెల్లగా
మెట్టుపై చెప్పిన కథలను... పంచిన సుధలనూ
మింగేసిన బుర్ర తక్కువ కర్కశత్వం
లేతాకుపై పురుగు చేసిన గాయం
ప్లాస్టిక్ సర్జరీలు లేవు.. లేపనమూ లేదు
ఒకటా రెండా... సమ్మెట పోటులెన్నో
గొడ్డలి దెబ్బకు చీలిన చెట్టు
పదును మొద్దుబారినా గాయం మానదు... 
ప్రతిబింబమై నిలిచిన రూపు వాడు
ఇప్పుడూ భయపెడుతూనే ఉన్నాడు
సారం వేరై... సడి లేని నవ్వుతో
సొదలు లేని ‘సుర’లు పంచుతూ

8, జూన్ 2020, సోమవారం

పాదచారులకు ప్రవేశం లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 6వ తేదీ విలేకరుల సమావేశం విన్న తరువాత ఇంత కాలం లోలోపలే ఉండిపోయినదేదో బయటకు వచ్చేయాల్సిందే నంటూ తెగ ఇబ్బంది పెడుతోంది. ఇది రాయడంతోనే నాపై ఆంధ్రోడు అంటూ సామాజిక మాధ్యమాల్లో దాడి జరిగితే జరగచ్చు గాక... ఇక్కడ నాకు లేని, నేను ఎన్నడూ చెప్పుకోని సామాజిక వర్గానికి నన్ను ప్రతినిధిని చేసి దునుమాడుదురే గాక... అయితేనేం రాయకుండా ఉండలేని ఒకానొక మానసిక దౌర్భల్యం నన్ను వెన్నాడుతోంది. బయట పడకపోతే కరోనాతో క్వారంటైన్ అయిన వారికీ నాకూ మధ్య పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు.  

కొద్ది కాలంగా నేను పనిచేస్తున్న పత్రిక భవిష్యత్తుపై అనేకానేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటినన్నింటినీ యాజమాన్యం ఖండిస్తూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అధికారంతో పెట్టుకొని ప్రకటనలు దాదాపు లేని స్థితికి పత్రిక చేరుకొంది. దీనికి భిన్నంగా మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్థానిక, జాతీయ పత్రికలనేకం ఆయా ప్రభుత్వాల ప్రాపకం కోసం పాకులాడుతున్న ప్రత్యేక సందర్భంగా కళ్ళ ముందు ఉంది. దీనిని గుర్తిస్తూనే గుర్తించనట్లు యాజమాన్యం వ్యవహరిస్తూ లొంగే ప్రసక్తే లేదంటూ ఓ విధంగా తెంపరితనాన్ని (ఎలాంటి వ్యూహ్యమూ లేకుండా సాగడం) ప్రదర్శించింది. ఆంధ్రలో గత ప్రభుత్వంపై  విపరీత అవాంఛనీయ మమకారాన్ని ప్రదర్శించడమూ మరో రూపంలో చెరుపునే తెచ్చింది. (రాష్ట్రంలోని మరో పెద్ద పత్రికతో పోల్చితే గత ప్రభుత్వపైనా అంతో ఇంతో సునిశిత విమర్శ చేసిన పత్రిక ఇదే అన్నది నిస్పాక్షింగా చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది. )

జాతీయ, స్థానిక తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆర్థిక ప్రేరేపిత పథకాలకు ప్రథమ పీటను వేయడం, సంకుచిత కుల, మత రాజకీయాలను విద్వేషపూరిత స్థాయికి తీసుకొని వెళ్లడం చాలా మంది గమనిస్తూనే ఉంటారు. ఈ అభిప్రాయాన్ని రాజకీయ పక్షాలు అంగీకరిస్తాయా? లేదా? అన్నది పక్కన పెడితే... దేశంలోని సాధారణ పౌరుల్లో చాలా మంది అంగీకరించే పరిస్థితి నేడు కనిపించడం లేదు. పైపెచ్చు ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన వారెవరైనాసరే దేశ, జాతి ద్రోహులుగా చిత్రీకరించి వెంటనే మానసిక, భౌతిక దాడులకు దిగడానికి సిద్ధమవుతున్న గుంపు... ఇంకెంత మాత్రమూ ముసుగులతో ఉండాల్సిన పనిలేదంటూ నిస్సిగ్గుగా బోర ఎత్తుకు తిరుగుతోంది. వెంటాడుతోన్న అశాస్త్రీయ కరోనా మరణ భయం ఓ మతం పట్ల సృష్టిస్తోన్న భీతావాహక విద్వేషం మరో మెట్టు ఎక్కడానికి సిద్దంగా ఉంది. పాలకుల సంగతి నాకెందుకు?... ‘నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏం కోరుకుంటుందో దానినే పాలకులు ఇస్తున్నారని ఎందుకు అనుకోవు’ అన్న  ఓ పెద్దాయన మాటలను గుర్తు చేసుకొంటే మనసుకు ఒకింత ఊరట. దూరదృష్టి లేకపోవడం, గుడ్డి వ్యక్తి అనుసరణ, ప్రశ్నకే తావులేని ముఢ భక్తి మనకేమీ కొత్త కాదుగా. అవి ఉన్నంత కాలం మన జీవితాల్లో పెద్ద మార్పేమీ ఉండదు.

కరోనాని ఓ మహమ్మారిగా, పెను రక్కసిగా చూపిస్తూ ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బహుశా దానిలో అవి దాదాపు శతశాతం విజయాన్ని సాధించాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు కంపెనీలు తమదైన శైలిలో స్పందించడానికి మెల్లగ అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే మీడియా సంస్థలు తమ తమ పత్రికల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసివేయడం. ఉద్యగంలోకి తీసుకొనేటప్పుడు రాయించుకొన్న ఒప్పంద పత్రాల్లోని సూత్రాలను ఏకపక్షంగా తుంగలోకి తొక్కేసి మరీ తీసివేతలు జరుగుతున్నాయి. ఉన్న పళాన ఉద్యోగంలోంచి వెళ్లిపోవాలి. అదీ స్వచ్ఛందంగా తొలుగుతున్నట్లు లేఖ రాసి, ఉద్యోగితాధారాలన్నీ సమర్పించి న్యాయం జరుగుతుందో లేదో తెలియకపోయినా, అంత సత్తా లేకపోయినా పోరాటం చేయడానికి ఏకోశాన అవకాశం లేకుండా బయటకు నెట్టేస్తున్నారు. దీనికి ఏ ఒక్క పత్రికా మినహాయింపు కాదు. చివరికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలకు కూడా లేదు. 

గతంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఏనాడూ ఉద్యోగిని తీసేసి ఉసురు పోసుకొన్న సందర్భాలు లేవన్న ఓ ఖ్యాతి నేను పనిచేస్తున్న సంస్థకు ఉండేది. చిన్న చిన్న మినహాయింపులు లేవని కాదు. ఆ మానవీయ కోణం నచ్చేది. కష్ట సుఖాలు తెలిసిన యాజమాన్యం అని ఓ గట్టి నమ్మకంతో ఉండిపోయాను. ఈ సుదీర్ఘ కాలంలో యాజమాన్యమూ కొన్ని సుఖాలకు అలవాటు పడిందనీ, పోరాట పటమని ప్రదర్శిస్తున్నామనే పేరుతో స్వీయ రాజకీయ ధోరణలకు తలొగ్గిందనీ, ఈ క్రమంలో అవసరమైతే ఉద్యోగులను, చివరికి సంస్థనూ పణంగా పెట్టడానికి వెనుకాడదనీ అర్థమయ్యే సరికి ఆలస్యమైంది. ఈ యాజమాన్యమూ స్వీయ లాభాపేక్షలే లక్ష్యంగా పనిచేయడం మినహా మరో మార్గం లేదంటూ చేతులు ఎత్తేసింది. కొద్ది నెలల సంక్షోభాన్ని, కష్టాలను ఏ మాత్రం తట్టుకొనే ఓపిక మాకు లేదంటూ విస్పష్టంగా తేల్చేసింది. బయటకు వెళ్లిన వాళ్లు బతకడానికి యుద్ధంచేస్తారు. విజేతలుగా నిలబడతారు. కొద్ది మంది తీవ్ర ఒడిదుడుకులతో నష్టపోతారు. నిజమే కాని... గత కొద్ది కాలంగా బీటలు వారుతూ వస్తున్న సంస్థ ఉమ్మడి తత్వమన్న ప్రహరీ భారీ శబ్ధంతో బద్దలైంది. మరోసారి ఈ గోడను కట్టడం కష్టమే. అందుకనే సరికొత్తగా ముళ్ళ కంపేస్తున్నారు. ఇక్కడ పాదచారులకు ప్రవేశం లేదు.  
 

7, ఏప్రిల్ 2020, మంగళవారం

తిరిగి మొలకెత్తడానికి...

ఇప్పుడు నేను నిజంగానే ఒంటరిని
అనుమానపు దృక్కుల నడుమ
నేనో అంటరాని పక్షిని
సామాజికమో... భౌతికమో...
పదమేదైతేనేం... దూరమొక్కటే సత్యం
ఆరడుగుల ఈ వెడం
స్థిరీకరించబడుతుందేమోనన్న భయం
రేయింబవళ్ల బేధం లేకుండా వెంటాడుతోంది
మునుపెన్నడూ అనుభంలోకి రాని
సరికొత్త భయాలేవో పట్టి పీడిస్తున్నాయి
మహోన్నతుడిని అనుకుంటున్న మ‘నీ’షిని
చాకిరేవు కాడ నిలువు కాళ్లతో నిలిపేశాయి
ఎవడికి వాడే ఇప్పుడు బండకేసి ఉత్తుక్కోవాలి
మరకలతో మందమెక్కిన పాత తోలు
చిరిగిపోవాలి... తోళ్లు లేని
కప్పి ఉంచే నగిషీలు లేని
రక్తమాంసాలతో నికార్సుగా నిగ్గు తేలాలి
ఒంటరిని చేసిన వైరస్ తుంటరిని
తరిమేసే ఆయుధం మానవత్వమొక్కటే
ఆ స్పృహ చాలు నువ్వు గెలవడానికి
మనిషిగా మిగిలి తిరిగి చిరునవ్వులతో మొలకెత్తడానికి...

23, మార్చి 2020, సోమవారం

చరిత్ర శిఖరాధిరోహణకై..

మనమెవరం? మన తాతముత్తాతలు ఎవరు? అసలు మన పుట్టిన ఊరు ఏది? మూలాలను మరింత లోలోతుల్లోకి... తరాలు... దశాబ్దాలు... శతాబ్దాలు... వెళ్లి తెలుసుకోకపోతే, తెలియకపోతే, ‘కాలయంత్రం’లో జారిగిలపడకపోతే... ఎప్పటికీ మన గురించి మనం తెలుసుకోలేం. ఇది మా జాతి అని, ఇది మా నేల అని భావించనూలేం. ఈ నేల నుంచే తూర్పు ఆసియాలోని నలుచెరగులా రాజ్యాలేలిన రాజులున్నారనీ గ్రహించలేం. అస్తిత్వాతల కోసం కొట్లాడుకొంటూ కలిసుండడం ఎట్లనో తెలుసుకొనే అవకాశాలూ కోల్పోతాం. భావ దారిద్య్రం అనే జారుడు బల్లనెక్కిన మనం అడుగంటా జారకుండా ఆసరానుపట్టుకొని తిరిగి శిఖరానికి చేరడానికి కష్టపడాల్సిన సమయం ఎప్పుడో ఆసన్నమైంది. దానిని ఒకింత ఆలస్యంగానైనా... ఇప్పటికైనా గుర్తించకపోతే తెలుగుజాతి దారిద్య్రంలోకి కూరుకుపోతుంది. మనదైనా వాటినెన్నింటినో అన్యులు మాది అంటూ సగర్వంగా చాటుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లిపోతారు. దీనికోసం పదునైన ఆయుధాలు... భావోద్వేగాలను తట్టిలేపి, ఉద్వేగాలను, ఉద్రేకాలను గంపలకెత్తగలిగే సాయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి ‘నర్తనశాల’లో మస్తిష్క మధనం ఆరంభమైంది.
సూరాడ వరప్రసాద్‌... ప్రసాద్‌సూరి... విశాఖ జిల్లా రాంబిల్లికి చెందిన 20 ఏళ్ల బీఎఫ్‌ఏ విద్యార్థి. తనదైన మూలాలను వెతుక్కొంటూ శతాబ్దాల వెనక్కి జారాలని కోరిమరీ ‘చారిత్రక కథారచన కార్యశాల’కు వచ్చాడు. నోరు తెరిచిన రెండు మూడు సందర్భాల్లోనూ తనకున్న జ్ఞాన సంపద చిన్నదేమీ కాదంటూ సహచర రచయితలను ఆశ్చర్యపరిచాడు. అతను వేసుకొన్న జీన్స్‌ జాకెట్‌పైకి ఎక్కిన శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాలు ఉరకలేస్తున్న ఉడుకు ఆలోచనకు ప్రతీకనిపించింది. చిత్తర్వు మధు... కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ళకు చెందిన ఈ 68 ఏళ్ల నవ యువకుడు హృద్రోగ నిపుణుడు. హైదరాబాదులో పనిచేస్తున్నారు. పోలికే లేని విభిన్న వ్యక్తుల సమూహం... అందరూ తమదైన శైలిలో ఆకట్టుకొనే కథనాలతో తెలుగు ప్రజలకు సుపరిచితులైన రచయితలే. అయితేనేం రెండు రోజులపాటు... సుమారు 14 గంటలపాటు... మాట్లాడే వారివైపు దీర్ఘంగా చూస్తూ చెవులు రిక్కించి విన్నారు. విషయ పరిజ్ఞానంతో పరిపుష్ఠమై ఏకధాటిగా సాగిన మాటలను పొల్లుపోకుండా తలలకెత్తుకున్నారు. వంశధార, మంజీర, గుండ్లకమ్మ, చెయ్యేరు, హంద్రి.. నదులు, వాగులై.. చీలి, అభిప్రాయ ప్రవాహాలతో వెల్తువెత్తించి తొలిమాపు వేళ సంగమించారు. తెలుగుభాష సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన శప్తభూమి నవలా రచయిత బండి నారాయణస్వామిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు. ‘‘కుల, ప్రాంతీయ అస్తిత్వాలే నన్ను నడిపించాయి. చరిత్రకారునికి స్వీయ దృక్కోణాలు ఉండకూడదు. కాని కాల్పనిక చారిత్రక సాహిత్యనికి రచయిత, వ్యక్తి దృక్కోణాలు ఉంటాయి. రాయలసీమ అస్తిత్వాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి రెండు శతాబ్దాల వెనక్కి కాలంతో ప్రయాణించి వెళ్లాల్సి వచ్చింది. అయ్యవారిగా పల్లెల్లో ఉద్యోగం చేశానుగనుకే నేను ఈ నవల రాయగలిగాను. 18వ శతాబ్దంలో ఆ ప్రాంతంలో ఉన్న హింసకు నేను అద్దమయ్యానే తప్ప హెచ్చిస్తూ రాసిందేమీ లేదు’’ అంటూ ముఖాముఖి కార్యక్రమంలో నారాయణస్వామి పంచుకొన్న అభిప్రాయాలు.. సందేహాలను కొన్నింటిని తీర్చినా మరింకొన్ని ఆలోచనలను, ప్రశ్నలను లేవనెత్తినట్లే కనిపించింది.
అనుకున్న దానికన్నా తొలిరోజు సమావేశం ఓ అర్ధగంట ఆలస్యంగా ఆరంభమైంది. కొవిడ్‌ 19 భయాందోళనలు ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వస్తారో, రారో అన్న నిర్వాహకుల సందేహాను పటాపంచలు చేస్తూ మొత్తం 36 మంది హాజరయ్యారు. మనదైన చరిత్రను తవ్వితాయాలన్న తాపత్రయం, నలుగురికీ పంచాలన్న తపన మెండుగా ఉన్న ఈమని శివనాగిరెడ్డి తొలి సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ఆది ఆంధ్రుని అడుగులు ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని జ్వాలాపురంలో 74 వేల సంవత్సరాలు క్రీస్తుపూర్వం ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతపు లావా వచ్చిపడింది. దానికింద అవశేషాలు లభ్యమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రాళ్లు, నాణాలు, శాసనాలు మన చరిత్రను మనకు పట్టిస్తాయి. మ్యూజియంలు ఎన్నో విశేషాంశాలను మనకు చెపుతాయి’ అంటూ ఉత్తేజపూరితంగా ఆయన తొలి విభాగాన్ని ఆరంభించారు.
శ్రీకాకుళం వాసి, సాహిత్యంలో చరిత్రను, ప్రత్యేకించి కళింగాంధ్ర చరిత్రను తవ్వితీసే పనిలో నిరంతరాయంగా కృషి చేస్తున్న దీర్ఘాసి విజయభాస్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 15 రకాల అంశాలు చారిత్రక నేపథ్యాన్ని అందిస్తాయని వివరించారు. గతం, వర్తమానం మధ్య సంభాషణే చరిత్ర అని, నదులు ప్రవహిస్తున్న పురాణాలనీ విడమరిచారు. కళింగదేశ ప్రాచీనత, కళింగానికి జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు సిక్కోలు మాటకారితనాన్ని అందరికీ మరోమారు పరిచయం చేసింది. రామాయణ, మహాభారతాల్లోనే కళింగ దేశ ప్రస్తావన ఉందని ఆయన వివరించారు. రామాయణం, అయోధ్యకాండ 71వ సర్గలో కళింగ ప్రస్తావన ఉందని తెలిపారు. దుర్యోధనుని భార్య భానుమతి కళింగ యువరాణి అనీ, చిత్రాంగదుని కుమార్తె అని చెపుతూ... మహాభారతంలోనూ మమ్ముల్ని తొక్కేసారంటూ ఆ  ప్రాంతవాసుల లోలోపలి పొరల్లో ఉన్న అసంతృప్తిని నవ్వుతూనే బయటపెట్టేశారు. బౌద్ధ గ్రంథాలు, జాతక కథల్లోనూ కళింగ చరిత్ర ఉందని వివరించారు. సుత్తపిటకంలోని ఖుద్దక నికాయంలోని దీఘనికాయంలో పేర్కొన్న ‘దంతపురం’ ఇప్పుడు ఆముదాలవలసకు 12 కి.మీ. దూరంలోని రొట్టవలసకు సమీపంలో ఉన్న ‘దంతవరపుకోట’ అని తాజా తవ్వకాలు నిర్ధారించాయని వివరించారు. ‘దంతపురం’లో చాలాకాలంపాటు ఉన్న బుద్ధిని దంతాన్ని శత్రువులకు దక్కకుండా చేయడం కోసం నాటి పాలకులు తరలించిన తీరును వివరించారు. శ్రీలంకలోని కాండీ నగరానికి చేరిన ఆ దంతం ఇప్పటికీ టూత రెలిక్‌ టెంపుల్‌లో భద్రంగా ఉందని విజయభాస్కర్‌ వివరించారు.
‘చరిత్ర మెదడుని బరువెక్కించాలి. చారిత్రక సాహిత్యం మనస్సును తేలిక చేయాలి’ అంటూ తెలంగాణ వాసి కట్టా శ్రీనివాస్‌ తన మాటలను ప్రారంభించారు. తెలంగాణ పల్లెల్లో తనకు దొరికిన ఆధారాలు, వాటి ఆధారంగా చరిత్రను తవ్వుతూ వెళ్లిన సందర్భాలను పరిచయం చేశారు. తమ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన చరిత్రను యథాతథంగా దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైనప్పుడు రాని స్పందన, దానికి సాహిత్య విలువలను జోడిస్తూ ప్రచురించినపుడు వచ్చిన విషయాన్ని సందర్భోచితంగా వివరించారు. ఖమ్మం సమీపంలోని నాగులవంచ గ్రామ చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని, ఆ క్రమంలో తెలిసిన అనేకానేక విషయాలను శ్రీనివాస్‌ వివరించారు. ఆయన తన పీపీటీలోని తొలి రెండు స్లైడ్లలో ఉంచిన అంశాలను మననం చేసుకోవాల్సిందే. ‘‘భారతీయ సాహిత్యం ఒక నిథి. తరాలుగా మనిషి ప్రవర్తనపై తన ప్రభావం చూపుతోంది’ అంటూనే ‘కళ మరియు జీవితం’ అంటూ తన చేస్తున్న పనిని క్లుప్తంగా చెప్పకనే చెప్పాడని అనిపించింది. రాయలసీమ నుంచి వచ్చిన వేంపల్లి గంగాధర్‌ తాను రాస్తున్నప్పటికీ అవి చాలవని, ఇంకా రాయాల్సింది ఎంతో ఉందని నిజాయితీగా ఒప్పుకొన్నట్లే కనిపించింది. సీమలో చరిత్రను చాటిచెప్పే చారిత్రక స్థలాలు ఎలా ధ్వంసమవుతున్నాయో, అసాంఘిక కార్యకలాపాలకు ఎలా నిలయాలవుతున్నాయో చెపుతూ దీని గురించి కూడా రాయాలేమో? అంటూ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాడు. బహుశా ఈ దుస్థితి దేశవ్యాపితంగా ఉందేమోనని అనిపించింది. చరిత్ర పట్ల పెద్దగా ఆసక్తి లేని జాతికి అదొక సంపద అని చెప్పడం, ఆసక్తిని రేకెత్తించడం చిన్న పనేమీ కాదనీ తోచింది. కాలగమనంలో దేవుళ్లను మనిషి ఎలా మారుస్తాడో కళ్లకు కట్టాడు. కడప జిల్లా దానవులపాడులోని పార్శ్వనాథుని విగ్రహం, బిత్తల సామిగా మారిన ఉదంతం ఒక్కటి చాలు... మన దేశంలోని అనేకానేక చారిత్రక ప్రార్థనాలయాల్లో ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడానికి. చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగర సంస్థానం ప్రత్యేకతను వివరిస్తూ ఓ కంఠాహారాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చాడు. కనుక్కోండి చూద్దాం అంటూ ఊరించి మరు నిమిషంలోనే ఇది నిజాం నగ అని చెప్పాడు. సంబంధం ఏమిటా అని ఆలోచిస్తూంటే నిజాంకే వందల కోట్ల విలువ చేసే నగలు ఉంటే మరి శ్రీకృష్ణ దేవరాయులకు విలువైన నగలు ఎన్ని ఉండాలంటారు? అవన్నీ ఎక్కడ ఉన్నాయంటారు? అంటూ నవలకు సరిపడా ఓ ఉత్కంఠభరత ఊహను గదిలో వదిలి వెళ్లిపోయాడు.
భోజనశాలలోనూ మాటలు కొనసాగాయి. రోజూ విశ్రాంతి తీసుకొనే అలవాటు పీకుతున్నా... ఎవరికి వారు తమ గుంపును వెతుక్కొని చిన్న చిన్న పర్ణశాలల్లో కుదురుకున్నారు. సుమారు రెండు గంటలపాటు ఆసక్తికరమైన బృంద చర్చలు సాగాయి. చర్చోపచర్చల అనంతరం తలెత్తిన సందేహాలకు, అనుమానాలకు సాయి పాపినేని సమాధానమిచ్చారు. చరిత్ర వక్రీకరణకు గురవుతుందన్న భయంతో ఎక్కడా సాహితీ సృజన ఆగలేదని వివరించారు. విషయసేకరణ కష్టమూ, కొంత ఖర్చుతో కూడినదేనని అంగీకరిస్తూ అందుకు మనం సంసిద్ధులం కావల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కార్యశాల ప్రధానోద్దేశం... చారిత్రక నవలలు, కథలు రాయడానికి ముందుకు వచ్చిన రచయితలకు తగిన సూచనలు, సమాచారం అందించడమేనంటూ హామీ ఇచ్చారు.
ఆదిత్య కొర్రపాటి... 28 సంవత్సరాల యువకుడు దక్షిణ భారత దేశ భాషలన్నింటిలోనూ ప్రవేశాన్ని కలిగి ఉండడం, ఆయా భాషల్లో ప్రముఖుల పుస్తకాలను తడిమి ఉండడం... అప్పుడే చూసిన వాళ్లందరికీ అబ్బురమే. మలిరోజు తొలి మాటలు తనవే. రాత్రంతా, మెలుకువ నిండిన నిద్రతో పడిన తాపత్రయం కనిపించింది. ‘కాలం నిరవధికం... పృఽథ్వీ విపులం’ అన్న స్లైడ్‌తో తన మాటలను ఆరంభించాడు. చారిత్రక నవలను ప్రత్యేకంగా నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని చెపుతూనే చరిత్ర కథగా మారిన తీరును, అదే సమయంలో కథ చరిత్రగా రూపుతీసుకోవడాన్ని వివరించాడు. మహా, సూక్ష కథనాలు రెండు అవసరమే నంటూ నవలకున్న విస్తృతి ఉపయుక్తమని చెప్పాడు. నవలా క్రమంలో చారిత్రక సంభావ్యతని  ప్రతిఫలింప చేయాల్సిన అవరాన్ని నొక్కి చెప్పాడు. చరిత్రపట్ల విధేయత ఉంటే అత్యంత సహజంగా ఉండేలా స్వల్ప క్షణాలలో జారిపోయే వివరణలలో యుగ లక్షణాలని చెప్పగలగడం సాధ్యమేనంటూ వివరించాడు. కన్నడం, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో వచ్చిన విస్మరించలేని చారిత్రక నవలలను పరిచయం చేశాడు. 500 పేజీల నుంచి 2000 పేజీల వరకూ ఉన్న ఆ నవలల నిడివిని ప్రస్తావించినపుడు అసలు తెలుగు పాఠకుడు చదవుతాడా? అన్న సందేహం అక్కడున్న అందరి బుర్రల్లోనూ కదలాడింది. తమిళానికి చరిత్ర అన్నా, చరిత్రకు తమిళమన్నా అలవిమాలిన ప్రేమ అనీ, తమిళ సాహిత్యం గతాన్ని ఎప్పుడూ మరిచిపోదని చెప్పినపుడు మనమేం కోల్పోయామో అర్థమవుతూ వచ్చింది.
రెండు రోజుల పాటు కూర్చున్నా తరగని విశేషాంశాలున్నా కేవలం 10 నిమిషాల్లో ముగించండంటూ నిర్వాహకులు డీపీ అనురాధకు మైకు ఇచ్చారు. 5 నుంచి 11వ శతాబ్దం వరకూ మన తెలుగు నేల నుంచి వెళ్లిన వారు తూర్పు ఆసియా దేశాలన్నింటిలోనూ రాజ్యాలను స్థాపించారని, వాటికి తగిన ఆధారాలు ఆయా దేశాలలో మౌఖికంగానూ, చరిత్రలోనూ లభ్యమవుతున్నాయనీ ఆమె క్లుప్తంగా వివరించుకుంటూ సాగిపోయారు. దక్షిణ మయన్మార్‌లో 5-7 శతాబ్దాల మధ్య ‘మన్‌’ అనే రాజ్యాన్ని స్థాపించిన తెగ ఇప్పటికీ ఆ దేశంలో ఉందని చెప్పారు. మన్‌ తెగను ప్రత్యేకమైనదిగా ఆ దేశం గుర్తించిందన్నారు. ‘‘మన సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల పేర్లు ఒక్కలప్ప, సామల, మగాడు. ఆ పేర్లన్నీ మన తెలుగు పేర్లే. చివరి రాజు రాజనీతి శాసా్త్రన్ని రచించాడు. ఆ తెగలో ఇప్పటికీ మౌఖికంగా ఓ జోల పాట ప్రాచుర్యంలో ఉంది. ఆ పాట... ‘మన నేల తెలంగాణ. మన రాజుకు అదృష్టం బాలేక యుద్ధంలో ఓడిపోతే పడవల్లో ఎర్రరాళ్లు ఉన్న ఈ సువర్ణ భూమికి వచ్చాం’ అంటూ సాగుతుంది. వీరి గురించి బ్రిటీష్‌ చరిత్రకారులు రాస్తూ కృష్ణా, గోదావరి ముఖ ద్వారం నుంచి వచ్చారని పేర్కొన్నారు’’ అని వివరించారు. ‘‘వీటిని మన చరిత్రకారులో, ఆర్కియాలజిస్టులో శాస్త్రీయంగా పరిశోధనలు చేసి నిర్ధారించాలన్న ఆసక్తిని ప్రదర్శించకపోవడం నిజంగా దురదృష్టం. వీరి తరువాత రాజ్యాధికారాన్ని చేపట్టిన వారు తమ వారేనంటూ తమిళులు మాత్రం క్లెయిం చేసుకొంటున్నారు’’ అంటున్నపుడు ఆమె ముఖంలో విచారం లీలగా కదలాడింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు... మనం మేల్కొని మన ఖ్యాతిని చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఆశావహదృక్పథంతో మాట్లాడినపుడు... నిజమే పూనుకోవాల్సిన తరుణమిదే అనిపించింది.
రెండు రోజుల కార్యశాల చర్చలను ఒక కొలిక్కి తీసుకు వచ్చే బాధ్యతను తీసుకొన్న వాడ్రేవు చినవీరభద్రుడు... మన చరిత్ర ప్రధానంగా మౌఖికమేనని, చరిత్రను ప్రత్యేకించి రికార్డు చేయడం ఉండదనీ, రాస్తూ పోతే చరిత్ర అవుతుందని అన్నారు. అస్థిత్వాల కోసం పోరాటం జరుగతున్న వేళ సంఘర్షణ జరగాలని స్పష్టం చేశారు. చరిత్రకీ, సాహిత్యానికి మధ్య ఉన్న సున్నితమైన తేడాను ఆయన చిన్న ఉదాహరణతో హత్తుకొనేలా చెప్పారు. గురజాడ వారి కథ ‘మీ పేరేమిటి?’ని ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు. నేటికీ ఏ మాత్రం ప్రాధాన్యతను కోల్పోని రీతిలో ఉన్న ఆ కథాకథన గమనం మనకేమేమి విషయాలను చెపుతుందో క్లుప్తంగా వివరించారు. ‘‘తెలుగు వాళ్లు చాలా బద్దకస్తులు. వంట వండుకొనే తీరిక కూడా ఉండదు కాబట్టి ఆవకాయ పెట్టుకుంటారన్న మాట. వారికి నవల రాసేటంత శక్తి లేదు. ఈ తెలుగు వాళ్ళు మహాభారతాన్ని ఎలా అనువదించారో అస్సలు అర్థం కావడం లేదు. వందల పేజీల చారిత్రక నవలను తెలుగువాడు రాయడమనేది బహుశా ఓ వందేళ్ల తరువాత సాధ్యమేమో?’’ అంటూ ఒకింత రెచ్చగొట్టేందుకు నవ్వుతూనే ప్రయత్నించినా... అది నిజంగా తెలుగుసాహితీలోకం అవలోకనం చేసుకోవాల్సిన విషయమేనేమో?
కొండవీడు మ్యూజియం, కోట చూడడానికి బయలుదేరే ముందు సాయి చేసిన ప్రకటన అందరిలోనూ చిన్న కదలికను తెచ్చింది. ఏప్రిల్‌ 25 నాటికి హాజరైన వారంతా తలా ఒక కథ రాయాలని, జూలై నాటికి వాటికి ఒక రూపాన్ని ఇచ్చి పుస్తకంగా తీసుకు వస్తామని దృఢంగా చెప్పారు. ‘గుభేళ్లున’రాస్తే చాలు... కథ మీదే... దాని బరువు బాధ్యతలు మాత్రం మావి అంటూ ప్రకటించారు.
ఏదైనా రాయాల్సిందే అనుకుంటూ బయలుదేరిన సాహితీ బృందంలో సభ్యులు... పాపినేని శివశంకర్‌, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఈమని శివనాగిరెడ్డి, దీర్ఘాసి విజయభాస్కర్‌, బండి నారాయణ స్వామి, మహి బెజవాడ, కుమార్‌ కూనపరాజు, బీఏ శివప్రసాద్‌, అనురాధ, ఖదీర్‌ బాబు, అన్వర్‌, ఝాన్సీ పాపుదేశి, వేంపల్లి గంగాధర్‌, బీ సరోజినీ దేవి, బొడ్డేడ బలరామస్వామి, జీవీ శ్రీనివాస్‌, ముని సురేశ్‌ పిళ్ళై, బొల్లోజు బాబా, వెంకట్‌ శిద్ధారెడ్డి, మత్తి భానుమూర్తి, ఉమ నూతక్కి, దేవదానం రాజు, పూడూరి రాజిరెడ్డి, అనిల్‌ డ్యానీ, బీ ప్రసూన, చిత్తర్వు మధు, సూరాడ, వరప్రసాద్‌, హనీఫ్‌, పూర్ణిమా తమ్మిరెడ్డి, ఆదిత్య కొర్రపాటి, రాణి శివశంకర శర్మ, కట్టా శ్రీనివాస్‌, ఆకునూరు హసన్‌, అరవింద్‌ ఆర్య, దగ్గుమాటి పద్మాకర్‌, మనోహర్‌...

ఆంధ్రజ్యోతి వివిధలో...
ఫోటోల కోసం...

9, మార్చి 2020, సోమవారం

మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది

10వ తరగతితో చదువాపేసి ఉద్యమాల్లోకి దూకిన కుర్రాడు. చిన్నతనంలోనే జనం పాటలు రాసిన గేయ రచయిత. హోటల్‌ వర్కర్‌గా, సోడాలమ్ముకునేవాడిగా, రైల్వే గ్యాంగ్‌మెన్‌గా జీవితాన్ని చూసిన శ్రామికుడు. గేయ నృత్యకారుడిగా వందల ప్రదర్శనలు చేసిన కళాకారుడు. 10వ గ్రహాన్ని నాసా ప్రకటించడానికంటే 10 ఏళ్ల ముందే గోడలకెక్కించిన స్వయం ప్రకాశిత మేధావి. తెలుగుతోపాటు హిందీ, సంస్కృతం, పాళీ భాషల్లో పట్టు సంపాదించిన పండితుడు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, బౌద్ధాన్ని చదివిన వ్యక్తి. పాటలు, కథలు, పిల్లల సైన్సు పుస్తకాలు, తత్వశాస్త్రం, బౌద్ధంపై అనేక పుస్తకాలు రాసిన బహుజనుడు... బొర్రా గోవర్ధన్‌. మార్చి 15న 100వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయనతో ముఖాముఖి...
1) కుటుంబ నేపథ్యం గురించి చెపుతారా?
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బొర్రావారిపాలెంలో పుట్టాను. నాన్న కమ్యూనిస్టు సత్యం అని ఊరంతా పిలుచుకునే బొర్రా సత్యనారాయణ. అమ్మ అంజమ్మ. 1962లో పుట్టిన నేను తాతగారి ఊరు తోటపల్లిలో పెరిగాను. 5 వరకూ అక్కడే చదువు. కూచినపూడిలో 6, 7 తరగతులు. సోషల్‌ మాష్టారు విశ్వనాథం గారు తన కిష్టమైన బుద్ధుడు, జాషువా గురించి బుర్రకెక్కించారు. నాన్నేమో శ్రీశ్రీని వంటబట్టించాడు. 8 నుంచి 10 వరకూ నగరంలో సాగింది.
2) రచయితగా తొలి గుర్తింపు...
‘మ్రోగింది మ్రోగింది స్వాతంత్య్ర భేరి... విరిసింది విరిసింది విరజాజిమల్లి’ అంటూ 9వ తరగతిలో దేశభక్తి గీతం రాశాను. తెలుగు మాష్టారు శ్రీహరి శర్మ దానిని సరిచేశారు. నాటి హెచ్‌ఎం దాసరి పిచ్చయ్యగారు జాతీయ పండుగలకు స్కూలులో పాడించేవారు. ఆ ఉత్తేజం, ఉత్సాహం అలా కొనసాగాయి. 1977లో రేపల్లెలో ఇంటర్‌ చేరా. నవంబరులో వచ్చిన తుఫానుకు దివిసీమ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లాను. అక్కడితో చదువు ఆగిపోయి జీవితం ఉద్యమాల బాట పట్టింది.
3) ఉద్యమకారునిగా, రచయితగా ఏకకాలంలో సాగిందా మీ ప్రయాణం?అబ్బో అప్పటి కష్టాలు చెప్పాలంటే చాలా అవుతుంది. నగరంలో జనసాహితి రవిబాబుగారి పరిచయంతో కళారూపాలపై ఆకర్షణ మొదలైంది. నృత్యరూపకాలకు సారథ్యం వహించేవాడిని. అమెరికా, రష్యా సామ్రాజ్యవాదులపై రూపొందించిన పాములవాడు నృత్య రూపకం కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. ప్రజాసాహితి పత్రికలో క్రాంతికిరణ్‌ పేరుతో గీతాలు అచ్చయ్యేవి. మత్స్యకార జీవితాలపై రాసిన లాహిరి లాహిరిలో లంగరెత్తి కదిలింది అన్న పాట, తరిమెల నాగిరెడ్డి పుస్తకం తాకట్టులో భారతదేశం చదివిన తరువాత రాసిన ‘దోపిడి దోపిడి దోపిడీ... సులువుగా చేసే నిలువు దోపిడి’ పాట ఆ రోజుల్లో పాగా పాడేవాళ్లం. ఆ తరువాత గుంటూరు జనశక్తి కార్యాలయంలో ఉ సాంబశివరావు వద్ద ఉన్నా. ఆయన నాకు సాహిత్యగురువు. జిన్నాటవర్‌ సెంటర్‌లో రామచంద్ర విలాస్‌లో సప్లైయర్‌గా పనిచేస్తూ గుంటూరు జిల్లా హోటల్‌ వర్కర్స్‌ యూనియన్‌ని స్థాపించాం. అవసరాల రీత్యా అమరావతి సమీపంలోని మోతడక గ్రామానికి వెళ్లాను. అక్కడ తోపుడు బండిపై సోడాలు అమ్మాను. అక్కడి కష్టం జీవితాన్ని నేర్పింది. గుమ్మడిదల సుబ్బయ్య ఇంటిలో ఉన్నా. హిందూ, ముస్లిం గొడవలపై రాసిన ‘చితాగ్ని’ కొత్త గుర్తింపునిచ్చింది. ‘గుండెమంట’ పేరుతో మొదటి పాటల పుస్తకాన్ని జనసాహితి ప్రచురించింది. అక్కడ నుంచి బాపట్లకు రైల్వే గ్యాంగ్‌మెన్‌గా వెళ్లా. అక్కడే ‘పట్టి బిగించు... నట్టు పట్టి బిగించు’ పాట రాశాను. ఉద్యమమూ, రచనా కలగలిసే సాగాయి. నిర్మలానంద నాయకత్వంలో సన్నిశెట్టి రాజశేఖర్‌తో కలిసి పశ్చిమబెంగాల్‌, ఒడిస్సా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాం. ఊసా రాసిన ‘అమ్మా బయలెల్లినాదో... తల్లీ బయలెల్లినాదో’ పాటకు నృత్యరూపకంలో నాది ఇందిరాగాంధీ వేషం. 
 4) మధ్యలో హఠాత్తుగా శ్రీశ్రీతో మీ గాఢానుబంధం ఎలా?
ముందేచెప్పినట్లు నాన్న అంటించిన శ్రీశ్రీ మెల్లమెల్లగా నన్ను ఆక్రమించాడు. 1982లో ఆయనకు బాలేదని తెలిసి చెన్నై వెళ్లాను. ఆయనతో గడిపి వచ్చాను. నా అభ్యర్థన మేరకు సరోజగారితో కలిసి అదే ఏడాది నవంబరు 11న నగరం వచ్చారు. వారం రోజులు ఉన్నారు. ఆయన చెప్పిన సూచనే చరిత్రను, సంస్కృతాన్ని అధ్యయనం చేయమని.
5) కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్‌ని చదవడానికి పెద్దగా ఇష్టపడని రోజుల్లోనే మీరు అంబేద్కర్‌ రచనలు అధ్యయనం చేయడం, రాయడం...
నిజమే. నగరం వచ్చిన కొత్తలో రాహుల్‌సాంకృత్యాయన్‌ చదవడానికి సరోజక్క ఎలా కారణమయ్యారో 1985లో అంబేద్కర్‌ని చదవాల్సిన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి ఓపీడీఆర్‌ భాస్కరరావు. మరోసారి చదువులో కూరుకుపోయాను. అప్పటికి ఇంకా కారంచేడు ఘటన జరగలేదు. నేను రాసిన దానిని జనపథంలో ప్రచురించారు. బొర్రా గోవర్ధన్‌ పేరుతో ప్రచురితమైన తొలి వ్యాసమది. దళితబహుజనులు రాయగలరని ప్రపంచానికి చాడడం ముఖ్యమన్న వాదనతో నా అసలు పేరును పెట్టారు ఆయన. అంబేద్కర్‌ రాసిన బుద్ధుడు-ధర్మము పుస్తకం చదివిన తరువాతే బుద్ధుడిపై మరింత ఆసక్తి పెరిగింది.
6) కొంచెం గందరగోళంగానే ఉంది. ఇక్కడ నుంచి మరలా వేదాలు, ఉపనిషత్తుల్లోకి వెళ్లినట్లున్నారు?
అవును. 90ల్లో తాత్విక పండితులు నూతలపాటి రామ్మోహన్‌ గారితో పరిచయమైంది. ఆయన ప్రోద్భలంతో వేదాలు, ఉపనిషత్తులు, షడ్‌దర్శనాలు, పురాణాలు... ఆరు సంవత్సరాలు బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధం లేకుండా అధ్యయనంలో గడిచిపోయాయి. రుగ్వేదం, ఉపనిషత్తులు, దర్శనాలు ఆకర్షించాయి. ఆత్మ, పరమాత్మ, దేవుడు వంటి విభేదించే అంశాలునప్పటికీ భారతీయ తాత్వికతపట్ల అచంచలమైన ప్రేమను పెంచాయి. భౌతికవాదం అనగానే మనకు పాశ్చాత్య తత్వవేత్తలు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని పంచభూతాల పేరుతో ఉపనిషత్తుల్లో ఎప్పుడో పేర్కొన్నారు. మన గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కులమే కారణం. మనువాదం ఈదేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది. వేదాల్లో ఉన్నదీ, లేనిదీ వివరిస్తూ రాసిన పుస్తకం త్వరలో రాబోతోంది. గందరగోళమేమీ లేదు. వాటిని మార్క్సిజం, అంబేద్కరిజం చదవడం వలన బౌద్ధం మరింత తేలికగా బోధపడింది. కణాదుని వైశేషికం, కపిలుడి సాంఖ్యం, గౌతముని న్యాయదర్శనం, పతంజలి యోగదర్శనం... బౌద్ధంలో వాటికన్నా మెరుగ్గా కనిపించాయి.
7) బాగా గుర్తు... 1992 ప్రాంతాల్లోనే మీ స్కూలులో 10వ గ్రహం ‘ఆత్రేయ’ అని రాసి ఉండేది గోడలపైన..
అవును. నగరంలో ఊరి చివర ‘శాంతినికేతన్‌’ ఉండేది. 85లో స్కూల్‌ పెట్టిన తరువాత మూడేళ్లు కరెంటు లేదు. చికట్లోనే ఉండేవాళ్లం. రాత్రిళ్లు ఆరుబయట నక్షత్ర మండలాలను చూస్తూ గడిపేవాడిని. ఆక్రమంలోనే వాటి అధ్యయనం కూడా మొదలైంది. న్యూటన్ లాస్, కెప్లర్‌, బోడేస్‌ లా ప్రకారం మన సౌర కుటుంబంలోని గ్రహాల ద్రవ్యరాశిని బట్టి ఇంకో గ్రహం ఉండాలని లెక్కలేశాను. ఓ ఆర్టికల్‌ను రాసి సైన్స్‌ మ్యాగజైన్‌కు పంపాను. క్వాలిఫికేషన్‌ లేదంటూ వెనక్కు పంపారు. అప్పటికే నా స్కూలు గోడలపై భారీగా వేయించిన పెయింటింగుల్లోకి 10వ గ్రహం వచ్చి చేరింది. 2002లో అంటే పదేళ్ల తరువాత నాసా దీనిపై ప్రకటన చేసింది. ఆ రోజు దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలూ నన్ను ప్రస్తావించాయి. ‘ఆంధ్ర శాస్త్రవేత్తలు’ అన్న పుస్తకంలో ఖగోళ విభాగంలో నాకూ స్థానం కల్పించారు. గ్రంథాలయ ఉద్యమకర్త వెలగా వెంకటప్పయ్యగారు పరిచయం... ఆయన ప్రోద్భలంతో పిల్లల కోసం సైన్సు పుస్తకాలు 25, గణితంపై 20 పుస్తకాలు రాశాను. వాటిలో 13 పుస్తకాల సెట్‌ ‘గణిత బాలశిక్ష’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పేరం జయశీలరావుగారు ఇచ్చిన అవకాశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని బీసీ స్టడీ సర్కిల్స్‌లోనూ సివిల్స్‌ కోచింగ్‌ తీసుకొనే విద్యార్థులకు జాగ్రఫీ పాఠాలు చెప్పే వాడిని. 
8) బౌద్ధం, మార్క్సిజం, అంబేద్కరిజం... మూడూ వేర్వేరా? లేక ఏకరూపత కలిగిన మూడు వేర్వేరు మార్గాలా?
వేర్వేరని చాలా మంది భావన. కాని కాదు. ఒకే విషయాన్ని కేంద్రంగా చేసుకొని వేరువేరు దారుల్లో నడిచిన తాత్వికులు వీరు. ప్రపంచాన్ని తల్లిగా ప్రేమించిన వారు వీరు ముగ్గురూ. మార్క్స్‌ ప్రపంచాన్ని శ్రామిక, ఆర్థిక దోపిడీ, కార్మికవర్గం కోణంలో చూశారు. అంబేద్కర్‌ అంటరానితనం కోణంలో దేశాన్ని చూశాడు. ఈ రెండు సమస్యలతో పాటు మానవ సహజ స్వభావమైన ధార్మికకోణంలో నుంచి బుద్ధుడు ప్రపంచాన్ని విశ్లేషించారు. మార్క్సిజం, అంబేద్కరిజం.. బుద్ధిజంలో ఎలా భాగమో నా పుస్తకం వినయపీఠకంలో విశ్లేషించాను.
9) నేటి సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై
కులనిర్మూలన దిశగా అనేక ఉద్యమాలుసాగుతున్నాయి. కుల సంఘర్షణ ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ కులమే ప్రధానమన్న వాళ్ళంతా కులాల వ్యత్యాసమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘర్షణ సమయంలో కుల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ఏకైక మార్గం బౌద్ధమే. ఈ సంక్లిష్ట సమయంలో మార్క్సిజం, అంబేద్కరిజానికి బుద్ధిజం అవసరం. హేతువాద, నాస్తిక, మానవతావాద శక్తులన్నీ బౌద్ధం చెట్టునీడకు చేరాల్సిన సమయమిది.
10) మీ 100వ పుస్తకం గురించి...
ఆంజనేయరెడ్డి, వీరనారాయణ రెడ్డి. ఇద్దరూ ఐపీఎస్‌లే. వీరనారాయణరెడ్డి బౌద్ధ పండితుడు. తరిమెల నాగిరెడ్డిగారి తాకట్టులో భారతదేశం తొలిపాఠకుడు. ‘నక్సలిజం వ్యక్తిగత హింసావాదం కాదు. సామాజిక సమస్య’ అని చెప్పిన పోలీస్‌ ఉన్నతాధికారి ఆయన. బౌద్ధంలో నాకు గురువు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘బౌద్ధ దర్శనం’ను హిందీ నుంచి అనువాదం చేసినపుడు 8 సార్లు తిరగరాయించారు. ఆ తరువాత తిరిగి చూడలేదు. 35వ బౌద్ధ పుస్తకం... ‘బౌద్ధము - వైజ్ఞానిక మార్గం’ నా 100వ పుస్తకం.
11) కుటుంబం గురించి...భార్య శివపార్వతీ దేవి. పిల్లలు గౌతమి వైద్యురాలు. చిన్నమ్మాయి శ్రీశ్రీ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతోంది. నా రచనలు, అధ్యయనంలో 80 శాతం కృషి నిస్సందేహంగా ‘దేవి’దే. ప్రస్తుతం బుద్ధభూమి మాసపత్రిక ఎడిటర్‌గా ప్రతీ నెలా తీసుకురావడంపై దృష్టి పెట్టాను.

12) తెలుగు, సంస్కృతం, హిందీ, పాళి భాషల్లో పట్టు సంపాదించి మూల గ్రంథలను విస్తృతంగా అధ్యయనం చేసిన మీకు రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి కారణం...
పాలకవర్గ సంస్కృతిని ప్రచారం చేసే ప్రధాన మాధ్యమాలలో చోటు దక్కని మాట, గుర్తించని మాట వాస్తవమే. అది సహజం కూడా. ఎందుకంటే నేను వారికి భిన్నమైన ప్రజా సంస్కృతిని, ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రచారం చేస్తున్నాను. అయితే ఆమేరకు నాకు లభిస్తున్న పేరుప్రఖ్యాతులతో నేను సంతృప్తికరంగానే ఉన్నాను.