19, జులై 2016, మంగళవారం

మన్నించండి

ఓ నాలుగు ముక్కలు నా గురించి నేను మాట్లాడుకోవలసిన సందర్భమనిపించింది. ఓ పెద్దాయన నన్ను చాలా గౌరవంగా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలిచారు. నేను చాలా నిజాయితీగా వున్నానని ఆయన నమ్మినట్లే కనిపించారు. నాపై ఆయన చూపించిన అభిమానానికి నేను తగనని గాఢంగా భావించాను. మరో సారి నాలోకి నేను తొంగి చూసుకోవాలనుకున్నాను. ఎరుపుతగ్గి నలుపెంత పెరిగిందో చూసుకుని గుండె దిటవు చేసుకుని బతికే వుండాలని ముందుగానే గాఢంగా వాంఛిస్తున్నా. నా కోసమే నేను బతకాలనుకుంటున్నా. మృత్యువును హత్తుకునేటంత ధైర్యం బలుపెక్కలేదింకా. 
హిపోక్రసీ గురించి నేను రాసుకున్న రాతలు ఇంకా గుర్తే వున్నాయి. నాకు తోచిందేదో చెయ్యటమే తప్ప... తప్పుప్పొలు లెక్కలు పెద్దగా వేయని రోజులు నాకింకా జ్ఞాపకమున్నాయి. తక్కువ చేస్తారని తెలిసీ అనుకున్నదేదో ముఖాన్నే ఉమ్మేసిన క్షణాలూ పదిలమే. వచ్చిన మార్కులకు నాన్న పేరుచెప్పుకోకుండా సీటురాదని నమ్మి చచ్చినా నాన్న కాలేజీలో చేరనని భీష్మించుకున్న నాటి పిచ్చిదినాలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి. నడిరోడ్డుపై పులిహోర పొట్లాలను చూపించి బాంబులంటూ లాఠీ ఎత్తి అడ్డూఆపు లేకుండా గొడ్డును బాదినట్లు బాదుతూంటే చేతిలోని ఎర్రటి జెండా పడేయటమంటే మోకాళ్ళపై మోకరిల్లటమేనన్న పిచ్చి భ్రమతో తట్లు తేలిన ఒంటితో జైలుకెళ్ళిన అమాయకపు రోజులు ఎలా మరిచిపోతాను. 
ఇప్పుడు నేను అంత అమాయకంగా, పిచ్చిగా ఏమీ లేను. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. కడుపు పదిలంగా వుండాలన్న కాంక్షతో చూసినవి వదిలేస్తూ, చూడనవి రాసేస్తూ నిబ్బరంగా వున్నానంటూ రంకెలేస్తుంటాను. దేశాన్ని నేనొక్కడినే ఉద్ధరిస్తున్నానంటూ పనుల కోసం కందకుండా వెళ్ళగలిగే సౌకర్యాల కోసం వెంపర్లాడుతూంటాను. నా కోసమో... కాకుంటే కుటుంబం కోసమో... ఏడాదికొక్కసారి ప్రకటనలు వేస్తే వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూనే వుంటాను. వెయ్యనంటే ఉద్యోగం కూడా వుండదనే భయాన్ని ముందుకు నెడతాను. 
జీవితమంతా రెండే జతలతో గడిపేసిన మా మావయ్యలా నేనుండలేను. ఏడు పదుల వయస్సు దాటినా, శరీరం నడవటానికి కూడా సహకరించకపోయినా, మానస్సు పెడుతున్న పరుగును అందుకోవటానికి స్లీపర్ క్లాసులో దేశాన్ని ఇప్పటికీ చుడుతూనే వున్న నాన్నలా నేను సాగలేను. ఆరోగ్యం కోసం పైసా ఖర్చు చేయటానికి పదిసార్లు ఆలోచించే నాన్న తన పెన్షన్ లో సగంపైగా సొమ్మును నమ్మిన ఉద్యమావసరాలకే ఖర్చు చేస్తూ... తక్కువ చేస్తున్నానుకుంటూ నిత్యం పడే వేదన నా వల్ల కానే కాదు. అవసరమైతే మరో పది ఎక్కువ వస్తే బాగుండు అనే అనుకుంటాను. వీళ్ళివ్వరింతే అంటూ నిష్టూరమూ ఆడుతాను. సహచరులంతా ఏదో తేడాగున్నాడే అంటున్నా... మనం చేసే పనికి ఈ జీతమే ఎక్కువ అంటూ ఉలిపికట్టెలా నాన్న అన్న రోజులు మొన్నన్నే అన్నట్లే వున్నాయి. నేను అలా ఎలా వుండగలను. 
అందుకునే అంటున్నా. నేనేమీ నిజాయితీగా లేను. వుండాలనీ అనుకోవటం లేదు. వుండటం సాధ్యం అన్న భ్రమల్లోనూ బతకటం లేదు. అందుకే నేను మాట్లాడటం మానేశాను. మాట్లాడేటప్పుడు తరిచిచూసుకుంటున్నాను. మరోసారి చెపుతున్నా... మీ అభిమానానికి నేను పాత్రుడిని కాలేను. మన్నించండి. 

15, జులై 2016, శుక్రవారం

ఎండమావులే ఒయాసిస్సులు

మనిషి ఎంత ఆశాజీవి. ఎడారిలో ఎండమావిని చూసీ ఒయాసిస్సు అన్న భ్రమతో పరుగులు పెడతాడు. ఆశ నిరాశ కాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటాడు. ఇప్పుడు విశాఖ వాసీ చేస్తున్నదదే. పోలీస్ యంత్రాంగం కూసాలను కుదుపుతున్న వరుస ఘటనలు నిజం కావాలని, స్మార్ట్ సిటీ నిజార్థంలో వెలుగొందాలనీ గాఢంగా ఆకాంక్షిస్తు న్నాడు. ఇది ఖాకీలకే పరిమితం కాకూడదనీ ఆశిస్తున్నాడు. 
అధికారులు వస్తూంటారు. పోతూంటారు. మొన్నామధ్య ఓ దళిత ప్రజాప్రతినిథి అన్నట్లు ''రాజకీయ నాయకుల విజన్ ను ఆధారం చేసుకుని, నిర్దేశించిన మార్గాన్ని అనుసరించి అధికారులు నడుచుకుంటారు.'' అవును వారు స్వయంప్రతిపత్తితో చేసేది పెద్దగా ఏమీ వుండకపోవచ్చు. తప్పొప్పులకు అధికారులనే పూర్తిగా బాధ్యులను చేయ లేము. వారిని నడిపించాల్సిన రాజకీయ నాయకత్వపు అసమర్థ ధోరణలను దునుమాడటమే మంచిదన్నదీ ఆయన అభిప్రాయం కాకపోవచ్చు. కాని జరగాల్సింది అదేనేమో. ఎంతో మంది పోలీస్, రెవిన్యూ బాస్ ల ఏలుబడిని విశాఖ చూసింది, భరించింది. పరిస్థితులకు అనుగుణంగా కర్రతిప్పుతూ, ప్రజల నమ్మకాన్ని ప్రోది చేసుకున్న అధికారులను మాత్రం ఇప్పుడూ స్మరిస్తూనే వుంది. అధికారం మారినప్పుడల్లా రాజకీయం తన స్వలాభాపేక్షకు అనుగుణంగా అధికారం నడుచుకోవాలనుకుంటుంది. అలా నడుచుకోకపోతే తన సార్వభౌమాధికార ప్రకటనకు భంగంవాటిల్లినట్లేనని భ్రమిస్తుంది. కట్టను తెగ్గొట్టుకున్న వరద గోదారిలా ఆగ్రహం ఏడమ కాలు విదుల్చుతుంది. ఏ అప్రాధ్యాన్య పోస్టుకో బదిలీ బహుమానంగా వస్తుంది. అర్థం కానంత అమాయకుడు అధికారెలా అవుతాడు! రాజకీయం, అధికారం... సమాంతరంగా సాగుతూనే సహకరించుకోవాల్సిన రెండు వ్యవస్థలు. స్వరం మారింది. అధికారంపై స్వారీ చేయటానికి రాజకీయం. అంగీకరించాల్సిందే మరి. అలవాటుపడిపోయాం. అందుకే కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు ఇక్కడ చెల్లుబాటు అవుతాయి. లెక్కల్లో తకరారు... వాస్తవాలను జిలుగుల మాటున కప్పేస్తుంది. నిజాన్ని చూడాలనుకునే పాలకులను తాత్కాలికంగానైనా మభ్యపెట్టేస్తుంది.
పోలీస్ బాస్ గా కొత్తాయన వస్తున్నాడన్న వార్త కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరొస్తారో అనుకు న్నారు. యోగానంద్ అన్న ప్రకటన రాగానే ఖాకీల్లో కొందరు ఉలిక్కిపడ్డారు. మరికొందరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు కోవాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు ఇక్కడ నుంచి పారిపోతే బెటర్ అనుకుని అలవాటైన పైరవీలకు దిగారు. స్వానుభవంలోకి వచ్చే వరకూ జరుగుతున్నదేమిటో అర్థమయ్యిందని ప్రకటించటానికి అంగీకరించలేని జనం ఎప్పటిలా నిశ్శబ్ధంగానే వుండిపోయారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకుని పూర్తిగా రెండు నెలలు కూడా కాలేదు. బాధ్యతారాహిత్యానికి అంతో ఇంతో శిక్షలు వుంటాయన్న సత్యాన్ని ఇప్పుడిప్పుడే విశాఖ పోలీసులు అర్థం చేసుకుంటున్నారు. కొందరు సస్పెన్షన్ తో ఇంటివైపు వెళితే... మరికొందరు విఆర్ పేరుతో బెంచ్ ఎక్కారు. ధ్వజస్థంభాల్లా పాతుకుపోయిన వారు, మాకు స్థాన చలనం వుండదని భ్రమిసిన వారూ ఇప్పుడు సరికొత్తగా అడవి దారులను వెతుక్కుంటున్నారు. సిపి ఇంకా దస్త్రాలను తిరగేస్తూనే వున్నారు. అస్త్రాలకు పదును పెడుతున్నారు. విశాఖ వాసుల ఆశలకు రెక్కలొచ్చాయి. ఆకాంక్షలు ప్రబలమవుతున్నాయి. నైరాశ్యంలోకి జారిపోకుండా వుండటం సాధ్యమేనా? అన్న అనుమానాలూ మరో పక్క తొంగిచూస్తూనే వున్నాయి. అర్థిక నేరగాళ్ళన్న ఆరోపణలు ఎదు ర్కొంటున్న వారితో అంటకాగుతున్న ఖాకీ నేత్రాలున్నాయి. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన మినీ బాసులున్నారు. ఆకలేసినప్పుడల్లా తమ పిల్లల్ని తామే తినేసే పాములున్నాయి. ఇప్పుడు వాటిని పట్టుకుంటారా? పట్టుకుని బోనెక్కిస్తారా? ప్రక్షాళన సాధ్యమేనా? మార్పులన్నీ పైపై మెరుగులా? రాజకీయం రంగంటకుండా ఖాకీ దుస్తులను కాపాడుకోవటం సాధ్యమేనా? సవాలక్ష సందేహాలు తొలిచేస్తూంటాయి కుమ్మరి పురుగులా.
వాతావరణం మారుతోంది. వానలొస్తున్నాయి. నిన్నటి వరకూ చంపేసిన ఎండ కొద్దిరోజులు మబ్బుల మాటుకు సాగిపోతుంది. వెన్నంటే అడివిని మలేరియా కాటేస్తుంది. నగరాన్ని డయేరియా వంటి అంటు వ్యాధులో, వైరల్ జ్వరాలో వెన్నాడుతాయి. చక్రంలా ఇది తిరుగుతూనే వుంటుంది. అందరికీ అర్థమవుతుంది. కాపాడాల్సిన చేతులు బద్ధకంగా కదులుతుంటాయి. ముందస్తు చర్యలు కోసం వడివడిగా అడుగులేయాల్సిన పాదాలు కందిపోతాయే మోనన్న ఆలోచనతో అడుగెనక్కు వేస్తుంది. సమీక్షలతో ఏసీ గదులకే పరిమితమవుతుంది. మరణాలు అడవిని దాటి నగరం బాట పడతాయి. గుట్టల్లోని చావులు కొండదిగి కేకపెట్టేసరికి ఆలస్యమవుతుంది. సాంధ్రత తగ్గుతుంది. కదలాల్సిన వాళ్ళు అప్పటికైనా కదిలితేనా? ఈ సారి మృత్యువు నగరం శివారుల్లో నృత్యం చేస్తుంది. నాలుగురోజుల్లో నలుగురు మరణశయ్యపైకి చేరుకుంటారు. అత్యాధునిక చరవాణి చేతిలో వున్న తరువాత అమెరికాలో వున్నా, విశాఖలో వున్నా... తేడా వుండదు. మంత్రి వర్యులు స్పందిస్తారు. పాత్రికేయుల సెల్లుల్లోకి సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తుతాయి. అవే పత్రికల్లో అక్షరాలై పేలుతాయి... టీవీల్లో స్క్రోలింగులై దొర్లుతాయి. అప్పటి వరకూ బయటకు రాకుండా దాచిపెట్టామని సంబరపడుతున్న అధికారం ఉలిక్కిపడుతుంది. ఈలోగా స్వయంగా వైద్యుడైన శాఖా మాత్యులు మరో సందేశమై కనిపిస్తారు. మళ్ళీ సమీక్ష కోసం శీతల యంత్రం శబ్ధం చేస్తుంది. బిళ్ళ బంట్రోతు అల్పాహారాన్ని సిద్ధం చేస్తాడు. యాక్షనేదంటూ ప్రతిపక్షాలూ, ప్రజాసంఘాలూ గొంతెత్తుతాయి. కౌంటరేయకపోతే ఎట్టా అనుకుంటుందో ఏమో అధికారపక్షం బురదేస్తున్నారంటూ దాడికి దిగుతుంది. బాధను పక్కనపెట్టి బాధితులు, బంధువర్గం అలవాటైనా తమాషాని విషాదంగా చూస్తూ వుండిపోతుంది. 
మరో వైపు ప్రభుత్వం ఎన్ని కంప్యూటర్లు పెట్టినా, సరికొత్త యాప్ లను సెల్ ఫోనుల్లోకి అదే యావతో ఎక్కించేస్తున్నా... మీట నొక్కాల్సిన మనిషి మాత్రం మారకుండా మిగిలే పోతాడు. ఒకరి భూమిపై మరొకరు హక్కు నాదంటూ పోట్లాటకు దిగుతాడు. అధికారం పెద్ద మనిషి పంచాయితీ చేస్తుంది. అందినకాడికి బొక్కేస్తుంది. అడగాలంటే భయం అడ్డుపడుతుంది. భవిష్యత్తులో గుమ్మం ఎక్కటానికి చోటు దొరకదేమోనని సంకోచిస్తుంది. సల్లగా చూస్తాడేమో అని చంద్రంవైపు సంద్రమంత ఆశగా చూస్తోంది వైశాఖి. అసౌకర్యాల లేమితో సాగే సౌఖ్య జీవనమే స్మార్ట్ లక్ష్యమన్న ప్రకటను నిజార్థంలో అనుభవంలోకి తీసుకువచ్చే మరో అధికారిని కూడా వేస్తారేమోనని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. సముద్రపొడ్డున ఆశ చిరుజ్యోతిలా వెలుగుతోంది... లక్షలాది చేతుల రక్షణ మధ్య. 

సర్వ బ్రష్టత్వం

కొత్తగా బాధపడాల్సిందేమీ లేదు. ఎప్పటి నుంచో వున్నదే. రాజుల కాలం నుంచీ డబ్బాశ చేస్తున్న పాడు పని అంతా ఇంతా కాదు. హెచ్చు తగ్గులు సర్వసాధారణం. మరీ విశృంఖలమై పోయిందనప్పుడు ఒకింత బాధేస్తుంది. మళ్ళీ మామూలే. అవినీతి రహిత, పారదర్శక కమల పాలన గురించి మాట్లాడుకుంటున్న కాలంలో వున్నాం కాబట్టి ఇప్పుడు తాజాగా మాట్లాడవలసి వస్తోంది అంతే. 
చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పదువులు తీసుకున్న వారి నుంచి అంతో ఇంతో నిబద్ధతను, నిజాయితీని సమాజం ఆశిస్తూంటుంది. తాను కుళ్ళు కంపు కొడుతున్నా... వారు మాత్రం సెంటు వాసనేస్తూండాలని అనుకుంటూంటుంది. మా వాడు సిఐ అయ్యాడనో, ఐపిఎస్ అయ్యాడనో, ఏకంగా హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యాడనో సంబరాలు చేసుకునే విభజిత సామాజిక సమూహాలే ఐకాన్ లుగా చలామణీ అవుతున్న కాలంలో వున్నాం. పేదరికం ఎక్కడున్నా పోవాలంటూ చేసే నినాదం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది. నా కులంలో పేదల గురించి పట్టించుకోండి, నా కులంలో అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయండి అంటూ చేసే పోరాటాలు... స్కిన్ టైట్స్ లా లేటెస్ట్ ఫ్యాషన్. ఇంతా ఎందుకు... ఇప్పుడు ఏ కులానికి ఏమయ్యింది? ఎవరికి నొప్పి కలిగింది? అనేగా మీ ప్రశ్న. అక్కడే వచ్చేస్తున్నా. మొన్నటికి మొన్న విశాఖలో ఓ సిఐ... మైనారిటీకి చెందిన అధికారి, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి వున్నాడంటూ ఎసిబి గాండ్రించింది. కోట్లాది రూపాయలు కూడగట్టిన అతని తీరును చూసి నగరం ముక్కన వేలేసుకుందని అమాయకులు చాలా మందే అనుకున్నారు. పెద్ద వార్తేసి ఘనంగా బాధ్యతను నెరవేర్చే శామంటూ పాత్రికేయులు సంకలు గుద్దేసుకున్నారు. గురువింద గింజకు తన నలుపు ఎప్పటికి కనపడేనూ?. ఆ విషయం పాతపడక ముందే మరో సిఐ ఎసిబి ఖాతాలోకి చేరిపోయాడు. ఈ సారి ఓ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. వీరిద్దరికీ ముందు అవినీతి తిమింగలం అంటూ చిక్కిన మరో అధికారి కూడా ఎస్సీనే కావటం యాధృచ్ఛికమే కావ చ్చు. అవినీతి తిమింగలాలు అన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలోనే వుంటున్నాయన్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఆయా సామాజిక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. వివిధ శాఖలలో స్వంత పనులు చూసుకుంటూ, కోట్లలో వ్యాపారాలు చేస్తూ గుడిగుడి గుంజం గుళ్ళో రాగంలా ఇక్కడిక్కడే తిరగుతున్న ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన అధికారులు ఎసిబికి ఆనకపోవటం విచిత్రంగా వుందంటూ చేస్తున్న వాదన నిండు సత్యమే. నగరంలో ఓ పోలీస్ అధికారి లూప్ లైనులో వుండగానే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మెయిన్ లైనులోకి వచ్చి అమాయకపు తొడుగేసుకుని స్పీడు పెంచారని ఎవ్వరినడిగా చెప్పకనే చెపుతారు. ఇక రెవెన్యూ, ఆ శాఖ, ఈ శాఖలల్లో అయితే పదుల సంఖ్యలో ఆ పేర్లను గడగడా చదివేయచ్చు. పోస్టింగ్ ల కోసం కోట్లు ఇస్తున్నారన్న వాదనలు సరేసరి. ఇది వితండమనే వారూ వున్నారు. మా కులం, మా మతం అంటూ రాగాలు తీసే వారికి... అవినీతికి కులం వుండదనీ, డబ్బు వచ్చి చేరిన తరువాత... వున్నాడు, లేనోడు అన్నది మాత్రమే నిజమనీ అర్థమయ్యేదెన్నడో?! అంటూ వాపోయే వారు ఓ ఉదాహరణను గట్టిగానే చెపుతున్నారు. ఆ మధ్య నగరానికే చెందిన ఓ పోలీస్ అధికారి పెద్ద పంచాయతీకి పెద్దమనిషిగా వ్యవహరించారు. ఓ పక్షం తీసుకుని యాక్షన్ లోకి దిగినందుకుగాను సదరు అధికారికి కోట్లలోనే ముట్టాయని ఆ శాఖతో పాటు, నగరంలోనూ బహిరంగం గానే మాట్లాడుకున్నారు. ఇప్పుడు చెప్పండి. 
రెండేళ్ళుగా పాత్రికేయుల చుట్టూ తిరుగుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ మధ్యనే హార్డ్ వేర్ అవతారమెత్తి కనిపిస్తే ఆశ్చర్యమనిపించింది. ఎందుకిలా అయ్యాడా అని చూస్తే బోలెడు కథ బయటకు వచ్చింది. అవన్నీ చెప్పేస్తే ఇంకే మైనా వుందా? నాకూ బోలెడన్ని ఆఫర్లు వచ్చేయవూ?!. అయినా, ఉడికిందో లేదో తెలియటానికి ఒక్క మెతుకు చాలదండీ అంటూ చెప్పే పాత చింతకాయ పచ్చడి లాంటి సామెతొకటి వుండనే వుందిగా. కథలోకి వస్తే... ఓ విదేశీ యుడు దర్జాగా ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా విశాఖలో వ్యాపారం చేసుకుంటూ కోట్లు పోగేసుకుని హద్దులు దాటించేస్తున్నాడు. పనిలోపనిగా మన సాఫ్ట్ వేర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఓ ముప్పై లక్షలకు ముంచేశాడు. దీనితో గత్యంతరం లేక సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు అమాయకంగా. స్టేషన్ నుంచి కమిషనర్ కార్యాలయం వరకూ పాపం సుబ్రహ్మణ్యం... కలవని అధికారి లేడు. ఈ లోగా కోర్టుల్లో కేసులు వేశాడు. అనుమతు లు లేకుండా దర్జాగా ఊళ్ళో ఊరేగుతున్న తెల్లతోలు గురించి ఐబికి సమాచారం ఇచ్చాడు. సిబిఐతో మాట్లాడాడు. ఇలా ఎక్కే గడపా, దిగేగడపా. ఇప్పటికీ ఫలితం శూన్యమే. అవసరమైన సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ ఆర్టిఐ కమిషనర్ ఆశ్రయించాడు. సంబంధిత అధికారులకు అపారధ రుసుం చెల్లించాలంటూ తీర్పు వచ్చినా... బేఖాతర్. ఈలోగా తెల్లతోలుపై యాక్షన్ తీసుకోక తప్పని స్థితిలో పోలీసులు ఆయనను దేశరాజధానికి తీసుకువెళ్ళి విమాన మెక్కించి సాగనంపారు. అలా వెళ్ళి ఇలా వచ్చేసిన సదరు తెల్లదొర ఇప్పుడు రెండు పాసుపోర్టులతో, రెండు పాన్ కార్డులతో దేశంలో చలామణీ అవుతున్నారని వినికిడి. అయితేనేం... మూడో ఏడాది వస్తున్నా ఏ వ్యవస్థా స్పందించ ని తీరును చూసిన సదరు సాఫ్టవేర్ సుబ్రహ్మణ్యం... రాటుదేలిపోయాడు. ఎక్కడ ఏ కోర్టులో ఎవరి ముందు ఎలాంటి న్యాయం వస్తుందో తెలిసిపోయిందంటూ చెపుతూంటే నోరు తెరుచుకుని ఆ పాత సత్యాన్ని సరికొత్తగా వింటూం డిపోవాల్సిందే. ఇక్కడ నేరుగా ఎక్కడా నోట్లు కనిపించవు. ఎవరు ఎవరిని అజమాయిషీ చేస్తున్నారో అర్థం కాదు. అర్థమైన ఆ ఒక్క సత్యమూ ఏ చట్టం ముందూ నిలవదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. ఒకరి అవినీతిని మరొకరు నిస్సిగ్గుగా బయటేసుకుంటూ వుంటారు. తినగ తినగ వేమ తియ్య నుండు. ఇన్నేళ్ళు విన్న తరువాత అంతోకొంతో మనకూ అబ్బకుండా ఎలా పోతుంది? మురుగు నదీ మురికి కూపంలో నగరం వుంది. ఎన్నిసెంట్లు కొట్టినా, తలుపులు బిడాయించి ఏసీలు వేసుకుని బతికేద్దామనుకన్నా... అసాధ్యం బ్రదర్. బతుకు ఒకింత దుర్భరమే. బతికేయ్, అవసరం నీదైతే సొమ్ములు పడేయ్... అదే అవసరం ఎదుటోడిదైతే నోట్లు నొక్కేయ్. యుగధర్మాన్ని పాటించాల్సిందే. పాలకులు చెప్పేదీ అదే మరి. 

మరణం... నోటు... రాజకీయం


ఓ ఆత్మహత్య అధికారుల్లో కలవరానికి, ఆత్మశోధనకు కారణమయ్యింది. ఓ ప్రమాదం అడవికి పాకిన మైదాన సంస్కృతిని ప్రతిబింబించింది. ఓ మాట రెండు రైలు పట్టాల మధ్య మిత్రత్వాన్ని చాటింది.

తమిళనాడులో ఓ రైతు కుంటుంబంలో జన్మించాడు. కష్టనష్టాలు ఎరిగిన కుటుంబమే. అందకనేనేమో ఇష్టపడి చదువుకున్నాడు. ప్రఖ్యాత అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజ నీరింగ్ చదివిన శశికుమార్ ఐపిఎస్ కు 2012లో ఎంపికయ్యారు. క్షణం కూడా ఊపిరాడని, కఠిన పరీక్షలతో కూడిన శిక్షణను పూర్తి చేసుకుని ఆయన రాటుదేలారు. గ్రేహౌండ్స్ లోనూ, ఆళ్ళగడ్డలోనూ పనిచేసి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆరు నెలల క్రితం విశాఖ ఏజెన్సీకి బదిలీపై ఎఎస్పీగా వచ్చారు. చేయటానికి నేరుగా కనిపించని పని. మనిషి రాటుదేలినా, మనసింకా సుతిమెత్తగానే వుంది. అధివాస్తవిక ప్రపంచంలో గూడు కట్టుకున్నాడు. అందుకేనేమో అతి తక్కువగానే మాట్లాడతాడు. ప్రతీదీ నిబంధనల ప్రకారమే జరగాలంటూ మౌనంగానే గందరగోళపడతాడు. ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ హామీని ఇచ్చే సున్నిత మనస్తత్వం. అందుకేనేమో పలచబడ్డాడు. తన ఖాకీలు చేస్తున్న తప్పులకు సామాన్యులు బలికావటాన్ని సహించలేని మంచితనం. అది చేతకానితనమని చిత్రించే అధికారయంత్రంగం అణువణువునా వున్న ప్రపంచం ఇది. ఇక్కడ తన స్థానమేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఎంత సంఘర్షణ. మూడు నెలల ప్రసవవేదన. రివాల్వర్ గొట్టాన్ని కణతలకు అనించుకుని దూసుకుపోయే తూటా ఏం చేస్తుందో తెలిసే... ట్రిగ్గర్ నొక్కటానికి ఎంత ధైర్యం కావాలి! దానిలో పాతిక శాతం ధైర్యం సరిపోదా బతకటానికి? సమాజంలో చట్టవ్యతిరేకుల పట్ల కఠినంగా వ్యవహరించటం ఎట్లాగో తెలిసిన మడిసతడు. చట్టరక్షకులే భక్షకులైతే ఏం చేయాలో తోచక తికమకపడ్డాడు. ఇక్కడ ఇమడ లేక, ఇమడలేని తనాన్ని ప్రపంచానికి చాటలేక, మంచితనానికి ఖాకీవనంలో చోటు లేదంటూ మరో ప్రపంచానికి వలసెళ్ళిపోయాడు. 
మానవత్వం గుభాళించే మంచి అధికారులు అవస రమైన సంక్షిష్ట సమయంలో ఇలా కోల్పోవటం నిజంగా బాధాకరం అంటూ ఓ సీనియర్ అధికారి ఒకింత నిజా యీతీగానే తడికళ్ళతో వ్యాఖ్యానించారు. విలువల వలు వలు విడిచి నిస్సిగ్గుగా నిలబడిన వ్యవస్థను చూడ టాని కి మనసులకు అసితకేశకంబళ్ళ ముసుగేయాలి. లేద నేగా చంపేశారు. వ్యవస్థ చేసిన హత్య ఇది అని ఒప్పు కునే ధైర్యం లేనందుకేకా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ వీరుడిపై పిరికి ముద్రవేశారు. వీరమరణాల నుంచి పాఠాలు నేర్చుకునే సంస్కారాన్ని మీరు తృణీకరిస్తే... ఎప్పుడోకప్పుడు ఈ సమాజమే మిమ్మల్ని త్యజిస్తుంది.
నిత్యం ఎంతో మంది అడవిబాట పడతారు. కొందరు జీవనం కోసం, మరికొందరు కాంక్రీటు వనంలో కోల్పోయి న జీవితాన్ని వెతుక్కుంటూ. కొండమీద వుండే వాడు ఎప్పుడన్నా కిందకు దిగినా, అరక్షణం కూడా ఇమడలేని తనంతో నిలబడని కాళ్లేసుకుని వెనక్కి పరుగులెడ తాడు. ఏమీ తెలియని పసోళ్ళకు కూడా అన్నీ నేర్పించే బుల్లి రంగు పెట్టెలు ప్రపంచమంతా ఒత్తుగా పరిచేసు కుంటున్నాయి. 
కొండెక్కుతాయి, చెట్టుక్కుతాయి. గడపగడపకూ నేను న్నానంటూ రేయింబవళ్ళూ అరిచి గోలెడుతుంటాయి. మనకు తెలియని, అవసరం లేని సరికొత్త విషాలను మన ప్రమేయమే లేకుండా చొప్పించేస్తుంటాయి. తెలుసుకునే సరికి మనం మనంగా మిగలం. అమాయకత్వం అన్న మాటకు అర్థం మారిపోతుంది. వెనకబాటుతనంపై యుద్ధం, హక్కుల కోసం పోరాటం మాటున అరాచకీయం సంఘ టితమవుతుంది. చేయి చేయి కలపాలంటూ పాఠాలు చెప్పిన జెండాల మాటకు విలువే లేకుండా పోతుంది. అసలు జెండా అవసరమే లేని రోజుల్లోకి ప్రయాణం సాగుతుంది. రోడ్డుపై రెండు వాహనాలు యుద్ధం చేస్తాయి. రెప్పపాటులో జరిగే విధ్వంసంతో నిత్యం ఎన్నో కుటుంబాల్లోకి విషాదం కాపురానికొస్తుంది. ఎవ్వరూ ఆర్చలేరు, తీర్చలేరు. తోడులేని తనాన్ని పూడ్చనూలేరు. నిన్నటి కథ ఇది. ఇప్పుడు ప్రతీ దానికీ రేటుంది. దెబ్బ సైజును బట్టి రేటు ఫిక్సవుతుంది. వేలు నుంచి లక్షల్లో బేరం సాగుతుంది. ఖాకీల సాక్షిగా గాంధీగారు చేతులు మారతారు. తప్పె వరిదన్న మాటకు ఇక్కడ ఆస్కారమేలేదు. సెక్షన్లు వేసే శిక్షల ప్రశ్నే రాదు. కాదన్నారా మీకు కొండపై బతుకే లేకుం డా చేస్తా మంటూ చుట్టేస్తారు. ఖాకీ అయినా, కలమైనా కన్నెత్తకుండా, పెదవి కదపకుండా ఎటెన్షన్ పొజిషన్ లో శిలలవ్వాల్సిందే. కదిలారా... కొండపైనోళ్ళతో పెట్టుకుంటే మసిచేసేస్తాం అంటూ హూంకరిస్తారు. ఇప్పుడే ఆలోచి స్తున్నారు. కొండెందుకెక్కాలి? కష్టాలెందుకు కొనితెచ్చుకోవాలి? కాపాడటానికి ఖాకీలున్నా లేనట్లే సాగేచోట అడు గెందుకెట్టాలి? ఇలాగే సాగితే రాకడలకోసం అరకు అల్లార్చుకుపోతుందన్న భయం ఇప్పుడు వాగవుతోంది. 


 అస్సలు సంబంధమేలేదు. ఇసుమంత పోలికైనా కనిపించదు. అయితేనేం చిక్కనైన అధికారాన్ని చి క్కించుకోవటానికి మిత్రబంధంతో ముడేసుకున్నారు. కలవని మనస్సులతో కలతల సంసారం. నిత్యం సాగు తూనే వుంది. స్టేజీ ఎక్కిన ప్రతీసారీ రంగేసుకునే కనిపిస్తారు. ఇదే నిజం అన్నంత సహజంగా జీవించేస్తారు. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదన్నట్లు ప్రదర్శన సాగుతుంది. రాతలకు పాతబడి, మాటలకు అవకాశమే లేకుండా పోయిందని తట్టినప్పుడల్లా ముసుగులోంచి తొంగిచూస్తారు. మనస్సులో మాటలు, కపటంలేనట్లే కనిపిస్తా యి. సమాజమే దేవాలయం, దేవుడి సేవలో తరించటానికి మంచి మనుషులు కావాలి. ఎత్తుకెదగాలన్నా, ప్రపం చంలో మనకంటూ ఓ గుర్తింపు వుండాలన్నా... మీది కాని భాషలో మీరు పండితులై ఉండాలి. అద్దెకు తెచ్చుకున్న దుస్తులతో పరాయి సంస్కృతిని నెత్తినెట్టుకోవాలి. మనకంటే ముందున్న జపానోడు, చైనావోడు, జర్మనోడు... చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. ఆళ్ళవ్వరికీ అవసరమేలేని పరాయీకరణ. అవసరం కోసం మన కాడకొచ్చిన వాళ్ళని మెప్పించాలనుకునేటంత బానిసత్వం. అలాంటి వారికే మేయర్ పదవి కట్టబెట్టడానికి వెతు కున్నామంటూ ఘనత వహించిన విద్యాశాఖ మంత్రిగారు ప్రకటిస్తారు. ప్రజలతో సంబంధమేలేని, మమేకం కావటం అంటే అర్థమే తెలియని, ప్రజావసరాల రుచి తెలియని, రాజకీయం రంగే చూడని, డూడూ బసవన్నలే ఇప్పుడు కావాలన్న నిగూడార్థంలో వెలువడిన ప్రకటన ఓ ప్రకంపనే. దీనితో కమలం ఖంగుతిన్నది. ఇప్పటికే ఉప్పు, నిప్పుగా సాగుతున్న సంసారం మరోసారి వీథికెక్కింది. హుటాహుటిన సమావేశమయ్యింది. ఎలాంటి సంప్రదింపులు లేకుం డా ఏకపక్షంగా ఇలా ఎలా ప్రకటించేస్తారంటూ మండిపడింది. మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారంటూ కోప దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ప్రపంచమంతా మోదీ మంత్రాన్ని జపిస్తూ యోగాసనాలు వేస్తే, విశాఖలో మాత్రం ప్రధాని చిత్రానికి చోటే దక్కలేదని ఇప్పటికే కమలం కళ్ళెర్ర చేస్తోంది. ఫిర్యాదు చేయటానకి వెళితే కలెక్టర్ కూడా ఆ ఏముందిలే అన్నట్లు తేలికగా మాట్లాడటాన్ని కషాయధారులు జీర్ణం చేసుకోలేక పోతున్నారు. నాటకం రక్తికడు తోంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల నాటకం చివరంకంలో చివరిక్షణం వరకూ నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ కొనసా గుతుంది. తెలిసిందే కదా... చివరాఖరికి శుభం కార్డేసి... టీ కప్పులో తుఫానంటూ తుప్పుపట్టిన డైలాగొకటి వాడేసి తెరదించేస్తారు. విన్నవాళ్ళూ, చూసినవాళ్ళంతా మరోసారి అనవసరంగా నెత్తురుడికించు కున్నామనుకుంటూ నిట్టూరుస్తారు. పెజాస్వామ్యంలో ఇలాంటివి వుంటేనేగా రాజకీయం రంజుగాసాగేది.