22, జనవరి 2016, శుక్రవారం

మౌనం దారెటు?!

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విశాఖ జిల్లాలో వివిధ ప్రధాన రాజకీయ పార్టీలలో వేడి రాజుకుంటోంది. జనం మాట ఎట్టా వున్నా గెలుపోటముల లెక్కలు, టిక్కెట్ల కోసం సిగపట్లు, ఆధిపత్య కుమ్ములాటలు రానురాను ఎక్కువయ్యాయి. ఏమీపట్టనట్టు పైకి కనిపించే జనం మాట ఎట్టావున్నా ఆయా పార్టీల అధినాయకత్వం మాత్రం తలలు పట్టుకుంటోంది. అధికార బలంతో మదించి వున్న కాంగ్రెస్ పార్టీతో పాటు జీవితం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న టిడిపి, రేపటి అధికారం మాదేనని విర్రవీగుతున్న వైకాపలతో సహా ఎవ్వరూ ఈ విపరీతాలకు మినహాయింపుకాకపోవటమే ఇక్కడి విషాదం.
 విశాఖ జిల్లాలకు ఇద్దరు మంత్రులు. సీనియర్ మంత్రిగా పసుపులేటి బాలరాజు గిరిజన సంక్షేమ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తుంటే, చిరంజీవి అండతో మంత్రి పదవిని అందుకున్న గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మౌలిక వసతులు, పోర్టుల శాఖను నిర్వహిస్తున్నారు. విపరీతమైన చొరవ, ఏ పనినైనా తనకు సానుకూలంగా మార్చుకోగలిగిన చాతుర్యం కలిగిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదివిని చేపట్టిన తొలినాళ్ళ నుంచే తనదైన వేగంతో ముందుకు సాగిపోయారు. ఈ క్రమంలో తనదైన కోటరీని బలంగానే తయారు చేసుకున్నారు. తన కులపోళ్ళే అధికప్రాధాన్యమిస్తున్నారన్న అపకీర్తినీ ఆయన మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పిసిసి అధ్యక్షుడు, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యన్నారాయణకు దూరమయ్యారు. వీరి మధ్య విభేదాలకు కారణమేమిటన్నదానిపై ఇప్పటికీ బయటకు ఓ స్పష్టత రాకపోయినప్పటికీ ఏదో తెలియని ఎడం వారిద్దరి మధ్యా వుందన్న విషయాన్ని దాచుకోవటానికి వారిద్దరూ ప్రయత్నించటంలేదు. వాల్మీకి తెగనుంచి వచ్చి విద్యార్థి ఉద్యమం నాటినుంచే కాంగ్రెస్ రాజకీయాలలో ఢక్కామొక్కీలు తిని నేడు మంత్రిగా వున్న పసుపులేటి బాలరాజు వ్యక్తిత్వంలో మంత్రి గంటాకు పూర్తి భిన్నంగా వుంటారు. లోపిరికితో, అంతో ఇంతో ఆత్మనూన్యతాభావనతో బాలరాజు నిత్యం పోరాటం చేస్తూనే వుంటారు. బహుశా అందుకేనేమో అధికారులు తనకు సరైన గౌరవం ఇవ్వటం లేదంటూ రోజూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ వారిని దూరం చేసుకుంటూ వుంటారు. సహజంగా భిన్నధృవాలు ఆకర్షించుకోవాలి. ఎంతైనా అరాచకీయం కదా. ఈ భిన్నధృవాలు రెండు వికర్షించుకుంటున్నాయి. ఆ వికర్షణ ఎంత బలంగా వుందంటే దగ్గరకు చేరితే ఫెటేల్మని పేలేటంత. ఈ నేపథ్యంలోనే డిసిసిబి ఎన్నికలు రావటం, యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు నేరుగా బాలరాజును ఛీకొట్టడం జరిగింది. కన్నబాబురాజుపై ఎన్ని అవినీతిమరకలు వున్నా నిస్సిగ్గుగా వెనకేసుకు వచ్చిన మంత్రి గంటాకు ఏం లాభం ఒనగూడిందన్నది బయటపడేందుకు ఎక్కువ కాలమేమీ పట్టదు. అయితే అరాచకీయ క్రీడలో  పైచేయి సాధించిన గంటా, కన్నబాబు ద్వయంపై మంత్రి బాలరాజు కారాలూ మిరియాలూ నూరుతూనే వున్నారు. ఇప్పుడు ఆయనకు వాటిని వారిచేత తాగించటం ఎట్టానో తెలియాలి అంతే. వీరిద్దరి మధ్యా తగవులో జిల్లా ప్రజాప్రతినిథులు నిట్టనిలువునా చీలిపోయారు. బహుశా ఆ కోవలోకి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ధర్మాన కూడా చేరినట్లే కనిపిస్తోంది. బొత్సను దూరం చేసుకున్న గంటా వర్గం వ్యూహాత్మకంగానే మంత్రి ధర్మానతో అంటకాగుతోందని కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్లు గుసగుసలాడుతున్నారు. ఎట్టాగూ రేపటి ఎన్నికలలో గెలిచేనా చచ్చేనా అనుకుంటున్న తటస్థులు మాత్రం వినోదం చూస్తూ కూర్చున్నారు. 
ఇక తెలుగుదేశం పార్టీ. గత వైభవాన్ని తిరిగి సాధించుకోవటానికి అధినేత పడుతున్న పాట్లను సర్కస్ ఫీట్లు అనుకున్నారో ఏమో కానీ ఈ జిల్లాలో ఆ పార్టీ నేతలు ఏనాడూ సీరియస్ గా ప్రజా సమస్యలపై స్పందిచి ఆందోళనలు చేసిన పాపానపోలేదు. పార్టీ అనేక సార్లు ఇచ్చిన రాష్ట్ర వ్యాపిత పిలుపులకు మొక్కుబడి స్పందనతో మమ అనిపించటమే వీరికి తెలిసింది. చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యన్నారాయణ మూర్తి ... ఒకరు ఉప్పైతే మరొకరు నిప్పు. ఒకరు వచ్చిన ఉద్యమంలో మరొకరు కనిపించరు. అయ్యన్నను నమ్మకున్న నాయకులు, కార్యకర్తలు బండారు జోలికే పోరు. వీరిమధ్య అంతటి శత్రుత్వం నెలకొనటానికి కారణలేమిటన్నది ఆ పార్టీ కేడర్ కే ఇప్పటి వరకూ అర్థంకాలేదు. ఇక బయటవాళ్ళకెందుకు చెప్పండి. ప్రతీ చిన్నదానికీ రాజీనామా చేస్తానంటూ బెదిరించే అయ్యన్నపాత్రుడు మరోసారి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బండారు సత్యన్నారయణ మూర్తిని అవమానించారంటూ సస్పెండ్ చేసిన పీలా శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తనదైన శైలిలో చకచకా పావులు కదిపారు. జిల్లాలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన కోటరీలోకి చేరిపోయారు. కోటరీలకు దూరంగా వుండే విశాఖ తూర్పు ఎమ్మెల్యే కూడా కోటరీలో చేరి గ్రూపులు కట్టడం ఆపార్టీలో కొత్తగా ఊపిరిలూదుకుంటున్న కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనం. దీనికితోడు డిసిసిబి ఎన్నికలలో పార్టీ విప్ ను ధిక్కరించి కోట్లాదిరూపాయలకు ఎమ్మెల్యేతో సహా వివిధ సహకార సంఘాల అధ్యక్షులు అమ్ముడుపోవటంతో పరిస్థితి మరింత వికటించింది. అయితే దీనిని రాద్ధాంత స్థాయికి తీసుకువెళ్ళటంలో ఎందుకనో ఒకింత వివేచనాపూరిత సహనాన్ని ప్రదర్శించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్. జరిగిన విషయాన్ని అధిష్టానానికి నివేదించి తనకుకానీ, తన తండ్రి దాడి వీరభద్రరావుకు కానీ అయ్యన్న వర్గంపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషభావమూ లేదని చెప్పకనేచెప్పటానికి ప్రయత్నించారు. ఇన్ని పరిణామాల మధ్య ఏ కోటరీకీ చెందని వ్యక్తిగా, తనకంటూ ఓ శైలి వుందని నిరూపించుకోవటానికి నిరంతరం తాపత్రయపడుతున్న నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ ను అయ్యన్నవర్గం అనుచితరీతిలో దూరంగా పెట్టింది. ఒకటి రెండు సార్లు కలుపుకుపోవటానికి ప్రయత్నించిన వాసుపల్లి తన అహాన్ని చంపుకోవటానికి ఏమాత్రం సిద్ధపడకపోవటంతో సమస్య మరింత జఠిలమయ్యింది. దీనితో జిల్లా, నగర టిడిపి ప్రజాప్రతినిథి శ్రేణులు దాదాపుగా నిర్వీర్యమైపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే పోయే వాళ్ళు పొండి అంటూ అధినేత ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వెలగపూడి రంగంలోకి దిగారు. అయ్యన్నను, మిగిలిన ఎమ్మెల్యేలను చంద్రబాబు వద్దకు నడిపించారు. చివరికి అయ్యన్న చేత పార్టీలోనే కొనసాగుతానని, త్రిసభ్య కమిటీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని ప్రకటన ఇప్పించారు. దీనితో అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా రెండు వర్గాలనూ కలుపుతూ వేసిన అతుకు ఏ క్షణమైనా ఊడిపోయి మరింత దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ గొడవలతో జిల్లాలో పార్టీ కార్యకర్తలు పూర్తిగా నిరాశానిస్పృలకు గురయ్యారు. 
ఇకపోతే వైఎస్సార్ సిపి. ఆది నుంచీ ఈ జిల్లాలో కొణతాల రామకృష్ణ, సబ్బం హరి వర్గాలుగా పార్టీ చీలిపోయే వుంది. నగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో పట్టుకోసం అటు కొణతాల, ఇటు సబ్బం వర్గాలు హోరాహోరీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఆధిపత్యం కోసం కుస్తీపట్లు పడుతూ నే టిక్కెట్లు తెచ్చుకోవటానికీ తంటాలు పడుతూనే వున్నారు. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సీట్లను ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఆ పార్టీ అధినాయ కుడు ఒక స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. జిల్లాలో ఒక్క పశ్చిమ నియోజకవర్గం తప్ప మరేసీటూ ఖాళీలేదని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. విశాఖ ఎంపీగా పార్టీ అధినాయక కుటుంబం నుంచి ఒకరిని నిలబెట్టాలని భావిస్తోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ముభావంగానే వుంటోంది. ఆశావహులు మాత్రం ''అన్నీ పార్టీల తీరూ ఒక్కటే... బయటివాళ్ళనే అందలం ఎక్కిస్తారు'' అంటూ ఒకింత నిస్సహాయాగ్రంతో నిట్టూరుస్తున్నారు. ఎవరికి ఏ సీటన్న విషయాన్ని పక్కనపెడితే పార్టీ పరిశీలకులుగా నగరంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి సుజయ రంగరావు, ప్రసాదరాజులకు పెద్ద షాకిచ్చారు ఈ జిల్లా నేతలు. పనిచేసే వాడు ఎవ్వడో తెలుసుకుని పదవులు ఇవ్వండంటూ గండి బాబ్జీ తెగేసి చెప్పారు. నగర అధ్యక్షుడికి ప్రాధాన్యమివ్వకపోవటంపై ఒక వర్గం ఫిర్యాదు చేస్తే మరో వర్గం అసలు గుర్తించాల్సిన అవసరమే లేదంటూ తెంపరితనంతో తెగేసి చెప్పింది. అక్కడితో ఆగకుండా సమావేశాన్ని బాయ్ కాట్ చేసింది. దీనితో ఆధిపత్య పోరు ఈ పార్టీలోమరో సారి బహిర్గతమయ్యింది. ఎవరెంత జట్లు ముడేసుకున్నా జనం జగన్ వెంటేనంటూ డప్పుకొట్టిన వీరికి సహకార ఎన్నికలు ఎంతో కొంత నష్టం చేశాయి. కాదని బుకాయిస్తున్న ఆ పార్టీ నేతలు స్థానిక ఎన్నికలలో సత్తాచూపించటానికి సిద్ధమవుతున్నారు. 

ఏ పార్టీ అయినా ఒక్కటే. నాయకులంతా మూసలే. ఎవరు వచ్చినా ఒరగబెట్టేది, జీవితాలను మార్చేది ఏముంది అనుకుంటున్న మధ్యతరగతి జీవి మాత్రం జరుగుతున్న పరిణామాలను మౌనంగా చూస్తున్నాడు. ఈ మౌనం విస్ఫోటించి ఎవరిని గెలిపిస్తుందో అన్న ఆలోచన కార్యకర్తలను వేధిస్తున్నంత బలంగా నాయకు లకు లేకపోవటమే ఇక్కడి విషాదం.

క్యాష్ R క్యాస్ట్

రాష్ట్ర విభజనానంతరం ఏపీ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు ఇప్పుడో హాట్ టాపిక్. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిథిలో కమిషనర్ అఫ్ పోలీస్ నుంచి ఎస్సై పోస్ట్ వరకు కాష్ కన్నా కాస్టుకే ఎక్కువ ప్రాధన్యతని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో పోస్టింగ్ లు ఒకింత భిన్నంగా సాగుతున్నాయన్న వాదనా వుంది. కాష్, కాస్ట్ తో పాటు రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కీలక పోస్టులు... లేకపోతే ఎజెన్సీ యే గతి... నూతన ప్రభుత్వంలో హోంతో పాటు, జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో పైరవీలు జోరుగా సాగుతున్నాయని వాపోతున్న వారి సంఖ్యా ఎక్కువగానే వుంది. ఆయా మంత్రుల ఇళ్ల చూట్టూ ప్రదక్షిణాలు చేస్తు న్న వారి సంఖ్య తక్కువగా ఏమీలేదన్న వాదనా వుంది. కాష్ అయితే అక్కడో ఇక్కడో సర్దుబాటు చేసుకోవచ్చు... పోస్టింగ్ కు కాస్ట్ తో ముడిపెడితే ఎలా అన్న ఆవేదనావాదనా నడుస్తోంది. సామర్థ్యమన్న అంటరాని పదమే వినపడని విశాఖ పోలీస్ పోస్టింగ్ ల తీరు ఇదీ...
విశాఖ కమిషనరేట్ పరిథిలో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఫోర్త్ టౌన్, ఫిఫ్త్ టౌన్, ఆరిలోవ, పీఎంపాలెం, గాజువాక, పెందుర్తి, న్యూపోర్ట్, హార్బర్, పరవాడ, దువ్వాడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ వన్ పోలీస్ స్టేషన్లు కొన్నే. ఈ గ్రేడ్ లేమిటి? ఎప్పుడు పెట్టారు? కంగారు పడకండి. ఇది అనధికార పోలీస్ గ్రేడింగ్. మూడో కంటికి తెలియకుండా పెద్దగా పైకి డిమాండ్ చేస్తున్నట్లు కనిపించకుండానే జేబులు నింపుకునే యవ్వారం జోరుగా సాగే స్టేషన్లను గ్రేడ్ వన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. పారిశ్రామక వాడలు, ట్రాన్స్ పోర్టు, స్క్రాప్ వ్యాపారం జోరుగా సాగే గాజువాక, దువ్వాడ, పరవాడ పోలీస్ స్టేషన్లు ఈ పరిథిలో వున్నాయి. ఇక్కడ సిఐ సీటుకు సునాయాసంగా నెలకు మూడు నుంచి నాలుగు లక్షలు పక్కాదాయం పక్కా అని అది లేని పోలీస్ వర్గాలే ఒకింత అసూయతో చెపుతూంటాయి. ఇక్కడ పోస్టింగ్ ల కోసం సిఎం పేషీ స్థాయిలో పైరవీలు సాగుతాయన్న అతిశయోక్తి అలంకారమూ వినిపిస్తూంటుంది. గ్రేడ్ టు పోలీస్ స్టేషన్ లుగా హార్బర్, పీఎం పాలెం, న్యూ పోర్ట్ స్టేషన్లు వున్నాయి. రియల్ ఏస్టేట్ వ్యాపారం జోరు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీ సెజ్ లతో పీఎం పాలెం పిఎస్ పరిథి కళకళలాడుతూంటుంది. ముక్కుకు గుడ్డకట్టుకుని పిఎస్ లో కూర్చుంటే చాలు...  షిప్పింగ్ కంపెనీల నుంచి నెలసరి హార్బర్ పిఎస్ గడప వద్దకే వచ్చేస్తుంటూంది. ఇక ఈ కేటగిరీలో చివరిది... న్యూ పోర్టు పిఎస్. కేసులు లేకుండా కాసులు పండించే స్టేషన్ అని పోలీసులు మురిపెంగా పిలుచుకుంటారు. ప్రశాంతంగా సంపాదించుకుందామనుకునే మారాజులకు ఇది అత్తారిల్లు. ఇక చివరిది గ్రేడ్ త్రీ. కమిషనర్ కార్యాలయానికి దగ్గరగా ఉండే పిఎస్ లన్నింటినీ ఈ కేటగిరీలోకి నెట్టేశారు. ఒకట్రెండు పిఎస్ లకు గ్రేడింగ్ లు ఇవ్వటంలో ఒకింత తడబడి మరచినా అవేమీ తక్కువ తినలేదండోయ్.
ఇక జిల్లాకొస్తే... ఇక్కడ రెండే రెండు కాటగిరీలు...  ఒక కేటగిరీలోని పిఎస్ లు మైదానంలో వుంటే రెండో కేటగిరిలోని పిఎస్ లు ఏజెన్సీలో వుంటాయి. ప్లేయిన్ ఏరియాలోని పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కావాలంటే నిన్నటి వరకూ నడిచి ప్రాతిపదికలేమీ ఇప్పుడు నడవటం లేదని సమాచారం. ఇక్కడ పచ్చనోటుకు ఒకింత తళుకులద్దుతూ కులం... దానికి మరింత బలాన్ని ఇస్తూ రాజకీయ పలుకుబడి వుండాల్సిందే. ఇక ఎలాంటి పలుకుబడి లేని వారిని... సొమ్ములు అంతగా ఇచ్చుకోలేని వారిని, కుల బలం లేనివారినీ ఇక్కడకు ఉదారంగా పంపిస్తుంటారు. అదో పనిష్మెంట్ జోన్ అని ఈ అసమర్థ పోలీస్ లు భావిస్తే ఎవరేం చేయగలరు చెప్పండి. మావోయిస్టులతో యుద్ధం పేరిట నిరంతరాయంగా సాగే కూబింగ్ ఆపరేషన్లు, ఎక్కే కొండా... దిగే కొండా... కుటుంబానికి దూరంగా... ప్రశాంతంగా వుంటుంది. ఫిట్ గా వుండాలంటే ఏజెన్సీనే బెటర్ అంటూ మైదానంలో స్థిరపడిన అర్హులు ధీమాగా చెపుతూంటారు. మైదాన ప్రాంతాలలో కూడా చిన్నచిన్న తేడాలున్నాయండోయ్. నర్సీపట్నం రూరల్ లో నాతవరం, గొలుగొండ, కోటవురట్ల పిఎస్ లకు ఒక్కరే సిఐ వుంటారు. ఈ స్టేషన్ల పరిథిలో రంగురాళ్ళ తళుకులు రారమ్మంటూ పిలుస్తూంటాయి. ఇక్కడ పని చేయాలంటే రాజకీయం అండ కొండంతుండాల్సిందే. రోలుగుంట, కొత్తకోట, రావికమతం, మాకరవరపాలెం పిఎస్ లకు సిఐ కొత్తకోటలో వుంటారు. ఈ పరిథిలో లెక్కల్లోకి రాని గంజాయి రవాణా తెచ్చిపెట్టే పచ్చనోట్ల పెరపెరలు పెద్ద ఎత్తునే వుంటాయని వినికిడి. దీనికితోడు మాకవరపాలెం పిఎస్ పరిథిలోని ఆన్ రాక్ వంటి కంపెనీల అతిథ్యపు పలకరింపులు సరేసరి... కొయ్యూరు సిఐ పరిథిలోకి వచ్చే మండ, కె డి పేట, కొయ్యూరు స్టేషన్లు... ఈ సర్కిల్ ప్రాధాన్యతా క్రమంలో చివరదని వేరేగా చెప్పాలా చెప్పండి? హైవేలో జోరుగా దూసుకుపోయే అవకాశం... కుప్పలు తెప్పలుగా కంపెనీలు... అవి తెచ్చిపెట్టే సొమ్ములు... ఇవన్నీ కావాలంటే మాత్రం ఎలమంచలి, అనకాపల్లి రూరల్  సర్కిల్స్ ను ఎంచుకోవాల్సిందే. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, ఎలమంచలి టౌన్, రూరల్, అచ్యూతాపురం, రాంబిల్లి, అనకాపల్లి రూరల్ స్టేషన్ల పరిథిలో నెలకు ఎంత లేదన్నా కనిష్టంగా మూడు వరకూ వస్తుందని లెక్కలేసుకుంటున్నాయి కాకీలు.. 
సామర్థ్యం ఇప్పుడిక ఎంత మాత్రమూ ప్రాతిపదిక కాదు. మారుమనుస్సు పొందిన సీఎం చంద్రబాబు అవినీతి అంతం చూస్తామంటూ వేస్తున్న రంకెలు నిన్నటివి కావు... గతానుభవ పాఠాలు నేర్పిన మ్యావు మాటలే. డబ్బు పట్టు... కులాన్ని ముందుకునెట్టు... రాజకీయ నేతల కాళ్ళు పట్టు... ఓ మంచి పోస్టింగ్ కు ముచ్చటగా మూడు సూత్రా లంటూ వల్లె వేస్తోంది ఇప్పుడు విశాఖ పోలీస్. ఇదంతా నిజమేనా? అంటూ హాశ్చర్యపోకండి. నిజం దేముడెరుగు... నీరు పల్లమెరుగు... ఏదేమైనా నిలకడగా తెలిసేదే నిజమన్న మాటలో సత్యమెంతుంటుందో రేపు విశాఖ పోలీస్ కమిషనర్ పోస్టింగ్ తో తేలిపోదూ...?! అంటున్న వారి మాట ఒక్కసారి వింటే పోలా?

తత్వం తలకెక్కిందా?!

మారిపోతుందోయ్రా జకీయం మారిపోతోందోయ్... మహానుభావా సమించేయండి. మీ మాటను ఆడేసుకుంతు న్నను... అదేనండీ వాడేసుకుంతున్నాను, చిన్న మార్పు చేసి. ఇదైతే ఏగంగా బుర్రకెక్కుదని నాకెలిగిందంతే. ఎహే... ఈడతో ఇదొదిలేయండే. రాద్ధాంతం సేయాల్సిన ఇసయాలు మా జిల్లాలో బోలెడు జరిగిపోనాయి. అన్నీ అడక్కండి, ఒకటో రెండో సెపుతాన్లే...
మొన్నామద్దిన మా మంత్రిగోరి అబ్బాయి ఇవాహం, అబ్బో సాన గొప్పగా సేసీసినాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోరు, గవర్నర్ గోరూ... గంటాతో జోడున్నోళ్లంతా మా ఇసాకపట్నం వచ్చేశారు. ఒకటా? రెండా? లెక్కేయలేక సాలొచ్చీసినాది. ఈడో మీటింగు, ఆడో మీటింగని పరుగులెట్టీసినారు అధికారులు. ఇక ఖాకోడి పనైతే సెప్పన
క్కర్నేదు. ఎట్టుకోవద్దురా బాబూ అన్నా ఇనకుండా ఎర్రదో, బులుగుదో బుగ్గొకటెట్టేసుకుని బయలెల్లిన పెతీ కారుకీ ముందు కుయ్యో, కుయ్యో మంటూ పరుగులెట్టీసినారు. పెళ్ళికొచ్చామా... తిన్నామా... ఎల్లామా అన్నట్టుంటే సెప్పుకునేదేటుంటుంది. గంటోళ్ళింట్లో పెళ్ళికొచ్చీసిన పెతీ మంత్రిగోరూ సమీచ్చల పేరుతో  సేసీసిన హడావుడి అంతా ఇంతా కాదు. తనఖీల పేరుతో పెట్టిన పరుగులు సెప్పనక్కర్లేదు. స్వామి కార్యం, స్వకార్యం చూసుకున్నార్లే అని సరిపెట్టుకుందామనే అనుకున్నా... ఎదవలకి పనా పాటా... ఉదయాన్నే నిద్దరట్టక లేచొచ్చి ఆ గట్టుమీద కూర్చుని ఇదే వాగుడు. అక్కడ తింటానికొచ్చి ఇక్కడ మా నెత్తిన ఖర్చు రాసేశారు... ఇదేమిన్యాయం? అని. ఇదంతా నిజవే?! ఏవో... స.హ.చ. కార్యకర్తలకు అంత తీరికెక్కడుటుంది? పైగా దీనితో పెద్దగా ఒరిగే పెయోజనం మాత్రం ఏటుంటుంది? ఇంత కడుపుమంట నీకెందుకనేగా సివరికి మీరడిగేదీ... వత్తున్నా... వత్తున్నా... ఆడకే వత్తున్నా... నా జోడి ఓ ఇద్దరున్నారు. కలెట్టరాఫీసులో పనిసేసేవోడొకడు, పోలీసోడు మరోడు. వచ్చినాళ్ళను సవరదీయటంతో పులుసుకారిపోయి, ఇంటికెల్లి జావగారిన మోఖాలతో జారగిలపడ్డారు. మా మంత్రిగారబ్బాయి పెళ్ళి, ఎల్లొద్దామే అని ఇంట్లో సెప్పిన మాట అటకెక్కటంతో పెళ్ళాలు ముద్దెట్టలేదు. మరి కడుపు కాలదా. ఆల్లు చించుకుంటే నా కాళ్ళమీద పడింది.
ఎర్రనక్షత్రం... అదేనండీ పేదోళ్ళు, ఆళ్ళ బాధలు... ఏదన్నా సేత్తే బావుండు... కాని నా దగ్గర అంత డబ్బులు లేవు... అంటూ అరుంధతీ నక్షత్రంలా కనిపిస్తూంటాడే... ఆయనేనండీ పవన్ బాబు. మా బాబు సానా మంచోడు. గిరిజనుల గురించి ఆల్లూ ఈల్లూ మాట్టాడకుండా ఒల్లకుండిపోతే ఈ బాబే ఏకంగా సిఎంనే నిలేశాడు. ఒక్కడే వున్న జనసేనలోకి జనాన్ని ఎప్పుడు పోగేస్తాడో ఏమో కాని... కుసింత ఇసయం వున్నట్టే కనిపిస్తున్నాడు. ఏదైనా గుప్పెట తెరిస్తేగా తెలిసేది. నిజమేలే. అమరావతి భూముల వద్ద ఆరంభమైన ఈ పవనం అలా బాక్సైట్ మీదుగా ఉద్దానం కిడ్నీ రోగుల వద్దకు ఎల్తుందని ఏడేడి టీ తాగుతూంటే ఓ మాటొగ్గేసాడు మా బాహుబలి. ఆ మాట జాగ్రత్తగా సెవినేసుకుని వచ్చానో లేదో... కళ్యాణుడు, చంద్రుడితో బాక్సైట్ పై మాట్లాడాడంటూ బ్రేకింగు బద్దలైపోయింది. రేపో మాపో అడవి మీదుగా పవనుడు సాగే అవకాశాలున్నాయన్న వార్తలు గాలివాటంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే బాక్సైట్ వ్యవహారంలో గిరిజనుల దృష్టిలో పలచబడిన అధికార పక్షం మరింత బలహీనపడే అవకాశాలున్నాయన్న భయం పసుపుతమ్ముళ్ళల్లో బలంగానే వుంది.

దేవుడోటి తలస్తే... మనిషి మరోటి తలుస్తాడు... కొద్దిగా అటూ ఇటూ తిప్పి ఇక్కడ ఏసుకుందామే. కొద్ది రోజుల క్రితం గవర్నమెంటోరు ఓ ప్రకటన జారీ చేశారు. ఇళ్ళు లేని నిరుపేదలు, పొట్టచేతపట్టుకుని పనికోసం పట్టణమొచ్చిన కార్మికులు అక్కడా, ఇక్కడా ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారని గుర్తించామనీ, వారిని ఉద్ధరించటానికే మేం వున్నామని  సదరు ఏలిన వారు ఉదారంగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 60చ.గ.ల. లోపు ఆక్రమించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తామని, దరఖాస్తు చేసుకోవాలని వారు ప్రకటించారు. ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ నెల నాల్గవ తేదీ వరకూ విశాఖ జిల్లాలో 25వేల దరఖాస్తులు వచ్చాయని మంత్రి గంటా శ్రీనివాసరావు గొట్టాల ముందు ప్రకటించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదండోయ్. మొత్తం మీద 60 నుంచి 65వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నామని కూడా సెప్పేశారు. పేదల గురించి మంత్రిగోరికి కాక ఎవరికి తెలుస్తుందంటా? అని సరిపెట్టుకుందామనే అనుకున్నారు అంతా. ఓ చిన్నచిక్కచిపడిందిక్కడే. ఆ మద్దిన మంగమారి పేటలో యథేచ్ఛగా భూములు ఆక్రమించేస్తున్నారనీ, వారి వెనుక కీలకమైన మనిషిగా అధికార పార్టీలో సదరు నియోజకవర్గంలో వెలగబెడుతున్న  ఓ మనీషి వున్నారని వార్తలొచ్చేశాయి. అంతే, అప్పటి వరకూ చూసీచూడనట్లూరుకున్న రెవెన్యూవోల్లు, ఖాకీలను వెంటేసుకుని ఆక్రమణలను కూల్చేశారు. అంతా సద్దుమణిగిందిలే అనుకున్న తరుణంలో ఓ 100మందిని వెంటనేసుకుని పసుపుచొక్కాలు సర్కారీ గృహానికి వచ్చాయి. బయటచొక్కాలందరికీ పెద్దోడిగా వున్న ఓ పసుపు ఖద్దరు పసుపు నేత రెండుమూడు సార్లు మంత్రిగారి వద్దకు వెళ్ళొచ్చారు. ప్రకటన చేసిన మంత్రిగారు బయటకు వచ్చి తాజా ఆక్రమణలను క్రమబద్దీకరించమంటూ వచ్చిన వినతులను సహజాతమైన నవ్వుతూ విని బయలుదేరెళ్ళిపోయారు. అంతా జగన్నాటకం. సూత్రధారులెవ్వరు? పాత్రధారులెవ్వరు? పచ్చనోట్ల పెరపెరల మత్తు వదిలితే సత్యం నగ్నంగా నర్తిస్తూ కనిపిస్తుంది. భరించటం కొద్దిగా కష్టమే.
మహానుభావుడు... ఏమంటా సనిపోయాడో కాని... ఆయన సెప్పిన నీతి ఇప్పటికీ రాజ్యమేలతా వుంది. ''నీవు బరీగా తిను, ఎదుటోడికి ఎంగిలిచేయి ఇదుల్చు... పదికాలాల పాటు సల్లగా వుంటావు''. నిజమే, ఆకలిగా వున్నోడికి పెట్టిన చేయి పుర్ర చెయ్యా? కుడి సెయ్యా?... సూసేదెవ్వడు? తత్వం తలకెక్కిందా?!

15, జనవరి 2016, శుక్రవారం

అనుకోకుండా అలా ప్రయాణం...

క్షణాల్లో నిర్ణయమైన పర్యటన. ఎలాంటి ముందస్తు ప్రణాళికలూ లేని ప్రయాణం. అనుకోకుండా అలా
కుదిరిపోయిందంతే. భోగి మంటల వద్దకు ఉదయాన్నే వెళ్ళాల్సి వచ్చింది. తెల్లవారుఝామున నాలుగు గంటలకే బయలుదేరి అనిల్ అట్లూరిని తీసుకుని మురళీనగర్ చేరుకున్నా. అత్యంత వేడుకగా సాగుతున్న పండుగ చిత్రీకరణలో మునిగిపోయిన నాకు అనిల్ చెవిలో జోరీగలా మోగటం మొదలుపెట్టాడు. మూలాలు మిస్ అవుతున్నాం అన్న తన వేదన అర్థమవుతూనే వుంది. చేయగలిగింది ఏముంది? ప్రయాణం చాలా దూరం సాగిపోయింది.

మేం వచ్చామోచ్ అని చెపుదామని అప్పటికి మూడు సార్లు ఫోన్ చేశా. సమాధానం లేదు. ఎట్టకేలకు తిరిగ అరుణ పప్పు ఫోన్ చేశారు. భోగి వేడుకుల వద్దకు వచ్చారు. మా జూనియర్ తో కలిసి అందరం అరుణ ఇంటికి చేరుకున్నాం. వేడి వేడి టీ తాగుతున్న సందర్భంలోనే అడవి, వెన్నెల, చుక్కలు, దీపక్ చిత్రం... ఇలా మాటలు సాగాయి. వెళ్దామా అనుకుంటే వెళ్దామా అనుకున్నాం. సాయంత్రం మూడు గంటలకు ప్రయాణం స్టార్ట్ అనుకున్నాం. అర్థ గంట ఆలస్యంగా అరుణ ఇంటికి అనిల్, నేను చేరుకున్నాం. ఉదయం అనుకున్న ప్రయాణం మరిచిపోయి ప్రశాంతంగా చుట్టాల పాపతో ఆడుకుంటోంది. మమ్ములను చూసి నాలుకు కరుచుకుని హడావిడిగా బయలుదేరింది. కారు నేనే నడుపుతానని పట్టుపట్టింది. ఊరు దాటే వరకూ... కాదు ఘాటీ చివరికి చేరే వరకూ బిక్కుబిక్కు మంటూనే కూర్చున్నా. మధ్యలో చెరువు నీటిలో పడమటకి జారుతున్న సూర్యాస్తమయ దృశ్యపు నీడను చూసి ఠక్కున కారుదిగాం. నాలుగు చిత్రాలు తీసుకున్న అనిల్ ఆవురావురుమంటూ అప్పటికే సిద్ధంగా వున్న పులిహోర ఆహా అద్భుతహ అంటూ లాగించేశాడు. చీకటిపడింది. గాలికొండ వ్యూ పాయింట్ చేరుకున్నాం. చల్లటి హోరు గాలి. దుప్పటి కప్పుకున్నా వణికించేస్తోంది. చుట్టూ చిక్కటి చీకటి. అప్పుడుప్పుడూ వెళుతున్న వాహనాల కాంతి దృష్టిని ఇబ్బంది పెడుతోంది. చుక్కల పందిరిలో చాపం చంద్రుడు కాంతులీనుతూ మురిపిస్తున్నడు. అంత చలిలోనూ గట్టుపై అరుణ వెలికిల్లా పడుకుంది. ఆకాశం బోర్లించినట్లు బాగుంది అంటూ మురిసిపోయింది. నిశ్శబ్ధం ఎంత బాగుందో అనిపించింది చాలా కాలం తరువాత.

రయ్యుమంటూ దూసుకువచ్చిన కారు హఠాత్తుగా మా దగ్గర ఆగింది. అనిల్  పెద్దగా... ప్రణీత్ వచ్చేశాడోచ్ అంటూ కేక వేశాడు. ప్రణీత్ రాకతో కొత్త సందడి. మెల్లగా నడుచుకుంటూ కొద్ది దూరం నడిచాం. రోడ్డు వారా పిట్టగోడపై కూర్చున్నాం. తిరిగి వ్యూ పాయింట్ కు చేరుకున్నాం. వ్యూ పాయింట్ దగ్గర వున్న చలి హోరు పక్కకు నాలుగు అడుగులు వేస్తే లేకుండా పోవటం భలే గమ్మత్తనిపించింది. ప్రణీత్ ప్రేమతో 15కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చిన వేడివేడి పుల్కాలు రమ్మంటూ పిలిచాయి. వేడి పుల్కాలు, ఘాటైన శాకాహారం కూరలు. భలే వుంది జీవితం. ఎరక్కపోయి చేతులు చన్నీళ్ళతో కడిగా. అంతే గడ్డకట్టుకుపోయాయి. పరుగోపరుగు. ఒక్క గంతులో కారులోకి వెళ్ళి హీటర్ ఆన్ చేసుకుని కూర్చున్నా. కొద్ది సేపటికి ప్రాణం కుదుటపడింది. మెల్లగా తిరుగు ప్రాయాణమయ్యాం. ఘాట్ దిగేటప్పుడూ అరుణే డ్రైవింగ్ ఈ సారి మెరుగ్గా వుంది. సగం దూరం తరువాత నేను కొద్ది దూరం నడిపి నిద్ర వస్తోందంటూ చేతులెత్తేశా. యథాస్థానంలోకి వచ్చి గుర్రు పెట్టా ప్రశాంతంగా... మెలుకువ వచ్చే సరికి నగరంలో వున్నా... మరలా రేపటి పరుగు కోసం, కుసింత జవాన్ని సమకూర్చుకున్నానన్న తృప్తితో...