9, సెప్టెంబర్ 2014, మంగళవారం

చర్చజరగాల్సిందే

కలంలో ఇంకు పోయాలా వద్దా? పాళీకి పదునుపెట్టాలా వద్దా? గత కొద్ది రోజులుగా వున్న ఊగిసలాటకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇది మొదలు పెట్టిన సమయంలోనే టివిలలో కెటిఆర్ మాట్లాడుతున్నారు... ఎంఎస్ఓలకు, మీడియాకు మధ్య వున్నది వ్యాపార సంబంధం... 600 ఛానళ్ళ ప్రసార బాధ్యత మాది కాదు... మీరేమైనా తప్పు చేస్తే వారికి క్షమాపణ చెప్పుకోండి... ఆయన మాటలకు వేదికపై కోటులేసుకున్న బ్యూరోక్రాట్లు, ఇతరులు నవ్వటం... తాబేదారు పనులు చేయటానికి మాత్రమే అలవాటుపడిన
యంత్రాంగం అంతకంటే ఏం చేస్తుంది. ఇక్కడ మీడియా ఎవరన్నది సమస్యకానేకాదు. ఎబిఎన్, టివి 9... లేక వి6, టి ఛానలా అన్నది ప్రశ్నకాదు? వ్యతిరేక వార్తలు వ్రాస్తే కేసులు పెట్టడం, నచ్చని విషయాలను ప్రస్థావిస్తే మీడియాలను నిషేధించటం వంటి చర్యలు ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎవరికీ మంచిదికాదు. ప్రజాస్వామిక హక్కుల గురించి గొంతెత్తి కూసిన విప్లవకమ్యూనిస్టులు కానీ, వామపక్ష, విప్లవభావజాలం కలిగిన తెలంగాణ ఉద్యమకారులు కానీ సుమారు మూడు నెలల నిషేధంపైన ఏ మాత్రం గొంతెత్తకపోవటం... భయమా? లేక ప్రభుత్వ చర్యలను వారు కూడా సమర్థిస్తున్నారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షను వెల్లడించటానికి జరిగిన ఉద్యమం ఎన్నో సార్లు దుందుడుకు స్వభావాన్ని సంతరించుకుంది. తమ ఆకాంక్షలను బంద్ ల రూపంలో, వివధ నిరసన ప్రదర్శనల ద్వారా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేయటం ప్రజాస్వామికమని నమ్మిన నాటి గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు రూపం మార్చాడు. అదే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న మహిళా పాత్రికేయులును అరెస్టు చేయటం ఒక ఎత్తైతే... పోలీసులు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకోవటానికి అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు నేటి ఖాకీ స్వభావాన్ని మరో మారు బట్టబయలు చేసింది. విశ్వనగరంగా హైదరాబాదును మార్చాలనుకుంటున్న వారెవ్వరైనా తెలుసుకోవాల్సిన మరో విషయం... కేవలం భవనాలు, రహదారులు మాత్రమే విశ్వనగరానికి ప్రతీకలు కాబోవు. పరిఢవిల్లే ప్రజాస్వామ్యం, ఉచ్ఛనాగరికతలు మాత్రమే విశ్వనగరంగా హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయి. పోలీసు యంత్రాగాన్ని ఆధునీకరించటమంటే అధునాతన వాహనాలు, ఆయుధాలు సమకూర్చటం ఒక్కటే కాదు... మానవీయకోణాన్ని అద్దటం కూడా...

మరో విషాదాన్ని ఈ సందర్భంగా మాట్లాడేతీరాలి. ఇలాంటి వ్యవహరాలపై అటు పౌరసమాజంకానీ, ఇటు మీడియా ప్రపంచం కానీ స్పందించకపోవటం... ఇది కేవలం ఆ రెండు ఛానళ్ళ స్వంతవ్యవహారంగా చూడటం... నిజంగా దురదృష్టకరమే. ఎవరికి నచ్చని మీడియాను వారు నిషేధించుకుంటూ పోతే చివరికి ప్రజాస్వామ్యవ్యవస్థలో మూల స్థంభాలలో ఒకటిగా చెప్పుకునే మీడియా పూర్తిగా చచ్చిపోతుంది. నిరసన తెలుపుతున్న పాత్రికేయుల అరెస్టును ఖండించటానికి కూడా తెలంగాణ పాత్రికేయ ప్రపంచం సాహసించలేకపోవటం... నేడున్న పరిస్థితులలో నా రాతలు ఓ ఆంధ్రా పాత్రికేయుడి రాతలుగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోని పాత్రికేయులు చూస్తారన్న అనుభవానుమానం వెంటాడుతున్నా... నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఈ నిరసనలు జరుగుతున్న సమయంలోనే ప్రజలకోసం, ప్రజాస్వామిక విలువలకోసం కడవరకూ సాహితీసమరం చేసిన కాళోజీ శతజయంతోత్సవాలకు వరంగల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చారు. ఆయన ఎదుట తమ నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై పోలీసులు లాఠీఛార్జి, అరెస్టు

చివరిగా... ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణను బహిరంగంగా సమర్థించిన వ్యక్తిని. ఆయా సమూహాల ఆకాంక్షలను, వ్యక్తీకరణలను చిన్నబుచ్చటం సరికాదంటూ చెప్పటానికి ప్రయత్నించిన అనేకమందిలో నేనూ ఒకడిని. దీని అర్థం సంపూర్ణ ఆరాధన అనికాదు. ఈ వ్యవస్థలో, ఈ ప్రభుత్వాల ఏలుబడిలో చీలికలైనా, ఏకమైనా సామాన్యునికి ఒరిగేదేమీ లేదన్నది నా నమ్మిక. అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, నా అభిప్రాయాలను విస్పష్టంగానే చెపుతూవచ్చాను. ఇక్కడ కూడా నా అభిప్రాయాలకు భిన్నంగా వున్నా... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గౌరవిస్తూనే వచ్చాను. ఇది న్యాయమనే నమ్మాను. ఈ రోజు ఫెడరేషన్ పిలుపు
మేరకు విశాఖలో జరిగిన ప్రదర్శనలో దాదాపుగా అన్ని ఛానల్స్ కు చెందిన పాత్రికేయులు పాల్గొని మద్దతుగా నిలవటం మంచిపరిణామం. ఈ స్పిరిట్ తెలంగాణలో లేకపోవటం తప్పు పాత్రికేయులదా? యాజమాన్యాలదా? చర్చజరగాల్సిందే...

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

సమాజంలో భాగంగా, మీడియా తీరు తెన్నులు దశాబ్దాలుగా పరిశీలిస్తున్న పాఠకుడిగా, ప్రేక్షకుడిగా, నా స్పందన
1) "...నచ్చని విషయాలను ప్రస్థావిస్తే మీడియాలను నిషేధించటం..."
ఆ నచ్చని విషయం ఏమిటో చెప్పండి. మీరు చెప్పే నిషేధానికి దారి తీసిన సంఘటనలు, మీడియా తీరు కూడా వివరించండి, మీరు చెప్పే చర్చకు అది దారి తీసి, మీడియా సవ్యంగా ప్రవర్తించిందా అన్న విషయం కూడా బయటకు రావాలి కదా! గుడ్డిగా మీడియా స్వేచ్చ, మీడియా లేకపోతే ఏదో జరిగిపోతుంది అని ఊరికే పడికట్టు మాటలు మాట్లాడకండి. మీడియా తీరు తెన్నులు గత దశాబ్దంలో ఎంతగా దిగజారిపొయ్యాయో, అసలు మనకు మీడియా అనేది ఉన్నదా లేక కార్పొరేట్లు నడుపుతున్న వార్తా దుకాణాలా అన్న విషయం కూడా తేటతెల్లం అవ్వాలి.నిజమే చర్చ జరగాలి. మీ బ్లాగులోనే చర్చ మొదలు పెట్టండి.
2) "...అటు పౌరసమాజంకానీ, ఇటు మీడియా ప్రపంచం కానీ స్పందించకపోవటం..."
ఎందుకు స్పందించాలి. మీడియా పౌర సొమాజానికి చేస్తున్న మేలు ఏమిటి, ఐదు నిమిషాల కంటెంటుకు ఇరవై నిమిషాల చెత్త ప్రకటనలు వెయ్యటమా, ప్రతి న్యూసెన్సును తీసుకొచ్చి బ్రేకింగ్ న్యూస్ పేరిట ఇంట్లో చూపించటమా, చర్చల పేరిట పొద్దున్న ఒక పధ్ధతి ప్రకారం (I feel it is pre-planned) నానా యాగీ చేసుకునేవాళ్ళను చూపించటమా, చెత్త సీరియళ్ళను సంవత్సరాలకి సంవత్సరాలు సిగ్గు లేకుండా సాగతీసుకుంటూ చూపించటమా, పౌర సమాజం ఎందుకు స్పందించాలి. టి వి పెడితే చాలా జుగుప్సాకరమైన రీతిలో వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నారే, అదొక ప్రజా సమస్యగా మీడియా ఎప్పుడన్నా పొరబాటునన్నా స్పందించిందా. లేదు. అలా ఈ ప్రకటానా కాలుష్యాన్ని భరిస్తున్న పౌర సమాజం, ఆ కాలుష్యాన్ని కలుగ చేస్తున్న మీడియా మీద చర్య తీసుకుంటే (కాలుష్యం కలుగచేస్తున్నారన్న నేరం మీద కాకపోయినప్పటికీ) పౌర సమాజం ఎందుకు స్పందిస్తుందని మీరనుకుంటున్నారు.
3) "...ప్రజాస్వామ్యవ్యవస్థలో మూల స్థంభాలలో ఒకటిగా చెప్పుకునే మీడియా..."
సరిగ్గా చెప్పారు ప్రజాస్వామ్యవ్యవస్థలో మూల స్థంభాలలో ఒకటిగా "చెప్పుకునే మీడియా". అవును చెప్పుకునే మీడియానే. అది ఒకప్పటి మాట. ఇప్పుడున్న కార్పొరేట్ మీడియా ప్రజాస్వామ్యంలో భాగం కానే కాదు. దేశంలో ఉన్న అనేకానేక వ్యాపారాల్లో ఇదొక వ్యాపారం అంతే. లేక పోతే పైడ్ న్యూస్, ఒక్కొక్క చానెల్ ఒక్కొక్క రాజకీయ గొడుకు పట్టుకుని ఎందుకు వేళ్ళాడుతున్నాయి. ఇవ్వాళ మీడియా చూపించేది అంతా ప్రజాస్వామ్యం కోసమే!?
4) "...ఈ స్పిరిట్ తెలంగాణలో లేకపోవటం తప్పు పాత్రికేయులదా? యాజమాన్యాలదా? చర్చజరగాల్సిందే......"
అవును చర్చ జరగాల్సిందే. పైన 1) లో చెప్పినట్టుగా చర్చ జరగాల్సిందే. జరిపించండి వీలున్న వాళ్ళు వచ్చి పాల్గొంటారు. ఎమర్జెన్సీ సమయయంలో అప్పుడున్న పత్రికల మీద (అప్పుడు వాటికి మీడియా అనే పేద్ధ పేరు లేదు) సెన్సార్‌షిప్ విధిస్తే ప్రజాస్పందన వచ్చింది, తరువాతి ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇవ్వాళ?!, కొన్ని చానెళ్ళను ఒక ప్రాంతలో అసలు చూపించటమే బంద్ చేస్తే, ప్రజా స్పందనే లేదు. మీడియా కు ఇదొక Wake-up call. అది తెలుసుకుని మెలిగితే, స్వయం విమర్శ, స్వయం నియంత్రణ చేసుకోగలిగితే, ఇవ్వాళ మీడియాగా పేరొందిన సంస్థలు నిలబడతాయి. లేకపోతే.....

ఫీల్డ్ లెవెల్లో తీసుకొచ్చిన కంటెంట్ లో ఏది చూపించాలి ఏది చూపించకూడదు అన్న విచక్షణ 24 గంటల టి వి వచ్చినాక పోయిందని నా అనుమానం. అలా చూపించకుండా సంపాదకత్వ ప్రతిభ చూపిస్తే, అటువంటి సంపాదకుడికి మీడియాలో గౌరవం ఉన్నదా!? ఒకవేళ అటువంటి సంపాదకుడు ఉంటే (ఉండే ఉంటారు అక్కడక్కడా) ఆ వ్యక్తిని యాజమాన్యాం కంటే ముదుగానే , తోటి వాళ్ళే ఎద్దేవా చెసి స్థితి మీడియాలో ఉన్నదా లేదా చెప్పండి అలాంటి వాణ్ణి పనికిరానివాడికింద జమకట్టి, పైగా ఎదురు ప్రశ్న వేస్తారు, ఇలా సంపాదకుడు ఎడిట్ చేసుకుంటూ పోతే 24 గంటలు న్యూస్ చానేల్లో ఏది చూపించాలి? అని ఎదురు ప్రశ్న వెయ్యరూ!