15, జులై 2016, శుక్రవారం

సర్వ బ్రష్టత్వం

కొత్తగా బాధపడాల్సిందేమీ లేదు. ఎప్పటి నుంచో వున్నదే. రాజుల కాలం నుంచీ డబ్బాశ చేస్తున్న పాడు పని అంతా ఇంతా కాదు. హెచ్చు తగ్గులు సర్వసాధారణం. మరీ విశృంఖలమై పోయిందనప్పుడు ఒకింత బాధేస్తుంది. మళ్ళీ మామూలే. అవినీతి రహిత, పారదర్శక కమల పాలన గురించి మాట్లాడుకుంటున్న కాలంలో వున్నాం కాబట్టి ఇప్పుడు తాజాగా మాట్లాడవలసి వస్తోంది అంతే. 
చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పదువులు తీసుకున్న వారి నుంచి అంతో ఇంతో నిబద్ధతను, నిజాయితీని సమాజం ఆశిస్తూంటుంది. తాను కుళ్ళు కంపు కొడుతున్నా... వారు మాత్రం సెంటు వాసనేస్తూండాలని అనుకుంటూంటుంది. మా వాడు సిఐ అయ్యాడనో, ఐపిఎస్ అయ్యాడనో, ఏకంగా హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యాడనో సంబరాలు చేసుకునే విభజిత సామాజిక సమూహాలే ఐకాన్ లుగా చలామణీ అవుతున్న కాలంలో వున్నాం. పేదరికం ఎక్కడున్నా పోవాలంటూ చేసే నినాదం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయ్యింది. నా కులంలో పేదల గురించి పట్టించుకోండి, నా కులంలో అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయండి అంటూ చేసే పోరాటాలు... స్కిన్ టైట్స్ లా లేటెస్ట్ ఫ్యాషన్. ఇంతా ఎందుకు... ఇప్పుడు ఏ కులానికి ఏమయ్యింది? ఎవరికి నొప్పి కలిగింది? అనేగా మీ ప్రశ్న. అక్కడే వచ్చేస్తున్నా. మొన్నటికి మొన్న విశాఖలో ఓ సిఐ... మైనారిటీకి చెందిన అధికారి, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి వున్నాడంటూ ఎసిబి గాండ్రించింది. కోట్లాది రూపాయలు కూడగట్టిన అతని తీరును చూసి నగరం ముక్కన వేలేసుకుందని అమాయకులు చాలా మందే అనుకున్నారు. పెద్ద వార్తేసి ఘనంగా బాధ్యతను నెరవేర్చే శామంటూ పాత్రికేయులు సంకలు గుద్దేసుకున్నారు. గురువింద గింజకు తన నలుపు ఎప్పటికి కనపడేనూ?. ఆ విషయం పాతపడక ముందే మరో సిఐ ఎసిబి ఖాతాలోకి చేరిపోయాడు. ఈ సారి ఓ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. వీరిద్దరికీ ముందు అవినీతి తిమింగలం అంటూ చిక్కిన మరో అధికారి కూడా ఎస్సీనే కావటం యాధృచ్ఛికమే కావ చ్చు. అవినీతి తిమింగలాలు అన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలోనే వుంటున్నాయన్నట్లు చిత్రీకరిస్తున్నారంటూ ఆయా సామాజిక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. వివిధ శాఖలలో స్వంత పనులు చూసుకుంటూ, కోట్లలో వ్యాపారాలు చేస్తూ గుడిగుడి గుంజం గుళ్ళో రాగంలా ఇక్కడిక్కడే తిరగుతున్న ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన అధికారులు ఎసిబికి ఆనకపోవటం విచిత్రంగా వుందంటూ చేస్తున్న వాదన నిండు సత్యమే. నగరంలో ఓ పోలీస్ అధికారి లూప్ లైనులో వుండగానే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మెయిన్ లైనులోకి వచ్చి అమాయకపు తొడుగేసుకుని స్పీడు పెంచారని ఎవ్వరినడిగా చెప్పకనే చెపుతారు. ఇక రెవెన్యూ, ఆ శాఖ, ఈ శాఖలల్లో అయితే పదుల సంఖ్యలో ఆ పేర్లను గడగడా చదివేయచ్చు. పోస్టింగ్ ల కోసం కోట్లు ఇస్తున్నారన్న వాదనలు సరేసరి. ఇది వితండమనే వారూ వున్నారు. మా కులం, మా మతం అంటూ రాగాలు తీసే వారికి... అవినీతికి కులం వుండదనీ, డబ్బు వచ్చి చేరిన తరువాత... వున్నాడు, లేనోడు అన్నది మాత్రమే నిజమనీ అర్థమయ్యేదెన్నడో?! అంటూ వాపోయే వారు ఓ ఉదాహరణను గట్టిగానే చెపుతున్నారు. ఆ మధ్య నగరానికే చెందిన ఓ పోలీస్ అధికారి పెద్ద పంచాయతీకి పెద్దమనిషిగా వ్యవహరించారు. ఓ పక్షం తీసుకుని యాక్షన్ లోకి దిగినందుకుగాను సదరు అధికారికి కోట్లలోనే ముట్టాయని ఆ శాఖతో పాటు, నగరంలోనూ బహిరంగం గానే మాట్లాడుకున్నారు. ఇప్పుడు చెప్పండి. 
రెండేళ్ళుగా పాత్రికేయుల చుట్టూ తిరుగుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ మధ్యనే హార్డ్ వేర్ అవతారమెత్తి కనిపిస్తే ఆశ్చర్యమనిపించింది. ఎందుకిలా అయ్యాడా అని చూస్తే బోలెడు కథ బయటకు వచ్చింది. అవన్నీ చెప్పేస్తే ఇంకే మైనా వుందా? నాకూ బోలెడన్ని ఆఫర్లు వచ్చేయవూ?!. అయినా, ఉడికిందో లేదో తెలియటానికి ఒక్క మెతుకు చాలదండీ అంటూ చెప్పే పాత చింతకాయ పచ్చడి లాంటి సామెతొకటి వుండనే వుందిగా. కథలోకి వస్తే... ఓ విదేశీ యుడు దర్జాగా ఎలాంటి అనుమతులూ లేకుండా యథేచ్ఛగా విశాఖలో వ్యాపారం చేసుకుంటూ కోట్లు పోగేసుకుని హద్దులు దాటించేస్తున్నాడు. పనిలోపనిగా మన సాఫ్ట్ వేర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఓ ముప్పై లక్షలకు ముంచేశాడు. దీనితో గత్యంతరం లేక సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు అమాయకంగా. స్టేషన్ నుంచి కమిషనర్ కార్యాలయం వరకూ పాపం సుబ్రహ్మణ్యం... కలవని అధికారి లేడు. ఈ లోగా కోర్టుల్లో కేసులు వేశాడు. అనుమతు లు లేకుండా దర్జాగా ఊళ్ళో ఊరేగుతున్న తెల్లతోలు గురించి ఐబికి సమాచారం ఇచ్చాడు. సిబిఐతో మాట్లాడాడు. ఇలా ఎక్కే గడపా, దిగేగడపా. ఇప్పటికీ ఫలితం శూన్యమే. అవసరమైన సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ ఆర్టిఐ కమిషనర్ ఆశ్రయించాడు. సంబంధిత అధికారులకు అపారధ రుసుం చెల్లించాలంటూ తీర్పు వచ్చినా... బేఖాతర్. ఈలోగా తెల్లతోలుపై యాక్షన్ తీసుకోక తప్పని స్థితిలో పోలీసులు ఆయనను దేశరాజధానికి తీసుకువెళ్ళి విమాన మెక్కించి సాగనంపారు. అలా వెళ్ళి ఇలా వచ్చేసిన సదరు తెల్లదొర ఇప్పుడు రెండు పాసుపోర్టులతో, రెండు పాన్ కార్డులతో దేశంలో చలామణీ అవుతున్నారని వినికిడి. అయితేనేం... మూడో ఏడాది వస్తున్నా ఏ వ్యవస్థా స్పందించ ని తీరును చూసిన సదరు సాఫ్టవేర్ సుబ్రహ్మణ్యం... రాటుదేలిపోయాడు. ఎక్కడ ఏ కోర్టులో ఎవరి ముందు ఎలాంటి న్యాయం వస్తుందో తెలిసిపోయిందంటూ చెపుతూంటే నోరు తెరుచుకుని ఆ పాత సత్యాన్ని సరికొత్తగా వింటూం డిపోవాల్సిందే. ఇక్కడ నేరుగా ఎక్కడా నోట్లు కనిపించవు. ఎవరు ఎవరిని అజమాయిషీ చేస్తున్నారో అర్థం కాదు. అర్థమైన ఆ ఒక్క సత్యమూ ఏ చట్టం ముందూ నిలవదు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ వుంటారు. దుమ్మెత్తి పోసుకుంటారు. ఒకరి అవినీతిని మరొకరు నిస్సిగ్గుగా బయటేసుకుంటూ వుంటారు. తినగ తినగ వేమ తియ్య నుండు. ఇన్నేళ్ళు విన్న తరువాత అంతోకొంతో మనకూ అబ్బకుండా ఎలా పోతుంది? మురుగు నదీ మురికి కూపంలో నగరం వుంది. ఎన్నిసెంట్లు కొట్టినా, తలుపులు బిడాయించి ఏసీలు వేసుకుని బతికేద్దామనుకన్నా... అసాధ్యం బ్రదర్. బతుకు ఒకింత దుర్భరమే. బతికేయ్, అవసరం నీదైతే సొమ్ములు పడేయ్... అదే అవసరం ఎదుటోడిదైతే నోట్లు నొక్కేయ్. యుగధర్మాన్ని పాటించాల్సిందే. పాలకులు చెప్పేదీ అదే మరి. 

కామెంట్‌లు లేవు: