15, జులై 2016, శుక్రవారం

మరణం... నోటు... రాజకీయం


ఓ ఆత్మహత్య అధికారుల్లో కలవరానికి, ఆత్మశోధనకు కారణమయ్యింది. ఓ ప్రమాదం అడవికి పాకిన మైదాన సంస్కృతిని ప్రతిబింబించింది. ఓ మాట రెండు రైలు పట్టాల మధ్య మిత్రత్వాన్ని చాటింది.

తమిళనాడులో ఓ రైతు కుంటుంబంలో జన్మించాడు. కష్టనష్టాలు ఎరిగిన కుటుంబమే. అందకనేనేమో ఇష్టపడి చదువుకున్నాడు. ప్రఖ్యాత అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజ నీరింగ్ చదివిన శశికుమార్ ఐపిఎస్ కు 2012లో ఎంపికయ్యారు. క్షణం కూడా ఊపిరాడని, కఠిన పరీక్షలతో కూడిన శిక్షణను పూర్తి చేసుకుని ఆయన రాటుదేలారు. గ్రేహౌండ్స్ లోనూ, ఆళ్ళగడ్డలోనూ పనిచేసి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆరు నెలల క్రితం విశాఖ ఏజెన్సీకి బదిలీపై ఎఎస్పీగా వచ్చారు. చేయటానికి నేరుగా కనిపించని పని. మనిషి రాటుదేలినా, మనసింకా సుతిమెత్తగానే వుంది. అధివాస్తవిక ప్రపంచంలో గూడు కట్టుకున్నాడు. అందుకేనేమో అతి తక్కువగానే మాట్లాడతాడు. ప్రతీదీ నిబంధనల ప్రకారమే జరగాలంటూ మౌనంగానే గందరగోళపడతాడు. ఎవ్వరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ హామీని ఇచ్చే సున్నిత మనస్తత్వం. అందుకేనేమో పలచబడ్డాడు. తన ఖాకీలు చేస్తున్న తప్పులకు సామాన్యులు బలికావటాన్ని సహించలేని మంచితనం. అది చేతకానితనమని చిత్రించే అధికారయంత్రంగం అణువణువునా వున్న ప్రపంచం ఇది. ఇక్కడ తన స్థానమేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఎంత సంఘర్షణ. మూడు నెలల ప్రసవవేదన. రివాల్వర్ గొట్టాన్ని కణతలకు అనించుకుని దూసుకుపోయే తూటా ఏం చేస్తుందో తెలిసే... ట్రిగ్గర్ నొక్కటానికి ఎంత ధైర్యం కావాలి! దానిలో పాతిక శాతం ధైర్యం సరిపోదా బతకటానికి? సమాజంలో చట్టవ్యతిరేకుల పట్ల కఠినంగా వ్యవహరించటం ఎట్లాగో తెలిసిన మడిసతడు. చట్టరక్షకులే భక్షకులైతే ఏం చేయాలో తోచక తికమకపడ్డాడు. ఇక్కడ ఇమడ లేక, ఇమడలేని తనాన్ని ప్రపంచానికి చాటలేక, మంచితనానికి ఖాకీవనంలో చోటు లేదంటూ మరో ప్రపంచానికి వలసెళ్ళిపోయాడు. 
మానవత్వం గుభాళించే మంచి అధికారులు అవస రమైన సంక్షిష్ట సమయంలో ఇలా కోల్పోవటం నిజంగా బాధాకరం అంటూ ఓ సీనియర్ అధికారి ఒకింత నిజా యీతీగానే తడికళ్ళతో వ్యాఖ్యానించారు. విలువల వలు వలు విడిచి నిస్సిగ్గుగా నిలబడిన వ్యవస్థను చూడ టాని కి మనసులకు అసితకేశకంబళ్ళ ముసుగేయాలి. లేద నేగా చంపేశారు. వ్యవస్థ చేసిన హత్య ఇది అని ఒప్పు కునే ధైర్యం లేనందుకేకా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ వీరుడిపై పిరికి ముద్రవేశారు. వీరమరణాల నుంచి పాఠాలు నేర్చుకునే సంస్కారాన్ని మీరు తృణీకరిస్తే... ఎప్పుడోకప్పుడు ఈ సమాజమే మిమ్మల్ని త్యజిస్తుంది.
నిత్యం ఎంతో మంది అడవిబాట పడతారు. కొందరు జీవనం కోసం, మరికొందరు కాంక్రీటు వనంలో కోల్పోయి న జీవితాన్ని వెతుక్కుంటూ. కొండమీద వుండే వాడు ఎప్పుడన్నా కిందకు దిగినా, అరక్షణం కూడా ఇమడలేని తనంతో నిలబడని కాళ్లేసుకుని వెనక్కి పరుగులెడ తాడు. ఏమీ తెలియని పసోళ్ళకు కూడా అన్నీ నేర్పించే బుల్లి రంగు పెట్టెలు ప్రపంచమంతా ఒత్తుగా పరిచేసు కుంటున్నాయి. 
కొండెక్కుతాయి, చెట్టుక్కుతాయి. గడపగడపకూ నేను న్నానంటూ రేయింబవళ్ళూ అరిచి గోలెడుతుంటాయి. మనకు తెలియని, అవసరం లేని సరికొత్త విషాలను మన ప్రమేయమే లేకుండా చొప్పించేస్తుంటాయి. తెలుసుకునే సరికి మనం మనంగా మిగలం. అమాయకత్వం అన్న మాటకు అర్థం మారిపోతుంది. వెనకబాటుతనంపై యుద్ధం, హక్కుల కోసం పోరాటం మాటున అరాచకీయం సంఘ టితమవుతుంది. చేయి చేయి కలపాలంటూ పాఠాలు చెప్పిన జెండాల మాటకు విలువే లేకుండా పోతుంది. అసలు జెండా అవసరమే లేని రోజుల్లోకి ప్రయాణం సాగుతుంది. రోడ్డుపై రెండు వాహనాలు యుద్ధం చేస్తాయి. రెప్పపాటులో జరిగే విధ్వంసంతో నిత్యం ఎన్నో కుటుంబాల్లోకి విషాదం కాపురానికొస్తుంది. ఎవ్వరూ ఆర్చలేరు, తీర్చలేరు. తోడులేని తనాన్ని పూడ్చనూలేరు. నిన్నటి కథ ఇది. ఇప్పుడు ప్రతీ దానికీ రేటుంది. దెబ్బ సైజును బట్టి రేటు ఫిక్సవుతుంది. వేలు నుంచి లక్షల్లో బేరం సాగుతుంది. ఖాకీల సాక్షిగా గాంధీగారు చేతులు మారతారు. తప్పె వరిదన్న మాటకు ఇక్కడ ఆస్కారమేలేదు. సెక్షన్లు వేసే శిక్షల ప్రశ్నే రాదు. కాదన్నారా మీకు కొండపై బతుకే లేకుం డా చేస్తా మంటూ చుట్టేస్తారు. ఖాకీ అయినా, కలమైనా కన్నెత్తకుండా, పెదవి కదపకుండా ఎటెన్షన్ పొజిషన్ లో శిలలవ్వాల్సిందే. కదిలారా... కొండపైనోళ్ళతో పెట్టుకుంటే మసిచేసేస్తాం అంటూ హూంకరిస్తారు. ఇప్పుడే ఆలోచి స్తున్నారు. కొండెందుకెక్కాలి? కష్టాలెందుకు కొనితెచ్చుకోవాలి? కాపాడటానికి ఖాకీలున్నా లేనట్లే సాగేచోట అడు గెందుకెట్టాలి? ఇలాగే సాగితే రాకడలకోసం అరకు అల్లార్చుకుపోతుందన్న భయం ఇప్పుడు వాగవుతోంది. 


 అస్సలు సంబంధమేలేదు. ఇసుమంత పోలికైనా కనిపించదు. అయితేనేం చిక్కనైన అధికారాన్ని చి క్కించుకోవటానికి మిత్రబంధంతో ముడేసుకున్నారు. కలవని మనస్సులతో కలతల సంసారం. నిత్యం సాగు తూనే వుంది. స్టేజీ ఎక్కిన ప్రతీసారీ రంగేసుకునే కనిపిస్తారు. ఇదే నిజం అన్నంత సహజంగా జీవించేస్తారు. ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదన్నట్లు ప్రదర్శన సాగుతుంది. రాతలకు పాతబడి, మాటలకు అవకాశమే లేకుండా పోయిందని తట్టినప్పుడల్లా ముసుగులోంచి తొంగిచూస్తారు. మనస్సులో మాటలు, కపటంలేనట్లే కనిపిస్తా యి. సమాజమే దేవాలయం, దేవుడి సేవలో తరించటానికి మంచి మనుషులు కావాలి. ఎత్తుకెదగాలన్నా, ప్రపం చంలో మనకంటూ ఓ గుర్తింపు వుండాలన్నా... మీది కాని భాషలో మీరు పండితులై ఉండాలి. అద్దెకు తెచ్చుకున్న దుస్తులతో పరాయి సంస్కృతిని నెత్తినెట్టుకోవాలి. మనకంటే ముందున్న జపానోడు, చైనావోడు, జర్మనోడు... చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. ఆళ్ళవ్వరికీ అవసరమేలేని పరాయీకరణ. అవసరం కోసం మన కాడకొచ్చిన వాళ్ళని మెప్పించాలనుకునేటంత బానిసత్వం. అలాంటి వారికే మేయర్ పదవి కట్టబెట్టడానికి వెతు కున్నామంటూ ఘనత వహించిన విద్యాశాఖ మంత్రిగారు ప్రకటిస్తారు. ప్రజలతో సంబంధమేలేని, మమేకం కావటం అంటే అర్థమే తెలియని, ప్రజావసరాల రుచి తెలియని, రాజకీయం రంగే చూడని, డూడూ బసవన్నలే ఇప్పుడు కావాలన్న నిగూడార్థంలో వెలువడిన ప్రకటన ఓ ప్రకంపనే. దీనితో కమలం ఖంగుతిన్నది. ఇప్పటికే ఉప్పు, నిప్పుగా సాగుతున్న సంసారం మరోసారి వీథికెక్కింది. హుటాహుటిన సమావేశమయ్యింది. ఎలాంటి సంప్రదింపులు లేకుం డా ఏకపక్షంగా ఇలా ఎలా ప్రకటించేస్తారంటూ మండిపడింది. మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారంటూ కోప దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ప్రపంచమంతా మోదీ మంత్రాన్ని జపిస్తూ యోగాసనాలు వేస్తే, విశాఖలో మాత్రం ప్రధాని చిత్రానికి చోటే దక్కలేదని ఇప్పటికే కమలం కళ్ళెర్ర చేస్తోంది. ఫిర్యాదు చేయటానకి వెళితే కలెక్టర్ కూడా ఆ ఏముందిలే అన్నట్లు తేలికగా మాట్లాడటాన్ని కషాయధారులు జీర్ణం చేసుకోలేక పోతున్నారు. నాటకం రక్తికడు తోంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల నాటకం చివరంకంలో చివరిక్షణం వరకూ నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ కొనసా గుతుంది. తెలిసిందే కదా... చివరాఖరికి శుభం కార్డేసి... టీ కప్పులో తుఫానంటూ తుప్పుపట్టిన డైలాగొకటి వాడేసి తెరదించేస్తారు. విన్నవాళ్ళూ, చూసినవాళ్ళంతా మరోసారి అనవసరంగా నెత్తురుడికించు కున్నామనుకుంటూ నిట్టూరుస్తారు. పెజాస్వామ్యంలో ఇలాంటివి వుంటేనేగా రాజకీయం రంజుగాసాగేది. 

కామెంట్‌లు లేవు: